మదనపల్లె సిటీ: పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ సుబ్రమణ్యం తెలిపారు. ఈ నెల 16వ తేదీ నుంచి జరిగే పరీక్షలకు జిల్లాలో రెగ్యులర్ విద్యార్థులు 21,526 మంది, సప్లిమెంటరీ విద్యార్థులు 6,23 మంది ఉన్నారన్నారు. వీరి కోసం 124 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. పరీక్షలకు సంబంధించి జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ (నంబర్–910040686) ఏర్పాటు చేశామని తెలిపారు.
మదనపల్లె: పశ్చిమాసియా యుద్ధప్రభావంతో గ్యాస్ సిలిండర్ల కొరత నెలకొనడంతో మదనపల్లెలో హోటళ్లలో ధరలు పెంచేశారు. మొన్నటిదాకా ఉన్న భోజనం, అల్పాహార ధరలు లేవు. వాటిపై అదనంగా రూ.5 నుంచి రూ.20 వరకు పెంచేశారు. దాంతో హోటళ్లలో భోజనం చేసేవారి జేబులకు చిల్లు పడుతోంది. దీనికి హోటళ్ల యజమానులకు కారణం చెబుతూ గోడలపై ప్రకటనలు అతికించారు. గ్యాస్ కొరత వల్ల భోజనం, టిఫిన్ రేట్లు పెంచామని చెబుతున్నారు. వాణిజ్య అవసరాలకు సరఫరా చేసే గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం లేదని, దీంతో రూ.1,840 ధర కలిగిన ఈ సిలిండర్లపై అదనంగా రూ.వెయ్యి చెల్లించి కొనుగోలు చేయాల్సి వస్తోందని కొందరు హోటళ్ల నిర్వాహకులు పేర్కొంటున్నారు.


