
ఇస్రో కేంద్రం
కడప ఎడ్యుకేషన్ : బాల్య దశలోనే విద్యార్థులను సైన్స్, అంతరిక్ష, సాంకేతిక రంగాల వైపు మళ్లించేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) కృషి చేస్తోంది. ఈ ఏడాది యువ విజ్ఞాన కార్యక్రమం(యువిక) కింద 9వ తరగతి విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది, ఇందుకు సంబంధించిన షెడ్యూల్ను కూడా విడుదల చేసింది. తమ అధికారిక వెబ్సైట్ ద్వారా విద్యార్థులు ఏప్రిల్ 3 లోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించింది.
ఎంపిక ఇలా..
8వ తరగతిలో విద్యార్థులకు వచ్చిన మార్కులు 50 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో చదువుతున్న విద్యార్థులకు అదనంగా 15 శాతం, ఆన్లైన్ ద్వారా నిర్వహించే క్విజ్ లో 10 శాతం, సైన్స్ ఫెయిర్లో పాల్గొన్న వారికి 5 శా తం, ఎన్సీసీ, స్కౌట్ విద్యార్థులకు 5 శాతం, ఒలింపియాడ్ పరీక్షలో పాల్గొన్న వారికి 10 శాతం, ఆటలపోటీ ల్లో పాల్గొన్న విద్యార్థులకు 5 శాతం కేటాయించి ఎంపిక చేస్తారు. గ్రామీణ ప్రాంతంలో ఉన్న మెరుగైన విద్యా ర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
చక్కటి అవకాశం
అంతరిక్ష రంగంపై ఆసక్తి కలిగించడానికి ఈ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుంది. 9వ తరగతి విద్యార్థులకు చక్కటి అవకాశం. ఎంపికై న విద్యార్థులు ఇస్రో సంస్థల్లోని శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులతో చర్చించవచ్చు. అస్ట్రో ఫిజిక్స్, అస్ట్రో బయాలజీ,మెటీరియల్ సైన్స్, కంప్యూటర్ సైన్సులపై అవగాహన కల్సిస్తారు. శ్రీహరికోటలోని అంతరిక్ష నౌకాశ్రమాన్ని సందర్శించి ఇస్రో చైర్మన్తో సంభాషించే అవకాశం కలుగుతుంది.
లక్ష్యం ఇది..
అంతరిక్ష పరిజ్ఞానంలో మన దేశం పలు విజయాలతో అగ్రరాజ్యాల సరసన నిలిచింది. ఈ స్ఫూర్తిని విద్యార్థుల్లో నింపి వారిని ఆస్థాయిలో తీర్చిదిద్దేందుకు యూవికా ఏర్పాటు చేశారు. ఇలా భావి శాస్త్రవేత్తలను తయారు చేయాలనుకుంటున్నారు. ప్రతిభావంతుల కోసం ఇస్రో ప్రకటన జారీ చేసింది
దరఖాస్తు ఇలా..
ఇస్రో ప్రధాన వెబ్సైట్ ఐఎస్ఆర్వో.జీవోవి.ఇన్లో ఏప్రిల్ 3వ తేదీలోగా హెచ్టీటీపీఎస్://డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఐఎస్ఆర్ఓ.జీవోవి.ఇన్/యువిక.హెచ్టీఎంఎల్ లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఎంపికై న వారి జాబితా ఆదే నెల 10న వెబ్సైట్లో ఉంచుతారు. రెండో విడత ఎంపిక ఏప్రిల్ 20వ తేదీలో పూర్తి చేస్తారు. ఎంపికై తే అవసరమైన పత్రాలు ఆప్లోడ్ చేయాలి. పరిశీలన అనంతరం ఇస్రో తుది జాబితా మే 14 లోగా రిజిస్టర్డ్ ఈ మెయిల్ ద్వారా ప్రకటిస్తుంది. యువికా ప్రోగ్రాం మే 15 నుంచి 26వ తేదీ వరకు ఉంటుంది.
విద్యార్థులతో రిజిస్ట్రేషన్ చేయించాలి
జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలల్లో తొమ్మిదో తరగతి విద్యార్థులతో ప్రతిభా అన్వేషన్ పరీక్షలు రాయించడం ద్వారా ఇస్రో శాస్త్రవేత్తలను కలుసుకునే అవకాశం కలుగుతుంది.ప్రధానోపాధ్యాయులు దీనిని బాధ్యతగా తీసుకుని రిజిస్ట్రేషన్ చేయించాలి.
– రాఘవరెడ్డి. జిల్లా విద్యాశాఖాధికారి
అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి
టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో ప్రతి మారుమూల గ్రామంలో ఉన్న విద్యార్థికి కూడా ఉన్నతస్థాయికి చేరుకోవడానికి కల్పిస్తున్న అవకాశాల్లో ఇది ఒకటి. అన్ని యాజమాన్యాల్లో 9వ తరగతి చదివే విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆసక్తి ఉన్న వారు ఏప్రిల్ 3వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు 9441035830 నంబర్లో సంప్రదించాలి.
– మహేశ్వరెడ్డి, జిల్లా సైన్స్ అధికారి.
షెడ్యూల్ ఇలా..
- రిజిస్ట్రేషన్ గడువు : 3.4.2023
- మొదటి విడత ఎంపిక జాబితా 10.4.2023
- రెండో విడత : 20.4.2023
- ఎంపికై న వారు ఇస్రో సెంటర్లలో రిపోర్టు చేయడం : 14.5.2023
- యువికా కార్యక్రమం : మే 15 నుంచి 26 వరకు