
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు జరిగాయి. ఈ సందర్బంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు పార్టీ నేతలు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి మేరుగ నాగార్జున, మాజీ ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, టీజేఆర్ సుధాకర్ బాబు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్కుమార్ మాజీ ఎంపీ నందిగం సురేష్, ఎస్సీ సెల్ నేత కొమ్మూరి కనకారావు, పలువురు దళిత నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు.

ఈ సందర్బంగా మాజీ మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ..‘విజయవాడలోని అంబేద్కర్ విగ్రహాన్ని చంద్రబాబు అమ్మకానికి పెట్టారు. పీపీపీ పద్దతిలో అమ్మేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక మీదట అందరూ అంబేద్కర్ విగ్రహాన్ని చూడలేని పరిస్థితిని తెచ్చారు. అంబేద్కర్ విగ్రహాన్ని ప్రైవేటు వ్యక్తులకు తాకట్టు పెడతారా?. ఇలాంటి నిర్ణయాలు తీసుకున్న చంద్రబాబుకు బుద్ది వచ్చేలా చేయాలి. అంబేద్కర్ వలనే మన రాజ్యాంగానికి ప్రపంచ వ్యాప్త గుర్తింపు లభించింది. అలాంటి అంబేద్కర్ ని అమ్మకానికి పెడతారా?. భారత దేశానికి రాజ్యాంగం అందించిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్.

దేశ వ్యాప్తంగా కాదు.. ప్రపంచ వ్యాప్తంగా అంబేద్కర్ జయంతి జరుపుకుంటున్నారు. ఆలోచన విధానంలో పరిపాలన చేసిన నేత వైఎస్ జగన్. విద్యా, వైద్యంలో అంబేద్కర్ ఆలోచనలను వైఎస్ జగన్ అమలు చేశారు. విద్యలో సమూల మార్పులు తీసుకువచ్చి.. ఇంగ్లీష్ మీడియం పెట్టారు. వైద్యానికి ఎక్కడా లోటు లేకుండా చేశారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం నిర్మించి జాతికి అందించిన వ్యక్తి జగన్. అంబేద్కర్ ఆలోచన విధానానికి చంద్రబాబు వ్యతిరేకం. చంద్రబాబు దళిత వ్యతిరేకిగా పరిపాలన చేస్తున్నాడు. చంద్రబాబు చేసే మోసం, అమ్మకాలు ప్రజలు గమనిస్తున్నారు.

ఎమ్మెల్సీ ఎం.అరుణ్ కుమార్ కామెంట్స్..
అంబేద్కర్ గారి ఆశయాలు, ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తున్న నాయకుడు జగన్ గారు, ఆర్ధికంగా, సామాజికంగా, రాజకీయంగా బడుగు బలహీనవర్గాల ప్రజలు ఉండాలని ఆయన కోరుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలలో పుట్టినరోజు చేసేది జీసస్ క్రీస్తు, అంబేద్కర్ గారివి మాత్రమే, సామాజిక న్యాయం, మహిళా సాధికారత ఇలా బడుగు బలహీనవర్గాల వారంతా ఒక మెట్టు పైన ఉండాలని ఆలోచించింది అంబేద్కర్ గారు ఆ తర్వాత మా నాయకుడు జగన్ గారు మాత్రమే, అంబేద్కర్ గారికి ఘనంగా నివాళులర్పిస్తున్నాం.
మాజీ ఎంపీ నందిగం సురేష్..
అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా గత ఐదేళ్ళుగా జగన్ గారి పాలన చూశాం, ఎక్కడా రాజ్యంగ ఉల్లంఘన జరగకుండా పాలించారు, కానీ కూటమి పాలనలో అంబేద్కర్ గారి ఆశయాలకు తూట్లుపొడిచి దళితులు, మైనార్టీలను, బడుగు బలహీన వర్గాలను ఊచకోత కోస్తూ పాలిస్తున్నారు. ఇలాంటి పాలన అవసరంలేదని మనమంతా ఆలోచించి రానున్న రోజుల్లో అంబేద్కర్ గారి స్ఫూర్తిని కొనసాగించే జగన్ గారిని సీఎం పీఠంపై మరోసారి కూర్చోపెట్టేందుకు మనమంతా కష్టపడాలని కోరుకుంటున్నాను.