గుంటూరులో వైఎస్సార్సీపీ బలంగా ఉందని రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి అన్నారు. గుంటూరులో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలతో విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఇందులో వైవీ సుబ్బారెడ్డి మాట్లాడారు.
‘‘2021లో గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ 57 డివిజన్లకు 46 డివిజన్లు పార్టీ గెలుచుకుంది. ఈసారి జరిగే మున్సిపల్ ఎన్నికల్లో అంతకన్నా ఎక్కువ సీట్లు గెల్చుకోవాలి. అందరూ కలిసికట్టుగా ఎన్నికల పని చేయాలి. అభ్యర్థి ఎవరైనా అందరూ కలసికట్టుగా పనిచెయ్యాలి. ప్రతి కుటుంబానికి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన అభివృద్ధి కార్యక్రమాలను తెలియజేయాలి. గతంలో ఎలా గెలిచామో ఈసారి కూడా అలానే గుంటూరు మేయర్ గెలుచుకోవాలి’’ అని చెప్పారు.
మాజీ ఎంపీ ఆళ్ల అయోధ్య రామి రెడ్డి మాట్లాడుతూ.. ‘గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లకు కార్యకర్తలు నాయకులు సిద్ధంగా ఉండాలి. గుంటూరు మున్సిపల్ పీఠాన్ని గెలుచుకొని వైఎస్ జగన్మోహన్ రెడ్డికి గిఫ్టుగా ఇవ్వాలి. అందరూ సమన్వయంతో పనిచేసి ఒక ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్దాం. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ పై వైఎస్సార్సీపీ జెండా ఎగరటం ఖాయం’’ అని చెప్పారు.
వైఎస్సార్సీపీకి మహిళలు వెన్నెముక
మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘వైఎస్సార్సీపీకి మహిళలు వెన్నెముక. పార్టీ జెండాను మోసే కార్యకర్తలకే ప్రాధాన్యం ఉంటుంది. పార్టీలో కష్టపడిన వారికి న్యాయం జరుగుతుంది. మనం గర్వపడే నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి. ప్రతి ఒక్క కార్యకర్త కూడా 2029లో వైఎస్ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రి చెయ్యడానికి సిద్ధంగా ఉన్నారు’’ అని తెలిపారు.
ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ... ‘‘డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడానికి వైఎస్ జగన్ వైఎస్సార్సీపీని స్థాపించారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలనుంచి పుట్టిన పార్టీనే వైఎస్సార్సీపీ. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి రెండడుగులు ముందుకు వేస్తే వైఎస్ జగన్ నాలుగడుగులు ముందుకు వేశారు. 76 డివిజన్లలో వైఎస్సార్సీపీని గెలిపించుకోవాలి. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి. గుంటూరు నగర మేయర్ పదవిని వైఎస్ జగన్కు కానుకగా ఇవ్వాలి.
మాజీ మంత్రి మేకతోటి సుచరిత మాట్లాడుతూ... ‘‘రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధులను గెలిపించుకునే బాధ్యత అందరి మీద ఉంది. చంద్రబాబు ఎన్నికలను చండాలం చేశారు. పక్క పార్టీ వాళ్లను లాక్కోవడం చంద్రబాబు అలవాటే. రాజ్యాంగాన్ని తుంగలోతొక్కి వైసీపీ తరుఫున గెలిచిన వారిని లాక్కున్నారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ విజయ డంకా మోగించాలి. అందరం కలసి గుంటూరు మేయర్ పదవిని కైవసం చేసుకోవాలి’’ అని తెలిపారు.
గుంటూరు తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరి ఫాతిమా మాట్లాడుతూ... ‘‘ఈ రోజు పార్టీ కోసం నిలబడినోడే నిజమైన కార్యకర్త. నియోజకవర్గంలో ఎవరు నిలబడ్డ మనకి కనిపించాల్సింది వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమే. కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి ప్రజలు ఎదురుచూస్తున్నారు’’ అని తెలిపారు.
పోతిన మహేశ్ మాట్లాడుతూ.. ‘‘స్థానిక సంస్థల ఎన్నికల్లో కచ్చితంగా గుంటూరు నగర మేయర్ స్థానాన్ని కైవసం చేసుకోవాలి. మనందరం స్థానికంగా చాలా బలంగా ఉన్నాం. ప్రజలు ఏ ఇబ్బంది వచ్చినా ప్రతిపక్షం దగ్గరికి వస్తున్నారు. మంచినీళ్లు ఇవ్వలేని ఈ కూటమి ప్రభుత్వానికి ఎవరైనా ఓటు వేస్తారా? నిత్యావసర ధరలు భారీగా పెరిగాయి. ప్రజలకు సమాధానం చెప్పలేక ప్రజల్లోకి వెళ్లలేని పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు. నాదెండ్ల మనోహర్ రూ.5,300 కోట్లు కుంభకోణానికి పాల్పడ్డారు’’ అని చెప్పారు.


