సంబేపల్లె: మండలంలో వర్షాభావ పరిస్థితుల వల్ల పచ్చిగడ్డి కరవై, వరిగడ్డి ధరలు భగ్గుమంటుండటంతో పాడి రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గతంలో ఏడాదికి సరిపడా గడ్డి వాములు వేసుకునే రైతులు, ప్రస్తుతం యంత్రాలతో వరి కోతలు కోయించడం వల్ల గడ్డి లభ్యత తగ్గి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత ఏడాది రూ. 12,000 ఉన్న ట్రాక్టర్ వరిగడ్డి ధర ఈ ఏడాది ఏకంగా రూ. 25,000 కు చేరింది. సింగిల్ వరిగడ్డి కట్ట ధర రూ. 230 పలుకుతోంది. పచ్చిగడ్డి కొనాలన్నా కేజీ రూ. 15 చెబుతున్నారని, రెండు ట్రాక్టర్ల వరిగడ్డి కోసం ఏకంగా రూ. 50 వేలు ఖర్చు చేయాల్సి వచ్చిందని బాధిత పాడిరైతు శివయ్య ఆవేదన వ్యక్తం చేశారు. పశుపోషణ భారం కావడంతో పాడి పరిశ్రమ సంక్షోభంలో పడే ప్రమాదం ఉందని, ప్రభుత్వం తక్షణమే స్పందించి సబ్సిడీపై పశుగ్రాసం లేదా సైలేజ్ను అందించి ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.


