విజయప్రతాప్రెడ్డిపై హత్యాయత్నం దారుణం
వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మండిపాటు
అధికార పార్టీ అరాచకాన్ని ప్రజలు గమనిస్తున్నారు
చేయకూడని తప్పులు చేస్తున్న వారిపై చట్ట ప్రకారం చర్యలు తప్పవ
వైఎస్సార్సీపీ నేతలు ధైర్యంగా ఉండాలి.. పార్టీ అండగా ఉంటుంది
బాధితుడి తండ్రితో ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పిన జగన్
సాక్షి, అనంతపురం: అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం యల్లనూరు మండల కేంద్రంలో వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ సభ్యుడు భోగతి విజయప్రతాప్ రెడ్డిపై టీడీపీ వర్గీయుల హత్యాయత్నం దారుణమని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మండిపడ్డారు. ఈ తరహా దాడులు, దౌర్జన్యాలు, అక్రమ కేసులతో వైఎస్సార్సీపీ నేతలను, కార్యకర్తలను ఇబ్బందులు పెట్టడం ఎంత మాత్రం సరికాదని హెచ్చరించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని టీడీపీ నాయకులు చేస్తున్న దౌర్జన్యాలను, అనైతిక కార్యక్రమాలను, అరాచకాన్ని ప్రజలు గమనిస్తున్నారని, వారికి గట్టిగా బుద్ధి చెప్పే రోజు త్వరలోనే వస్తుందన్నారు.
టీడీపీ వర్గీయుల చేతిలో గాయపడిన విజయ ప్రతాప్రెడ్డి ఆరోగ్యంపై ఆయన తండ్రి భోగతి నారాయణరెడ్డితో వైఎస్ జగన్ శుక్రవారం ఫోన్లో మాట్లాడి పరామర్శించారు. దాడి జరిగిన తీరును నారాయణరెడ్డి జగన్కు వివరించారు. పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని టీడీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడడం దారుణమని ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి నాయకుల వైఫల్యాలను ప్రశ్నిస్తే ఇలా భయోత్పాతం సృష్టిస్తుండటాన్ని ప్రజలు గమనిస్తున్నారని గుర్తుంచుకోవాలన్నారు.
వైఎస్సార్సీపీ నాయకులంతా ధైర్యంగా ఉండాలని, పార్టీ అందరికీ అండగా ఉంటుందని జగన్ భరోసా ఇచ్చారు. రాజకీయాలు ఇంతలా దిగజారిపోవడం దురదృష్టకరమన్నారు. చేయకూడని తప్పులు చేస్తున్న వారిపై వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే చట్ట ప్రకారం తగిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ప్రతాప్రెడ్డి కుటుంబానికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.


