
రైతు సమస్యలు పట్టించుకోకుండా వారిపైనే ఎదురు కేసులా?
సీఎం చంద్రబాబును నిలదీసిన వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్
మద్దతు ధర దక్కక పొగాకు రైతులు అన్యాయానికి గురవుతున్నారు
అన్నదాతలను పరామర్శించి భరోసా కల్పించేందుకు పొదిలికి వెళ్లా
సంఘీభావంగా దాదాపు 40 వేల మంది రైతులు, ప్రజలు తరలివచ్చారు
మేం వెళ్తున్న మార్గంలో 40 మంది టీడీపీ కార్యకర్తలను పెట్టి ఉసిగొల్పారు
వారితో రాళ్లు విసిరించి గలాటా చేయించారు.. ప్రజలు, రైతులు ఆ పన్నాగాన్ని అర్థం చేసుకుని సంయమనంపాటించారు
40 మంది దుశ్చర్యలపై ఆ 40 వేలమంది ప్రతిస్పందించి ఉంటే ఏం జరిగేది చంద్రబాబూ?
మీ కార్యకర్తలు గొడవలకు ప్రయత్నిస్తే... అన్యాయంగా రైతులు, ప్రజలపై కేసులు పెడతారా?
రైతులు, ప్రజలను రౌడీలుగా అభివర్ణించడం మీ దిగజారుడుతనం కాదా?
సాక్షి, అమరావతి: ప్రకాశం జిల్లా పొదిలి పర్యటనలో నిరసనల పేరుతో ఉద్రిక్తతలకు కారణమైన వారిని వదిలేసి.. అమాయక రైతులు, ప్రజలపై కేసులు పెట్టడాన్ని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఇది రైతుల సమస్యను డైవర్ట్ చేయడానికి చంద్రబాబు సర్కార్ చేయిస్తున్న మరో దుర్మార్గమని మండిపడ్డారు. ఈ మేరకు శనివారం ‘ఎక్స్’లో ఆయన పోస్టు చేశారు. వైఎస్ జగన్ ఏమన్నారంటే..
‘‘చంద్రబాబూ... పొగాకు పంటకు కనీస మద్దతు ధరలు లభించక రైతులు అన్యాయానికి గురవుతుంటే, వారిని పరామర్శించి భరోసా ఇవ్వడానికి నేను ప్రకాశం జిల్లా పొదిలి వెళ్తే, ఆ కార్యక్రమాన్ని డైవర్ట్ చేయడానికి మీరు కుట్ర చేయడం భావ్యమా? రైతులను పరామర్శించే ఈ కార్యక్రమానికి సంఘీభావంగా దాదాపు 40 వేలమంది రైతులు, ప్రజలు తరలివస్తే, మేం వెళ్తున్న మార్గంలో మీరు 40 మంది టీడీపీ కార్యకర్తలను పెట్టి, వారిని ఉసిగొల్పి, రాళ్లు విసిరి గలాటా చేయించారు.
కానీ... ప్రజలు, రైతులు ఆ పన్నాగాన్ని అర్థం చేసుకుని అత్యంత సంయమనంతో వ్యవహరించారు. హింసను సృష్టించడానికి మీరు పంపిన ఆ 40 మంది చేసిన దుశ్చర్యలపై, అక్కడున్న 40 వేల మంది ప్రజలు, రైతులు ప్రతిస్పందించి ఉంటే ఏం జరిగి ఉండేది చంద్రబాబూ? రైతుల సమస్యలపై గొంతెతి్తతే దాన్ని డైవర్ట్ చేయడానికి మీరు ఇలా చేయించడం దుర్మార్గం కాదా..? ఉల్టాగా... రాళ్లు మీ వాళ్లు విసిరితే, మీరు ఉసిగొల్పిన కార్యకర్తలు గొడవలు చేసే ప్రయత్నం చేస్తే, అన్యాయంగా రైతులపై, ప్రజలపై కేసులు పెడతారా?

ఆ కార్యక్రమానికి వచ్చిన రైతులను, ప్రజలను రౌడీలుగా అభివర్ణించడం మీ దిగజారుడుతనం కాదా చంద్రబాబూ? రోమ్ నగరం తగలబడుతుంటే ఫిడేల్ వాయిస్తూ కూర్చున్న చక్రవర్తి నీరో తరహాలో... ఆ రైతుల సమస్యలను పట్టించుకోకుండా, తిరిగి వారిపైనే ఎదురు కేసులు పెట్టడం మీకు మాత్రమే చెల్లుతుంది’’ అని మండిపడ్డారు.