దిశ బిల్లుకు చట్టరూపం కల్పించాలి | YSRCP MP Anuradha demand in Lok Sabha for Disha Bill | Sakshi
Sakshi News home page

దిశ బిల్లుకు చట్టరూపం కల్పించాలి

Dec 15 2022 5:22 AM | Updated on Dec 15 2022 5:22 AM

YSRCP MP Anuradha demand in Lok Sabha for Disha Bill - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: మహిళలు, చిన్నారులపై లైంగిక నేరాల కేసుల్లో సత్వర న్యాయం నిమిత్తం ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ 2019లో తీర్మానం చేసిన దిశ బిల్లుకు చట్టరూపం కల్పించాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ చింతా అనూరాధ కేంద్ర ప్రభుత్వాన్ని డి మాండ్‌ చేశారు. లోక్‌సభలో ఆమె మాట్లాడుతూ ఇలాంటి కేసుల్లో సత్వర న్యాయం, కఠినశిక్షల నిమిత్తం ప్రత్యేక కోర్టుల ఏర్పాటును బిల్లులో పొందుపరిచారని తెలిపారు.  సమర్థమైన న్యాయబట్వాడా వ్యవస్థ ఏర్పాటు కోసం ఏపీ ప్రభుత్వానికి సహకరించాలని, ఈ మేరకు దిశ బిల్లుకు చట్టరూపం కల్పించాలని కోరారు. బిల్లు హోంశాఖ వద్ద పెండింగ్‌లో ఉన్న అంశాన్ని సభ దృష్టికి తీసుకొచ్చారు. 

ఏపీలో పెరుగుతున్న పత్తి ఉత్పత్తి 
ఆంధ్రప్రదేశ్‌లో 2020–21తో పోలిస్తే 2022–23లో పత్తి ఉత్పత్తి పెరిగిందని కేంద్ర జౌళిశాఖ సహాయమంత్రి దర్శన జర్దోష్‌ తెలిపారు. 2020–21లో 16 లక్షల బేళ్లు, 2021–22లో 17.08 లక్షల బేళ్లు, 2022–23లో (తాత్కాలికంగా) 17.85 లక్షల బేళ్లు ఉత్పత్తి అయినట్లు వైఎస్సార్‌సీపీ ఎంపీ మార్గాని భరత్‌రామ్‌ ప్రశ్నకు సమాధానమిచ్చారు. 

వివిధ స్థాయిల్లో 31 రైల్వే ప్రాజెక్టులు 
ఆంధ్రప్రదేశ్‌లో 31 రైల్వే ప్రాజెక్టులు వివిధ స్థాయిల్లో ఉన్నాయని రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ తెలిపారు. ఇవి రూ.70,594 కోట్ల విలువైన 16 కొత్త లైన్లు, 15 డబ్లింగ్‌ పనులకు సంబంధించిన ప్రాజెక్టులని వైఎస్సార్‌సీపీ ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి ప్రశ్నకు జవాబిచ్చారు. 

‘గిరిజన’ బిల్లుకు వైఎస్సార్‌సీపీ సంపూర్ణ మద్దతు
లోక్‌సభలో గిరిజనులకు సంబంధించి కేంద్రం తీసుకొచ్చిన సవరణ బిల్లుకు తమ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు వైఎస్సార్‌సీపీ ఎంపీ డాక్టర్‌ గురుమూర్తి చెప్పారు. ఈ బిల్లుపై లోక్‌సభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. 

Advertisement
 
Advertisement
Advertisement