గుంటూరు ఎడ్యుకేషన్: ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల కోసం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ప్రత్యేక టెట్ నోటిఫికేషన్లో ఉపాధ్యాయులకు ఎటువంటి మినహాయింపులు లేని దృష్ట్యా ఆ నోటిఫికేషన్ను సవరించాలని ఏపీటీఎఫ్ గుంటూరు జిల్లా అధ్యక్షుడు మేకల సుబ్బారావు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఏపీటీఎఫ్ (1938) ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి కె. నరసింహారావు మాట్లాడుతూ ప్రత్యేక టెట్ నోటిఫికేషన్లో ఉపాధ్యాయులందరికీ అర్హత మార్కులు 40 శాతంగా, పరీక్ష ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో నిర్వహించాలని డిమాండ్ చేశారు. బోధన సబ్జెక్టుల ప్రామాణికంగా పరీక్షలు నిర్వహించాలని, రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ పట్ల సానుకూల దృక్పథంతో ప్రత్యేక మినహాయింపుల కోసం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని కోరారు. సీనియర్ నాయకులు ఏవీ రామారావు మాట్లాడుతూ ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ఈ కార్యక్రమం నిర్వహించామని తెలియజేశారు. నిరసన ప్రదర్శనలో సంఘ రాష్ట్ర కౌన్సిలర్లు జి. వేళాంగిణి రాజు, భాస్కరరావు, జిల్లా సహాధ్యక్షుడు ఎం. సాయన్న, అదనపు కార్యదర్శి ఒ.నాగార్జున, ఉపాధ్యక్షులు ఆనంగి శ్రీనివాస్, ఎ. జోజప్ప, జిల్లా కార్యదర్శి వై. నాగమల్లేశ్వరరావు, నగర సహాధ్యక్షుడు ఎన్. ప్రసాద్, సీనియర్ నాయకులు ఎ.వి.రామారావు, ఎం. భాను, జె. సూర్యప్రకాశరావు తదితరులు పాల్గొన్నారు.


