
కిక్కుకు.. పర్మిట్!
● మద్యం షాపులకు అనుగుణంగా పర్మిట్ రూములు
● నెలాఖరుకు గ్రీన్ సిగ్నల్
ఇచ్చేందుకు కసరత్తు
● అప్పటివరకు కూడా ఆగని మద్యం వ్యాపారులు
● ఇప్పటికే అనధికారికంగా ఏర్పాటు
తకడప వైఎస్ఆర్ సర్కిల్ : మద్యం షాపులకు అనుబంధంగా పర్మిట్ రూముల ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం పచ్చ జెండా ఊపేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం బార్ అండ్ రెస్టారెంట్ అనుమతి పునరుద్ధరణ ప్రక్రియ జరుగుతోంది. దీనిని ఈ నెలాఖరుకు పూర్తి చేయడంపై ఎకై ్సజ్ శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే మద్యం షాపులకు అనుబంధంగా పర్మిట్ రూముల ఏర్పాటుకు మార్గదర్శకాలు వెలువడనున్నాయి. వాస్తవానికి మద్యం షాపులు ప్రారంభమైనప్పటి నుంచే వాటి యజమానులు చాలా చోట్ల గుట్టు చప్పుడు కాకుండా పర్మిట్ రూములు ఏర్పాటు చేసేశారు. ఇప్పుడు ప్రభుత్వమే దీనికి అనుమతులు ఇస్తుందన్న సమాచారంతో ఇంకా విచ్చల విడిగా పర్మిట్ రూములు తెరిచి పూర్తిగా తాగించేస్తున్నారు. గ్లాసులు, వెజ్, నాన్ వెజ్, స్నాక్స్ ఏర్పాటు చేసి మరీ విక్రయిస్తున్నారు. అర్థరాత్రి వరకు తెరిచే ఉంచుతున్నారు. దీంతో మందుబాబులు అక్కడే తాగి తూలుతుండడంతో అటుగా వెళుతున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు
పర్మిట్కు రైట్ రైట్...
మద్యం ద్వారా వస్తున్న ఆదాయాన్ని మరింతగా పెంచుకునేందుకు కూటమి ప్రభుత్వం కొత్త మార్గాలు వెతుకుతోంది. ఇందులో భాగంగా మద్యం దుకాణం వద్దే పర్మిట్ రూములకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించింది. ఈ విధానాన్ని పునః ప్రారంభించే దిశగా ఎకై ్సజ్ శాఖ ఇప్పటికే కసరత్తు పూర్తి చేసింది. ఈ నెలాఖరులోపు పర్మిట్ రూములకు అనుమతులివ్వాలని ప్రభుత్వం ఉత్తర్వులు సైతం జారీ చేసింది. నూతన విధానంలో భాగంగా కూటమి ప్రభుత్వం మద్యం దుకాణాలను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టింది. అప్పటినుంచి జిల్లావ్యాప్తంగా మద్యం విక్రయాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 153 మద్యం షాపులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వీటికి అనుబంధంగా ఒక్కొక్కటిగా చొప్పున 153 సిట్టింగ్ రూములు ఏర్పాటు కానున్నాయి. కార్పొరేషన్, మున్సిపల్ పరిధిలో పర్మిట్ రూమ్కు రూ.7.50 లక్షలు ఇతర ప్రాంతంలో రూ.5 లక్షల చొప్పున ప్రభుత్వం ఫీజు ప్రకటించింది. సగటు చొప్పున ఒక్కో షాపునకు రూ.5 లక్షలు వసూలు చేసిన ప్రభుత్వానికి అదనంగా రూ.80 కోట్లు ఆదాయం సమకూరనుంది. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అన్ని పర్మిట్ దుకాణాలకు ఏడాదికి రూ.5 లక్షలు పరిమిత ఫీజుగా ఉండేది. ఇప్పుడు దానిని రెండు కేటగిరీలుగా మారుస్తున్నారు.
ఆదాయమే లక్ష్యమా..
ఆదాయమే లక్ష్యంగా ప్రభుత్వం నూతన మద్యం పాలసీ తీసుకు వచ్చింది. జిల్లా వ్యాప్తంగా 153 మద్యం షాపులకు గాను 3100 దరఖాస్తులు రాగా ఒక్కొక్కరి నుంచి రూ. 2 లక్షలు చొప్పున ప్రభుత్వం వసూలు చేసింది. తద్వారా రూ.62 కోట్లు ఆర్జించింది. షాపులు దక్కించుకున్న వ్యా పారులు ఆరు విడతల్లో లైసెన్స్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. లైసెన్స్ ఫీజుల్లో 1/6 వంతు చెల్లించారు. పర్మిట్ రూము లు సైతం అందుబాటులోకి వస్తే ఆదా యం మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది. అయితే ప్రభుత్వమే ఆదాయం లక్ష్యంగా మద్యాన్ని ఏరులై పారిస్తోందని దీనివల్ల శాంతిభద్రతల సమస్యలు తలెత్తే ప్రమాదం పొంచి ఉంటుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే సమస్త సౌకర్యాలతో...
ఇప్పటికే ప్రతి షాపు వద్ద ఒక పర్మిట్ రూమును అనధికారికంగా తెరిచేశారు. అది కూడా ఏదో చిన్న గది అనుకుంటే పొరపాటే. సువిశాల ప్రాంగణంలో ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించి మరీ ఏర్పాటు చేశారు. మందుబాబులు కూర్చుని తాగేందుకు కుర్చీలు, టేబుళ్లు, వేశారు. వర్షం, ఎండా పడకుండా విశాలమైన షెడ్లు వేసి బయటికి తెలియకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. షెడ్ల లోపల పెద్ద ఫ్లడ్లైట్లు వేసి మరీ మందు అందజేస్తున్నారు. మంచింగ్ కోసం అన్ని రకాల నాన్ వెజ్ ఆహార పదార్థాలను అక్కడే ఉంచుతున్నారు. ఎంత సేపైనా కూర్చునేందుకు అవకాశం కల్పిస్తుండడంతో మద్యం ప్రియులు ఉదయం నుంచి రాత్రి వరకు అక్కడే తప్ప తాగి తూలుతున్నారు.