సాక్షి, విజయనగరం: ముఖ్యమంత్రి చంద్రబాబుకు కుటుంబాలను విడదీసే చరిత్ర ఉందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. బొత్స సత్యనారాయణ కుటుంబాన్ని ఎవరూ టచ్ చేయలేరు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే, బొత్స సత్యనారాయణ ఒక రాజకీయ విశ్వ విద్యాలయం అని ప్రశంసించారు.
విజయనగరం జిల్లాలో నేడు వైఎస్సార్సీపీ జిల్లా సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మండలి ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, పలువురు నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ..‘విజయనగరం జిల్లా కార్యకర్తలు బొత్స 2.O కోసం ఎదురు చూస్తున్నారు. వైఎస్ జగన్ రాజకీయ పార్టీ పెట్టినప్పుడు నాయకులను నమ్మి పార్టీ పెట్టలేదు. వైఎస్సార్ అభిమానులను, ప్రజలను నమ్మి పార్టీ పెట్టారు. చంద్రబాబుకి కుటుంబాలను విడదీసే చరిత్ర ఉంది. అన్ని కుటుంబాల్లో ఇది జరగొచ్చు.
కానీ బొత్స సత్యనారాయణ కుటుంబాన్ని టచ్ చేయలేరు. లోకేష్ చుట్టూ ఐఏఎస్ అధికారులు తిరుగుతున్నారని, చంద్రబాబు అనుకుంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు గాడిద కూడా గుర్రంలా కనిపిస్తుంది. ఇప్పుడు లోకేష్ చుట్టూ తిరిగిన అధికారులు, రేపు గాడిద చుట్టూ తిరిగాం అని అనుకునే రోజు వస్తుంది. బొత్స సత్యనారాయణ ఒక రాజకీయ విశ్వ విద్యాలయం. ఎంతో మందిని సర్పంచ్ల నుంచి ఎమ్మెల్యేలను చేసిన చరిత్ర ఆయనది’ అంటూ వ్యాఖ్యలు చేశారు. కాగా, అమర్నాథ్.. చిన్న శ్రీను అంశం మాట్లాడుతుండగా బొత్స మరోసారి భావోద్వేగానికి లోనయ్యారు. కన్నీరు పెట్టుకున్నారు.
ఇదీ చదవండి: ఆయన మనకెందుకు.. టీడీపీలో కొత్త చర్చ


