ఎన్యుమరేషన్ ఫారాల సేకరణలో గందరగోళం
ప్రజలకు అవగాహన కల్పించడంలో యంత్రాంగం విఫలం.. సమస్యలన్నీ సరిదిద్ది సవరణను పారదర్శకంగా నిర్వహించాలి
ప్రధాన ఎన్నికల అధికారికి వైఎస్సార్సీపీ లేఖ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్–ఎస్ఐఆర్) కార్యక్రమం అమలులో పలు అక్రమాలు, లోపాలు, ఆచరణాత్మక ఇబ్బందులు చోటుచేసుకుంటున్నాయని వైఎస్సార్సీపీ ఆందోళన వ్యక్తంచేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ)కి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి శనివారం లేఖ రాశారు. ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పారదర్శకంగా, నిష్పాక్షికంగా నిర్వహించాల్సిన సమయంలో క్షేత్రస్థాయిలో అనేక అవకతవకలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
బూత్ లెవల్ ఆఫీసర్లు (బీఎల్ఓలు) ఎస్ఐఆర్ విధులతో పాటు ఇతర శాఖాపరమైన పనులు కూడా నిర్వహించాల్సి రావడంవల్ల కార్యక్రమం ప్రభావితమవుతోందన్నారు. ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ చేసినప్పటికీ వాటి సేకరణ, ధృవీకరణ ప్రక్రియలో ఏకరీతి లేకపోవడంవల్ల గందరగోళం నెలకొంటోందని తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో రెండు ఫారాలు ఇస్తుండగా, మరికొన్ని ప్రాంతాల్లో ఒక్కటి మాత్రమే అందజేస్తున్నారని తెలిపారు. ఎస్ఐఆర్పై ప్రజలకు సరైన అవగాహన కల్పించడంలో ఎన్నికల యంత్రాంగం విఫలమైందని, రాష్ట్రవ్యాప్తంగా విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని అప్పిరెడ్డి డిమాండ్ చేశారు. రాజకీయ పార్టీలను కూడా అవగాహన కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయాలని సూచించారు.
ఓటరు జాబితాలను అన్ని పార్టీలకు అందుబాటులో ఉంచాలి..
కొన్ని ప్రాంతాల్లో అధికార పార్టీకి చెందిన బూత్ లెవల్ ఏజెంట్లు పెద్ద ఎత్తున ఎన్యుమరేషన్ ఫారాలు సేకరించి పంపిణీ చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయని, అలాగే రాజకీయ నాయకులు బీఎల్ఓలతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారన్న సమాచారం అందుతోందని లేళ్ల అప్పిరెడ్డి తెలిపారు. ఈ పరిణామాలు ఎన్నికల ప్రక్రియ నిష్పాక్షికతను దెబ్బతీసే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. బీఎల్ఓలు నిర్దేశిత మొబైల్ యాప్ ద్వారా ఓటర్ల ఫొటోలు సేకరించాల్సి ఉన్నప్పటికీ, అనేక ప్రాంతాల్లో ఆ ప్రక్రియ సక్రమంగా అమలుకావడంలేదన్నారు.
అలాగే, 2026 తాజా ఓటరు జాబితాలను గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు, వారి బీఎల్ఏలకు అందించకపోవడంవల్ల ఓటరు జాబితాల పరిశీలన, సవరణ ప్రక్రియలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని అప్పిరెడ్డి తన లేఖలో వివరించారు. ఏజెన్సీ, గిరిజన ప్రాంతాల్లో ‘నెట్వర్క్’ సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. ఈ సమస్యలన్నింటినీ వెంటనే సరిదిద్ది, ఓటరు జాబితాల సవరణ కార్యక్రమాన్ని పారదర్శకత, నిష్పాక్షికతతో నిర్వహించాలని లేళ్ల అప్పిరెడ్డి ప్రధాన ఎన్నికల అధికారిని కోరారు.


