
ఒంటిమిట్ట అభివృద్ధికి బృహత్తర ప్రణాళిక
ఒంటిమిట్ట: ఆంధ్ర భద్రాద్రిగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయ అభివృద్ధికి బృహత్తర ప్రణాళిక రూపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రత్యేక నిపుణుల బృందం ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా శుక్రవారం ఒంటిమిట్టలో ఎక్కడెక్కడ ఏ పనులు చేస్తే భక్తులకు సౌకర్యంగా ఉంటుందో టీటీడీ సివిల్ విభాగం అధికారులతో కలిసి ప్రత్యేక నిపుణుల బృందం ప్రణాళిక అధికారి రాముడు, ఆర్కిటెక్చర్ అనిల్ పరిశీలించారు. ఈ సందర్భంగా రామాలయ పరిసరాల్లోని రామ కుటీరం, శృంగిశైలి పర్వతం, ఒంటిమిట్ట చెరువు, రామతీర్థం, నాగేటితిప్ప పర్వతం, కల్యాణ వేదిక ప్రాంతం, వావిలి కొలను సుబ్బారావు కుటీరాన్ని సందర్శించారు. అనంతరం ప్రణాళిక అధికారి రాముడు మాట్లాడుతూ విజయవాడలో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ నిపుణుల సంస్థ వారి పరిశీలనలో ఎక్కడ అభివృద్ధి జరిగితే భక్తులకు సౌకర్యంగా ఉంటుందో ప్రణాళిక రూపొందించి రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీ దృష్టికి తీసుకువెళ్తామన్నారు. ఈ పరిశీలనలో అన్నదాన కాంప్లెక్స్, క్యూ కాంప్లెక్స్, ఒంటిమిట్ట చెరువును ట్యాంక్ బండ్ చేయడం, చెరువులో శ్రీరాముడి భారీ విగ్రహం ప్రతిష్టించడం, శృంగిశైలి పర్వతం చుట్టూ గిరి ప్రదక్షిణ చేయించడం, శ్రీరామ ప్రాజెక్ట్, పార్వేటి ఉత్సవం జరిగే నాగేటి తిప్ప పర్వతాన్ని అందంగా తీర్చిదిద్దడం, ఒంటిమిట్ట క్షేత్రానికి విచ్చేసే భక్తులు ఉండేందుకు వసతులు కల్పించడం, ఒంటిమిట్టలో ఎండ తీవ్రతను తగ్గించేందుకు ఎక్కువ ప్లాంటేషన్ చేయించి, సాధారణ ఉష్టోగ్రత కంటే 6 డిగ్రీలు తగ్గించేలా చర్యలు తీసుకోవడం వంటివి తమ దృష్టిలో ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో ప్రశాంతి, సివిల్ విభాగం ఎస్ఈ మనోహర్, ఈఈ సుమతి, ఏఈ అమర్నాథ్రెడ్డి సాల్గొన్నారు.
ప్రత్యేక నిపుణుల బృందం పరిశీలన