పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య
ఫిరంగిపురం: పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత కానందుకు మనస్తాపానికి గురై విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల కేంద్రంలో బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన పి.వినయకుమార్ (16) స్థానికంగా ఓ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. పదో తరగతి పరీక్షల ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించలేదు. మనస్తాపానికి గురై తన తాత పాపయ్య ఇంటికి వచ్చి ఫ్యాన్కు ఉరి వేసుకొన్నాడు. చుట్టు పక్కల వారు గమనించి విద్యార్థిని స్థానికంగా ఉన్న ప్రయివేటు వైద్యశాలకు తీసుకెళ్లారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యుడు తెలిపారు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు విలపిస్తున్నారు.
విద్యార్థిని రక్షించిన పోలీసులు
తాడేపల్లి రూరల్ : 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో మార్కులు తక్కువ వచ్చాయని ఓ విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేస్తుండగా బుధవారం తాడేపల్లి పోలీసులు కాపాడి తల్లిదండ్రులకు అప్పగించారు. సీఐ కల్యాణ్రాజు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరుకు చెందిన ఓ విద్యార్థికి 10 తరగతిలో తక్కువ మార్కులు వచ్చాయని మనస్తాపం చెంది తల్లిదండ్రులకు చెప్పకుండా ఇంటి నుండి వచ్చాడన్నారు. తల్లిదండ్రులు అరండల్పేట పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో అక్కడి సీఐ అప్రమత్తమై విద్యార్థి వద్ద సెల్ఫోన్ ఆధారంగా లొకేషన్ కనిపెట్టి తాడేపల్లి పోలీస్ స్టేషన్కు సమాచారం ఇచ్చారని పేర్కొన్నారు. నాలుగు బృందాలుగా తాడేపల్లి పోలీసులు వెతకగా తాడేపల్లి కృష్ణాకెనాల్ రైల్వే స్టేషన్ పరిధిలో ఉన్నట్లు గుర్తించారు. వారి తల్లిదండ్రులను పిలిపించి అరండల్పేట పోలీస్స్టేషన్కు పంపినట్లు సీఐ కల్యాణ్ రాజు తెలిపారు.
నకిలీ ఉద్యోగాల
ముఠాపై ఫిర్యాదు
తాడేపల్లి రూరల్: తాడేపల్లి రూరల్ పరిధిలోని ఉండవల్లిలో జనసేన పేరుతో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ పలువురు నిరుద్యోగులను నమ్మించి మోసం చేసిన వ్యక్తిపై బుధవారం జనసేన నాయకులు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా జనసేన తాడేపల్లి రూరల్ అధ్యక్షుడు సామాల నాగేశ్వరరావు, తాడేపల్లి పట్టణ సీనియర్ నాయకుడు అంబటి తిరుపతిరావు మాట్లాడుతూ ఉండవల్లి సెంటర్లో శివ అనే వ్యక్తి ఇల్లు అద్దెకు తీసుకుని జనసేన ఎంపీ, మంత్రుల పేర్లు చెప్పి ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ దరఖాస్తులు స్వీకరిస్తూ, నగదు వసూలు చేస్తున్నాడని తమ దృష్టికి వచ్చిందన్నారు. శివకు, అతని వెనుక ఉన్న ముఠాతో పార్టీకి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. పోలీసులు కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. రాష్ట్ర ఐటీ కోఆర్డినేటర్ చల్లాకుల కోటేష్, నియోజకవర్గ నాయకులు జొన్న రాజేష్, ఉండవల్లి గ్రామ అధ్యక్షులు రాజా రమేష్ పాల్గొన్నారు.
పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య


