
గురువులపై దిద్దుబాటు బరువు
మదనపల్లె సిటీ: కూటమి ప్రభుత్వం విద్యావిధానాలు విద్యార్థులతో పాటు గురువులను గందరగోళానికి గురి చేస్తున్నాయి. సెల్ఫ్ అసెస్మెంట్ విధానం ఉపాధ్యాయులకు తలనొప్పిగా మారింది. మార్కుల నమోదు, రికార్డుల అప్లోడ్ తదితర పనులతో బోధనకు సమయం ఉండదని, విద్యా ప్రమాణాలు కుటుపడున్నాయని ఉపాధ్యాయుల వాదన. కొత్త విధానంలో ప్రతి విద్యార్థికి సబ్జెక్టు ఒకటి చొప్పున అసెస్మెంట్ పుస్తకాన్ని నిర్దేశించారు. అందులోనే ఏడాది పాటు నిర్వహించే పరీక్షల జవాబు పత్రాలు, ఓఎంఆర్ షీట్లు, ప్రాజెక్టు వర్క్ మార్కుల పట్టికల పేజీలను జతచేశారు. ఏడాదికి నాలుగు సార్లు జరిగే ఫార్మెటివ్ పరీక్షలకు 35 మార్కులతో పాటు స్టూడెంట్ హ్యాండ్ రైటింగ్, రెస్పాన్స్, ప్రాజెక్టు వర్క్ల పేరుతో 5 మార్కుల వంతున మరో 15 మార్కులు నమోదు చేయాలి. ఏడాదికి రెండు సార్లు జరిగే సమ్మెటివ్ పరీక్షలను 80 మార్కులు వంతున నిర్వహిస్తారు.
జిల్లాకు 4,59,405 లక్షల పుస్తకాలు:
ప్రాథమిక పాఠశాలల్లో 1,2 తరగతులకు మూడు సబ్జెక్టులుంటాయి. అధే విధంగా 3,4,5 తరగతులకు నాలుగు, 6,7 తరగతులకు 6 సబ్జెక్టులు, 8 నుంచి 10 తరగతి వరకు ఏడు సబ్జెక్టుల పుస్తకాలు ప్రతి విద్యార్థికి ఉంటాయి. వీటిని విద్యా సంవత్సరం ఏడాది పాటు మాత్రమే కాకుండా ఆ విద్యార్థి స్కూల్ నుంచి బయటకు వెళ్లిన తర్వాత కూడా భద్రపరచాల్సి ఉంటుంది. జిల్లాలో 2,191 పాఠశాలల్లో 1 నుంచి 10 తరగతి చదువుతున్న విద్యార్థులకు అన్ని సబ్జెక్టులకు 6,90,333 పుస్తకాలు కావాల్సి ఉండగా 4,59,405 అసెస్మెంట్ పుస్తకాలు వచ్చాయి. ఈనెల 11నుంచి పరీక్షలు నిర్వహిస్తున్నారు. అసెస్మెంట్ పుస్తకంలో విద్యార్థులు తమ అపార్ నంబరు, పరీక్ష కోడ్ రాసి బబ్లింగ్ చేయాలి. పుస్తకంలో జవాబులు రాయడంతో పాటు అందులో పొందుపరిచిన ఓఎంఆర్ షీట్ సరైన సమాధానాలకు బబ్లింగ్ చేయాలి. వీటిని సరిగ్గా ఉండేలా ఉపాధ్యాయుడు చూడాలి. వెంటనే మూల్యాంకనం చేయాలి.
ఉపాధ్యాయులను ఆందోళనకు
గురి చేస్తున్న అంశాలు:
● పరీక్షల అనంతరం అదే రోజు లేదా తక్షణం మూల్యాంకనం చేసి రిపోర్టులు పంపాల్సి రావడం.
● ఆన్లైన్ సాఫ్ట్వేర్ ద్వారా మార్కుల ఆప్లోడ్లో సాంకేతిక సమస్యలు.
● చిన్న పాఠశాలల్లో ఒకే ఉపాధ్యాయుడు అన్ని బాదద్యతలు చేపట్టడం వల్ల పాఠ్యాంశాల బోధనకు సమయం ఉండదు.
● ప్రతి విద్యార్థికి సబ్జెక్టుకు ఒక పుస్తకం ఉండడం వల్ల వాటిని ఏడాది పాటు స్కూల్లో సంరక్షణ క్లిష్టతరం.
సమయం పెంచాలి
అసెస్మెంట్ విధానంలో పరీక్షలు నిర్వహించడానికి ప్రస్తుతం నిర్దేశించిన సమయం సరిపోదు. ఒక్కో విద్యార్థితో పుస్తక రూపంలో జవాబు పత్రాలను రాయించడం కష్టతరమైన పని.అసెస్మెంట్ పుస్తకాన్ని విద్యార్థి భద్రంగా ఉంచకపోతే ఉపాధ్యాయలకు రిమార్కు, విద్యార్థులందరికీ సబ్జెక్టు వారీగా ఆ పుస్తకాలను ఏడాది పాటు భద్రంగా ఉండచడం ఉపాధ్యాయులకు భారంగా మారుతుంది. –పురం రమణ, యూటీఎఫ్ జిల్లా కారదర్శి
ఏకోపాధ్యాయ పాఠశాలలో అమలు సాధ్యం కాదు
ప్రాథమిక విద్య పరీక్ష విధానంలో నూతనంగా అమలు చేస్తున్న సెల్ప్ అసెస్మెంట్ బుక్ సిస్టం ఏకోపాధ్యాయ పాఠశాలలో సాధ్యం కాదు. విద్యార్థి అభ్యసన సామర్థ్యం ఆధారంగా ఆ స్కూల్ టీచర్ చేతే ప్రశ్నపత్రాన్ని రూపొదించే విధానం ఇందులో తీసుకురావాలి. అదే విధంగా ప్రశ్నపత్రాలలో సరళమైన భాష వాడాలి. –మధుసూదన్, ఎస్టీయూ జిల్లా కార్యదర్శి
అసెస్మెంట్ విధానంలో పుస్తక మూల్యాంకనం
ఒక్కో సబ్జెక్టుకు ప్రత్యేకంగా పుస్తకాలు
ఉపాధ్యాయులదే మూల్యాంకన బాధ్యత
తలలు పట్టుకుంటున్న గురువులు

గురువులపై దిద్దుబాటు బరువు

గురువులపై దిద్దుబాటు బరువు