సంబేపల్లె: మండలంలో భూగర్భ జలాలు అడుగంటి, బోరుబావులు ఎండిపోవడంతో వరి, వేరుశనగ, టమోటా, అలసంద, పశుగ్రాసం పంటలు నిట్టనిలువునా ఎండుతున్నాయి. శెట్టిపల్లె గ్రామం కస్పా సమీపంలో పంటల దయనీయ స్థితి ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. ఇక్కడ నదులు, వాగులు లేకపోవడంతో రైతులు పూర్తిగా బోర్లపైనే ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు. పంటలను కాపాడుకునేందుకు అప్పులు చేసి కొత్త బోర్లు వేస్తున్నప్పటికీ, మోటార్లు అమర్చే సమయానికి భూగర్భ జలాలు తగ్గి చుక్క నీరు రాకపోవడంతో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. మరోవైపు కొందరు కేటుగాళ్లు చెరువుల్లో మట్టిని, వంకల్లో ఇసుకను ఇష్టారాజ్యంగా తోడేస్తుండటంతో భవిష్యత్తు మరింత ప్రమాదకరంగా మారుతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి తమను ఆదుకోవాలని రైతన్నలు వేడుకుంటున్నారు.


