లెక్కలేసి మరీ బాండ్లు ఇచ్చారు.. ఇప్పుడేమైంది?: వైఎస్‌ జగన్‌ | YSRCP President YS Jagan On Yuvatha Poru Success: Andhra pradesh | Sakshi
Sakshi News home page

లెక్కలేసి మరీ బాండ్లు ఇచ్చారు.. ఇప్పుడేమైంది?: వైఎస్‌ జగన్‌

Jun 25 2025 3:57 AM | Updated on Jun 25 2025 7:47 AM

YSRCP President YS Jagan On Yuvatha Poru Success: Andhra pradesh

చంద్రబాబూ.. నిరుద్యోగ భృతి హామీ ఎక్కడ? 

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ నిలదీత

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిల సంగతేంటి? 

రూ.6,400 కోట్లకు గాను ఇచ్చింది ఎంత?.. మీ నిర్వాకంతో చదువులు మానుకోవాల్సిన దుస్థితి 

మీరు ఎగ్గొట్టడంపై ప్రశ్నిస్తే ఉక్కుపాదంతో అణగదొక్కే ప్రయత్నం చేస్తారా?

నరసరావుపేటలో యువత, విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జి దారుణం 

వీళ్లంతా చేసిన తప్పేమిటి? కలెక్టర్‌ను కలిసి డిమాండ్‌ పత్రం ఇవ్వాలనుకోవడమా? 

ఇది మీ రెడ్‌బుక్‌ రాజ్యాంగ పాలనకు నిదర్శనం కాదా?  

మితిమీరుతున్న మీ అబద్ధాలు, మోసాలు, దౌర్జన్యాలు.. మీ పాపాలు పండే రోజు దగ్గర్లోనే ఉంది.. ఇప్పటికైనా తప్పులు సరిదిద్దుకోండని హెచ్చరిక 

‘యువత పోరు’ విజయవంతం కావడంపై హర్షం

సాక్షి, అమరావతి: చంద్రబాబు కూటమి ప్రభుత్వం నిరుద్యోగ భృతి, విద్యా దీవెన, వసతి దీవెన పథ­కాలు ఇవ్వకుండా చేస్తున్న మోసాలపై వైఎస్సార్‌­సీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా యువతీ యువ­కులు చేపట్టిన ‘యువత పోరు’ విజయవంతం కావడంపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో శాంతి­యుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులు, యువతపై సోమవారం నరసరావుపేటలో పోలీసులు లాఠీఛార్జీ చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.

ఇంట్లో ఎంత మంది విద్యార్థులు, యువకులు ఉన్నారో అంత మందికి నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.3 వేల చొప్పున ఇంత వస్తుందని లెక్కలు వేసి మరీ బాండ్లు ఇచ్చారు కదా.. ఇప్పుడు ఆ హామీ ఏమైందని సీఎం చంద్రబాబును నిలదీశారు. ఈ మేరకు మంగళవారం ‘ఎక్స్‌’లో తన ఖాతాలో పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్‌ జగన్‌ ఏమన్నారంటే..

చంద్రబాబు కూటమి ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఇవ్వకుండా తమకు చేస్తున్న మోసాలు, ఎగరగొడుతూ నిర్వీర్యం చేస్తున్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాలు, పలు సమస్యలపై వైఎస్సార్‌­సీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా విద్యా­ర్థు­లు, యువతీ యువకులు ‘యువత పోరు’ పేరిట రోడ్డెక్కి ఈ ప్రభుత్వం కళ్లు తెరిచేలా బ్రహ్మాం­డంగా నిరసన చేపట్టినందుకు వారందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యా­ర్థులు, యువతపై సోమవారం నరసరావు­పేటలో పోలీ­సుల లాఠీఛార్జిని తీవ్రంగా ఖండిస్తు­న్నాను.

మేని­ఫెస్టోలో చెప్పడమే కాకుండా ప్రతి ఇంటికీ వెళ్లి వివిధ రకాలుగా బాండ్లు పంచారు. ఇంట్లో ఎంత మంది విద్యార్థులు, యువకులు ఉన్నారో అంత మం­దికీ నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.3వేలు  చొప్పున ఇంత వస్తుందని లెక్కలు వేసి మరీ బాండ్లు ఇచ్చారు. చంద్రబాబు అధికారంలోకి రాగానే ఆ మేరకు జూన్‌–2024 నుంచి వారి వారి ఖాతాల్లో జమ అవుతుందన్నారు. టీడీపీ అధికార గెజిట్‌ ఈనాడు పత్రికలో రాష్ట్రంలో ఉపాధి, ఉద్యోగాల కోసం ఎదురు చూస్తు­న్నవారు కోటిన్నరపైనే ఉన్నా­రని రాస్తే, మీ మేనిఫెస్టో, మీరు ఇంటింటికీ పంచిన బాండ్ల ప్రకారం నెలకు రూ.3 వేలు చొప్పున ఈ ఏడాదిలో మీరు ఎంత మందికి నిరుద్యోగ భృతి ఇచ్చారు? ఒక్కరికీ ఇవ్వకపోగా, ఈ ఏడాది కూడా మళ్లీ ఎగరగొట్టే మోసానికి దిగారు.

ఆరు త్రైమాసికాల ఫీజు పెండింగ్
మరోవంక 2024 జనవరి–మార్చి త్రైమాసికా­నికి సంబంధించి విద్యా దీవెన కింద ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను అదే సంవత్సరం 2024లో చెల్లింపులు చేయాలి. ఎన్నికల కారణంగా అది నిలిచిపోయింది. అప్పటి నుంచి ఈ జూన్‌–2025 వరకు ఆరు త్రైమాసికాలుగా మొత్తంగా రూ.4,200 కోట్లు పెండింగ్‌. ఇందులో ఇచ్చింది కేవలం రూ.750 కోట్లు. వసతి దీవెన కింద ఏప్రిల్‌–2024న చెల్లించాల్సిన ఒక విడత, ఈ ఏడాది ఏప్రిల్‌–2025లో  చెల్లించాల్సిన మరో విడత కలిపి రూ.2,200 కోట్లు పెండింగ్‌. మొత్తంగా రూ.6,400 కోట్లకు గాను ఇచ్చింది కేవలం రూ.750 కోట్లు. మీరు ఇవ్వక పోవడంతో ఇవాళ విద్యార్థులు చదువులు మానుకుని, పనులకు పోవాల్సిన పరిస్థితులు వచ్చాయి.

చంద్రబాబూ.. మీరు చేయాల్సింది చేయకుండా, ఎగరగొట్టినందుకు ప్రశ్నిస్తే నిర్దాక్షి­ణ్యంగా ఉక్కుపాదంతో అణగ­దొక్కే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్లంతా చేసిన తప్పేమిటి? కేవలం కలెక్టర్‌ను కలిసి డిమాండ్‌ పత్రం ఇవ్వాలను­కోవడం తప్పా? మీరు ఇస్తా­మన్న వాటి కోసం డిమాండ్‌ చేయడం తప్పా? మీ రెడ్‌బుక్‌ రాజ్యాంగ పాలనకు నిన్న నరసరావు­పేటలో జరిగిన ఘటన నిదర్శనం కాదా? రోజు­రోజుకూ మీ అబద్ధాలు, మీ మోసాలు, మీ దౌర్జ­న్యాలు మితిమీరి పోతు­న్నాయి. మీరు చేస్తున్న పాపాలు పండే రోజు దగ్గర్లోనే ఉంది. ఇప్పటికైనా తప్పులు సరిదిద్దుకోండి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement