సాక్షి, నెల్లూరు: ఏపీలో హత్యలు, అత్యాచారాలు, లాకప్ డెత్లు పెరుగుతున్నాయని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. ఇందుకు నెల్లూరు జిల్లాలో ఏఓ శ్రీహరి హత్య ఘటన తర్వాత తాజాగా ఏడుకొండల మృతి మరో ఉదాహరణగా పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని విమర్శించారు. ఏడుకొండలది లాకప్ డెత్ కాదు అని ఎస్పీ ఎలా అంటారు అని ప్రశ్నించారు.
మాజీ మంత్రి కాకాణి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘దొంగతనం కేసులో అదుపులోకి తీసుకున్న ఏడుకొండలను పోలీసులు తీవ్రంగా కొట్టారు. , ఆసుపత్రికి తరలించే సమయంలోనే ఆయన మృతి చెందారు. ఇది లాకప్ డెత్ కాదని పోలీసులు ఎలా చెబుతున్నారు?. ఎస్పీకి పూర్తి సమాచారం ఉందా? లేక ఏదైనా ఒత్తిడితో వాస్తవాలు దాచిపెడుతున్నారా?. గడ్డి మందు తాగడం వల్లే మృతి చెందాడని పోలీసులు చెబుతున్నారు. అయితే ఏడుకొండల శరీరంపై ఉన్న గాయాలకు సమాధానం చెప్పాలి. కాలువ వద్ద బురదలో పొర్లించి మరీ ఏడుకొండలను దారుణంగా కొట్టారు.
12వ తేదీనే ఏడుకొండలను వదిలేశామని చెబుతున్న పోలీసులు, 13, 14 తేదీలకు సంబంధించిన మనుబోలు పోలీస్ స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్ను బయటపెట్టాలి. ఎస్పీ గారు దయచేసి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయకండి. ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా ఉండటానికి ఒత్తిడితో నిజాన్ని దాచిపెట్టకండి. ఇదే కేసులో ఉన్న రియాజ్ను వెంకటాచలం పీఎస్కు పిలిచి అనుకూలంగా స్టేట్మెంట్ తీసుకున్నారు.
నా మాటల్లో నిజం లేకుంటే పూర్తి ఆధారాలతో ఎస్పీ సమాధానం చెప్పాలి. ఈ ఘటన అనంతరం టీడీపీ నాయకుడు ఏడుకొండలు అక్కకు కాల్ చేశారు. ఎస్ఐను బదిలీ చేయిస్తాం, మీకు ఇంకా కుటుంబం ఉంది అని సంభాషించాడు. అవసరం అయితే ఎమ్మెల్యే సోమిరెడ్డితో మాట్లాడి ఆర్థికంగా లబ్ధి చేస్తాం అని కూడా చెప్పారు. మేము దొంగలను సపోర్ట్ చేయడం లేదు. లాకప్ డెత్ లాంటి ఘోరమైన ఘటనలను ప్రశ్నిస్తున్నాం అని వ్యాఖ్యలు చేశారు.


