సాక్షి,విశాఖ: కూటమి సర్కార్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘బీచ్ షాక్స్’ విధానానికి వ్యతిరేకంగా విశాఖలో నిరసన జ్వాలలు మిన్నంటాయి. సముద్ర తీర ప్రాంతాల్లో మద్యం విక్రయాలకు అనుమతినిస్తూ కూటమి ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 362ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో విశాఖ బీచ్ రోడ్లో నిరసన ర్యాలీ నిర్వహించారు.
ఈ ర్యాలీలో వైజాగ్తో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన వేలాది మంది మహిళలు స్వచ్ఛందంగా తరలివచ్చారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా మహిళలందరూ చేతుల్లో నల్ల బెలూన్లు, నల్ల రిబ్బన్లు ధరించి ప్రదర్శనలో పాల్గొన్నారు. బీచ్ రోడ్ అంతటా ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఈ భారీ ప్రదర్శనకు పార్టీ అగ్రశ్రేణి నాయకులు పూర్తి మద్దతు ప్రకటించారు. ఈ ర్యాలీలో వరుదు కళ్యాణి, బొత్స ఝాన్సీ లక్ష్మి, గొల్ల బాబురావు, పార్టీ నేత కేకే రాజు, పలువురు మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు స్వయంగా పాల్గొని మహిళలకు అండగా నిలిచారు.
ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నేతలు మాట్లాడుతూ.. గోవా తరహా సంస్కృతిని ఏపీలోకి తీసుకువచ్చి, పవిత్రమైన విశాఖ తీరాన్ని మందుబాబుల అడ్డాగా మార్చాలని చంద్రబాబు ప్రభుత్వం చూస్తోందని మండిపడ్డారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు బీచ్లలో మద్యం అమ్మకాలకు అనుమతి ఇస్తే, ఇకపై ఇక్కడికి కుటుంబాలు, విద్యార్థులు, మహిళలు ధైర్యంగా వచ్చే వాతావరణం ఉంటుందా? అని ప్రశ్నించారు. పర్యాటక రంగం అభివృద్ధి పేరుతో మహిళల భద్రతను, ప్రజల శాంతిని పణంగా పెట్టడం దుర్మార్గమని ధ్వజమెత్తారు.


