పంట నష్టం దిగులుతో రైతు ఆత్మహత్య
తిరుమలాయపాలెం: సాగుచేసి పంట దిగుబడి లేక, అప్పులు తీర్చే మార్గం కానరాక ఓ రైతు పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మండలంలోని పడమటితండాకు చెందిన అజ్మీర రాములు(38) మూడెకరాల్లో పత్తి, మిరప పంటలు సాగుచేశారు. చీడ పీడలతో దిగుబడి రాకపోవడంతో పెట్టుబడి కోసం తెచ్చిన అప్పులు తీర్చే మార్గం కానరాలేదు. దీంతో ఈనెల 25న ఆయన పురుగుల మందు తాగగా ఖమ్మం ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతున్న రాములు సోమవారం తెల్లవారుజామున మృతి చెందాడు. ఆయనకు భార్య రమాదేవి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా, రాములు మృతదేహం వద్ద వైఎస్సార్ టీపీ నాయకుడు నంద్యాల రవీందర్రెడ్డి తదితరులు నివాళులర్పించి ఆయన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
భర్త వేధింపులు తాళలేక...
ఖమ్మంఅర్బన్: నగరంలోని 14వ డివిజన్ మధురానగర్ రోడ్డునెంబర్–1కు చెందిన వివాహిత కె.యమున(29) ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కూలీ పనులకు వెళ్లే యమునను ఆమె భర్త నిత్యం తాగొచ్చి అనుమానంతో ఆమెను వేధిస్తున్నాడు. దీంతో సోమవారం ఆమె నివాస గృహంలో ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈమేరకు కేసు నమోదు చేసిన ఖమ్మం అర్బన్ ఎస్ఐ ఉమ ఇచ్చిన సమాచారంతో యమున మృతదేహాన్ని అన్నం పౌండేషన్ బాధ్యులు పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.