● తెలుగువారి ఆత్మగౌరవానికి తూట్లు ● సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య ● వేలూరు సభలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఘాటు వ్యాఖ్యలు
చిలకలూరిపేట(యడ్లపాడు): హామీలు గాలిలో.. ప్రజల బతుకులు నేలపై.. ఇదే మోదీ పాలనలో దేశ పరిస్థితి అని, రాష్ట్రంలోని టీడీపీ సైతం మోదీకి మోకరిల్లిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య విమర్శించారు. సీపీఐ జాతీయ సమితి పిలుపులో భాగంగా నిర్వహించిన మార్పు కోసం ప్రజాయాత్ర పల్నాడు జిల్లా ముగింపు సభ మంగళవారం రాత్రి వేలూరులో జరిగింది. చిలకలూరిపేట ఏరియా కార్యదర్శి తాళ్లూరి బాబురావు అధ్యక్షతన జరిగిన సభలో ఈశ్వరయ్య మాట్లాడారు. దేశ సంపదను కాపాడాల్సిన ప్రధాని నరేంద్ర మోదీ.. చౌకీదార్ అంటూ..దాన్ని కొల్లగొట్టేవారికి కాపలాదారుగా మారారని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, ఓటు హక్కును కాపాడేందుకు ప్రజలు ఏకం కావాలని పిలుపునిచ్చారు. నోచుకోలేదన్నారు. అంబేడ్కర్ రూపొందించిన రాజ్యాంగం అణగారిన వర్గాలు, మహిళలు, రైతులు, పేదలకు హక్కులు కల్పించిందని ఈశ్వరయ్య అన్నారు. దాన్ని మార్చి మనుధర్మాన్ని అమలు చేయాలనే ఆలోచనలు ప్రజాస్వామ్యానికి ముప్పన్నారు. రాజ్యాంగ పరిరక్షణకు ప్రజాస్వామ్య శక్తులు సమన్వయంతో ఉద్యమించాలని కోరారు. తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారని గుర్తుచేసిన ఈశ్వరయ్య.. చంద్రబాబు మోదీ ముందు మోకరిల్లి అదే ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని విమర్శించారు. పవన్ కల్యాణ్ కూడా ప్రజా, విద్యార్థి సమస్యలపై ప్రశ్నించడం లేదన్నారు. సెప్టెంబరు 1న ఢిల్లీలో సీపీఐ చేపట్టే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈశ్వరయ్య పిలుపునిచ్చారు.
ఓటు హక్కుపై దాడి...
సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ మాట్లాడుతూ ఓటర్ల జాబితాల్లో అవకతవకలు, ఓట్ల తొలగింపుపై ఆందోళన వ్యక్తం చేశారు. యువత సంఖ్య పెరుగుతున్నా ఓటర్ల సంఖ్య తగ్గడంపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. సభకు ముందు చిలకలూరిపేట నుంచి వేలూరు వరకు ర్యాలీ నిర్వహించారు. పలువురు యువతకు ఈశ్వరయ్య పార్టీ సభ్యత్వాలు అందజేశారు. పల్నాడు జిల్లా సీపీఐ కార్యదర్శి ఎ.మారుతీ వరప్రసాద్, ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి షేక్ సుభాని, ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షుడు చంద్రనాయక్, నాయకులు చెరుకుపల్లి నిర్మల, బుదాల శ్రీనివాసరావు, షేక్ హుస్సేన్, ఉలవలపూడి రాము, బొంతా తిరుపతయ్య, దాసరి వరహాలు, వెంకట్, ధన్రాజ్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


