ఏపీ జేఏసీ చైర్మన్ విద్యాసాగర్
నగరంపాలెం: రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు కోరుకుంటున్న మధ్యంతర భృతి, కరువు భత్యం బకాయిలు ఇతరత్రా సమస్యల పరిష్కారానికై దశల వారీగా కృషి చేస్తానని ఏపీ జేఏసీ చైర్మన్ ఎ.విద్యాసాగర్ అన్నారు. శుక్రవారం గుంటూరు తాలుకా కార్యాలయ ఆవరణలోని పెన్షన్ హోమ్లో స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఏపీ అమరావతి ఆధ్వర్యంలో ఏపీజేఏసీ రాష్ట్ర నాయకుల అభినందన సభ, రాష్ట్ర విస్తృత కార్యవర్గ అత్యవసర సమావేశం నిర్వహించారు. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డి.వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు. అసోసియేషన్ సుదీర్ఘకాలంగా కోరుతున్న అడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్ పునరుద్ధరణకు సీఎం అంగీకరించడంపై ప్రత్యేక కృతజ్ఞతాభివందనాలు తెలిపారు. దీనికై సహకరించిన ఏపీజేఏసీ రాష్ట్ర నాయకత్వంలో ఏపీజేఏసీ చైర్మన్ విద్యాసాగర్, ఏపీజేఎసీ డిప్యూటీ సెక్రటరీ జనరల్ డీవీ రమణను సత్కరించారు. అనంతరం రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగ్గా, ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ ఫెడరేషన్ పిలుపుతో ఈనెల 29, 30 తేదీల్లో అన్ని జిల్లాల్లో జరిగే ధర్నా విజయవంతం చేయాలని సమావేశంలో నిర్ణయించారు. రాష్ట్ర అదనపు కార్యదర్శిగా ఎన్.కుమార్రాజా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్టేట్ సెక్రటరీ జనరల్ జి.ప్రభుదాస్, రాష్ట్ర కోశాధికారి ఎన్వీ.సుబ్బరాయుడు, సీనియర్ రాష్ట్ర నాయకులు అబ్దుల్కరీం, దాలి నాయుడు, పెద్దన్న గౌడ్ పాల్గొన్నారు.
గుంటూరు మెడికల్: ఏపీ ఎన్జీవో హోంలో ఏపీఎన్జీ జీఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఆలపర్తి విద్యాసాగర్, ప్రధాన కార్యదర్శి డి.వి.రమణలను సన్మానించారు. అసోసియేషన్ గుంటూరు జిల్లా అధ్యక్షుడు ఘంటసాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పెద్దసంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు.


