నరసరావుపేట: గత ప్రభుత్వం విడుదల చేసిన 2023 నోటిఫికేషన్ ద్వారా పశుసంవర్ధక శాఖలో యానిమల్ హజ్బెండరీ అసిస్టెంట్ (ఏహెచ్ఏ)లుగా నియమితులైన తమకు ప్రొబేషన్ ప్రకటించి, ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని కోరారు. ఈ మేరకు శుక్రవారం ఏహెచ్ఏలు కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేశారు. పల్నాడుకు చెందిన సుమారు వంద మంది ఏహెచ్ఏలు జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లాను కలిసి వినతిపత్రం సమర్పించారు. పలువురు ఉద్యోగులు మాట్లాడుతూ, 2024 మార్చి 1 నాటికి విధుల్లో చేరామని, ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారం శాఖాపరమైన డిపార్ట్మెంట్ పరీక్షలు, యాంటిసెడెంట్స్ తనిఖీలను ఫిబ్రవరి 2026 నాటికే విజయవంతంగా పూర్తి చేసుకున్నామని తెలిపారు. తాము పల్నాడు జిల్లాలో 169 మంది ఉండగా, ఉమ్మడి గుంటూరు జిల్లాలో 219 మంది ఉన్నారని పేర్కొన్నారు. అర్హతలన్నీ పూర్తయినా గత ఏడు నెలలుగా తమకు ప్రొబేషన్ డిక్లేర్ చేయకుండా తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నామని అన్నారు. నేటికీ రూ.15 వేలు మాత్రమే కన్సాలిడేటెడ్ పే ఇస్తుండటంతో, కుటుంబాలను పోషించుకోవడం అత్యంత భారంగా మారిందన్నారు. సుమారు 60 మందికి పైగా నాన్–లోకల్ సిబ్బంది సొంత జిల్లాలకు దూరంగా నరకయాతన అనుభవిస్తున్నారని అన్నారు. తమ సమస్యలపై కలెక్టర్తో పాటు పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ పి. రామారావుకు వినతిపత్రం అందజేశామని తెలిపారు.
కలెక్టరేట్ ఎదుట ఏహెచ్ఏల ఆందోళన


