రొంపిచెర్ల : అన్నమయ్య జిల్లా పీలేరు మండలం శ్రీనివాసపురం కాలనీకి చెందిన కృష్ణయ్య (75), రాజమ్మ (70) దంపతులకు సొంత ఇల్లు, సెంటు భూమి లేదు. కొడుకు, మనవడు చనిపోవడంతో ఆదరించే దిక్కులేక పదేళ్ల క్రితం రొంపిచెర్లకు వలస వచ్చారు. భర్తకు కళ్లు కనపడకపోవడంతో రాజమ్మ, ఆమె చెల్లెలు పాపులమ్మ (68)తో కలిసి భిక్షాటన చేస్తూ, ప్లాస్టిక్ సీసాలు అమ్ముకుంటూ భర్తను పోషిస్తోంది. వీరికి ఆధార్, బియ్యం కార్డులు లేకపోవడంతో ఎలాంటి ప్రభుత్వ పథకాలు, పింఛన్ అందడం లేదు. స్థానిక ఆటో డ్రైవర్ మహ్మదాలీ తన సొంత స్థలంలో ఒక పూరి గుడిసె వేసి వీరికి ఆశ్రయమిచ్చాడు. కళ్యాణ మండపాల వద్ద అడుక్కుని తెచ్చే అన్నమే వీరికి గతి. పెళ్లిళ్లు లేని రోజుల్లో పస్తులుండాల్సి వస్తోంది. కాగా, గురువారం ఉదయం ఆకాష్ పాఠశాల పక్కన ఎవరో రోడ్డు పక్కన చెత్తలో పారేసిన, వండడానికి పనికిరాని మగ్గిన బియ్యాన్ని చూసి రాజమ్మ కళ్లకద్దుకుని సంచిలో వేసుకుంటున్న దయనీయ దృశ్యం స్థానికులను తీవ్రంగా కలిచివేసింది. ఇప్పటికై నా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి మానవత్వంతో వీరికి ఆధార్, బియ్యం కార్డులు మంజూరు చేసి, పింఛన్ ఇప్పించి ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు.


