దుర్గి: వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మండల పరిధిలోని ఓబులేశునిపల్లె ఎస్సీ కాలనీలో మంగళవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... కొమ్ము ఇమ్మానియేలు (35) తన ఇంటి ఆవరణలో నిద్రిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి గొడ్డలితో తలపై దాడి చేయటంతో మృతి చెందాడు. ఇంటి లోపల ఉన్న తల్లిదండ్రులు కేకలు వేయటంతో ఆ వ్యక్తి పరారయ్యాడు. అదే కాలనీకి చెందిన కొమ్ము కుమార్ బాబుపై ఇమ్మానియేలు తండ్రి ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇమ్మానియేలు భార్య గత కొన్నేళ్లుగా పుట్టింటి వద్దే ఉంటోంది. గతంలో అనేక సార్లు ఇరువురు ఘర్షణ పడ్డారు. కుమార్బాబు భార్యతో ఇమ్మానియేలుకు వివాహేతర సంబంధం నేపథ్యంలో హత్య చోటుచేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలాన్ని గురజాల డీఎస్పీ ఉమా మహేశ్వరరావు, కారంపూడి సీఐ ఆవుల భాస్కర్రావు, స్థానిక ఎస్ఐ బి. గోపాల్లు సందర్శించారు.


