కడప కోటిరెడ్డిసర్కిల్ : ఆర్టీసీ ఉద్యోగుల హక్కులు, సంక్షేమం, ఉద్యోగ భద్రతకు సంబంధించి ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో వీసీ–ఎండీ, యాజమాన్యంతో చర్చలు జరిపామని.. ఉద్యోగులకు భద్రతతో పాటు భరోసా కల్పించేలా పలు అంశాలపై ఒప్పందాలు సాధించామని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆర్టీసీ జేఏసీ కో–కన్వీనర్ జీవీ నరసయ్య తెలిపారు. ఉద్యోగుల సమస్యలపై రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. బుధవారం కడప నగరంలోని వైఎస్సార్ మెమోరియల్ ప్రెస్ క్లబ్లో కడప జోన్కు చెందిన ఎనిమిది జిల్లాలు, కడప నాన్ ఆపరేషన్ రీజియన్కు చెందిన నాయకులతో జోన్ ఎగ్జిక్యూటివ్ సమావేశం జరిగింది. జోనల్ అధ్యక్షుడు పీఎస్ ఖాన్ అధ్యక్షతన, జోనల్ కార్యదర్శి యన్.రాజశేఖర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికిజీవీ నరసయ్య ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఆర్టీసీని,ఆర్టీసీ ఉద్యోగులను పరిరక్షించడమే లక్ష్యంగా ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ పనిచేస్తోందన్నారు. అందులో భాగంగానే ఆర్టీసీలో జేఏసీని ఏర్పాటు చేసి, ఐక్య ఉద్యమాల ద్వారా ఉద్యోగుల సమస్యలపై యాజమాన్యంతో చర్చలు జరిపి సాధ్యమైన ప్రతి సమస్యకు పరిష్కారం చూపించే దిశగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. ఈయూ స్టేట్ అడిషనల్ సెక్రటరీ ఎండీ ప్రసాద్ మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి జేఏసీ చేసిన పోరాటాల ఫలితంగానే పలు అంశాలపై యాజమాన్యం సానుకూలంగా స్పందించిందన్నారు.రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఆవుల ప్రభాకర్ మాట్లాడుతూ ఐక్యంగా ఉంటేనే హక్కుల సాధన సాధ్యమవుతుందన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు యం.రామాంజనేయులు పీఎన్బీ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు మద్దిలేటి, కె.కె.కుమార్, నబీరసూల్, మురగమ్మ, మజీద్, రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శులు వి.వెంకటేశ్వర్లు, నాగార్జునరెడ్డి, విజయకుమార్, రాష్ట్ర సహాయ కార్యదర్శులు దేవసహాయం, పి.ఎస్.ఎస్.కుమార్, బి.వి.ఎస్.ఎల్.దేవి, జోనల్ కమిటీ సభ్యులు, నాన్–ఆపరేషన్ రీజియన్ నాయకులు, కడప జోన్ పరిధిలోని ఎనిమిది జిల్లాల అధ్యక్షులు, కార్యదర్శులు, జిల్లా స్థాయి నాయకులు, పాల్గొన్నారు.


