సాయికృష్ణ లాకప్ డెత్ ఘటనపై వైఎస్సార్సీపీ నేత అంబటి డిమాండ్
విజయవాడలో జరిగిన ఈ ఘటన దేశంలోనే అత్యంత ఘోరం
రాష్ట్రంలో నరరూప రాక్షసుల పాలన సాగుతోందన్న వంగవీటి నరేంద్ర
తాము జనసేన మద్దతు దారులమని సాయికృష్ణ మేనమామ నవరంగ్ స్పష్టీకరణ
గుంటూరు ఎడ్యుకేషన్: విజయవాడ కృష్ణలంకలో గాదె సాయికృష్ణ లాకప్ డెత్ ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. గుంటూరులో బుధవారం వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర, గాదె సాయికృష్ణ మేనమామ నవరంగ్తో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. విజయవాడలో జరిగిన లాకప్డెత్ ఘటన, పోలీసులు వ్యవహరించిన తీరు దేశంలోనే అత్యంత దుర్మార్గపూరితమని మండిపడ్డారు.
ఎక్కడైనా లాకప్డెత్ జరిగితే కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగిస్తారని, సాయికృష్ణ మృతదేహాన్ని పోలీసులు గుట్టుచప్పుడు కాకుండా కాల్చి వేయడంపై ఆందోళన వ్యక్తం చేశారు. 23 ఏళ్ల యువకుడు సాయికృష్ణను అరెస్టు చేసిన కృష్ణలంక సీఐ.. చిత్రహింసలకు గురి చేయడం వల్లే అతను మృతి చెందాడని, ఆధారాలు లేకుండా చేసేందుకు శవాన్ని శ్మశానంలో దహనం చేశారని ఆరోపించారు. శాంతి భద్రతలను కాపాడి ప్రజలకు అండగా ఉండాల్సిన పోలీసులు చేయాల్సిన పనేనా ఇది అని ప్రశ్నించారు.
తల్లడిల్లిన కన్నపేగు
గాదె సాయికృష్ణ కన్నతల్లి మాట్లాడిన తీరు వర్ణనాతీతమని, తన కొడుకును చంపేసి ఉంటే శవాన్ని అప్పగించాలని, బూడిద చేసి ఉంటే కనీసం చితాభస్మాన్ని అయినా అప్పగించాలని వేడుకున్న తీరు ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తోందని అంబటి చెప్పారు. పోలీసులు ఏ ధైర్యంతో ఈ విధంగా సాయికృష్ణను చిత్రహింసలకు గురి చేసి చంపేశారని ప్రశ్మీంచారు. అతను రౌడీషీటర్ అని ఆరోపిస్తున్న పోలీసులు అతనిపై ఎన్నో కేసులు పెండింగ్లో ఉన్నట్లు చెబుతున్నారని, రౌడీషీటర్ అయితే చంపేస్తారా అని నిలదీశారు. సాయికృష్ణ తండ్రి, ఆయన అన్నదమ్ములది ఉమ్మడి కుటుంబమని, జనసేన పార్టీలో క్రియశీలకంగా కొనసాగుతున్నారని చెప్పారు.
సాయికృష్ణను అరెస్టు చేసి, విజయవాడలో నడిరోడ్డుపై నడిపించిన ఘటనను ప్రజలంతా కళ్లారా చూశారని, హైకోర్టులో పోలీసుల తీరుకు వ్యతిరేకంగా హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసిన తర్వాత ఈనెల 29లోగా సాయికృష్ణను కోర్టు ఎదుట హాజరు పర్చాలని న్యాయమూర్తి పోలీసులను ఆదేశించారని చెప్పారు. హైకోర్టు జోక్యంతో పోలీసులు పాల్పడిన నేరం, పాశవికంగా చేసిన హత్య ఉదంతం వెలుగులోకి వస్తాయన్నారు. లాకప్డెత్కు పాల్పడిన సీఐపై మాత్రమే చర్య సరిపోదని, బాధ్యులైన పోలీసులందరిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ ఘటనపై సీబీఐ, సిట్టింగ్ జడ్జితో విచారణ చేయిస్తే నిజా నిజాలు వెలుగు చూస్తాయన్నారు. సాయికృష్ణ కుటుంబానికి, అతని తల్లి విజయలక్ష్మీ కి అండగా నిలిచి, న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తామని చెప్పారు. డబ్బులు ఇస్తాం కేసు వెనక్కు తీసుకోవాలని పోలీసులు, వారి వెనుక ఉన్న టీడీపీ, జనసేన నేతలు సాయికృష్ణ కుటుంబంపై ఒత్తిడి తెస్తున్నారని, డబ్బులు ఇచ్చి హత్యా నేరాన్ని కడిగేసుకుంటారా అని నిలదీశారు.
ఈ విషయంలో సరైన యాక్షన్ లేకపోతే ప్రజల రియాక్షన్ చూస్తారని హెచ్చరించారు. కాపు యువకుడిని చంపేసి, శవం కాల్చేసి మాయం చేయడమే కాకుండా.. అదే కాపు యువకుడి కుటుంబానికి డబ్బులిచ్చి రాజీ చేయడం కోసం మళ్లీ కాపు నేతను మధ్యవర్తిత్వం పంపడం దారుణమని కాపులంతా మండిపడుతున్నారని చెప్పారు. జనసేన కుటుంబ సభ్యుడికి అన్యాయం జరిగితే ఆ పార్టీ అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు.
మానవత్వంతో స్పందించాలి
వంగవీటి నరేంద్ర మాట్లాడుతూ.. గాదె కుటుంబానికి వంగవీటి కుటుంబంతో సన్నిహిత సంబంధాలున్నాయని చెప్పారు. గాదె సాయికృష్ణ నిందితుడని, అతడిని కోర్టు.. నేరస్తుడిగా తీర్పు చెప్పలేదన్నారు. జరిగిన ఘటనపై న్యాయం కోసం గళం విప్పిన అంబటి ప్రవేశంతో వైఎస్సార్సీపీ ముద్ర వేశారని, రాష్ట్రంలో కూటమి పాలన నరరూప రాక్షస పాలనను తలపిస్తోందన్నారు. లాకప్డెత్ ఘటనపై ప్రశ్మీస్తే, హోం మంత్రి ఈ విషయాన్ని డైవర్ట్ చేసి సంబంధం లేని విషయాలు మాట్లాడుతున్నారని ఆరోపించారు.
ఒక తల్లి వేదనను రాజకీయ పార్టీలకు అంటగట్టడం దారుణం
సాయికృష్ణ మేనమామ నవరంగ్ మాట్లాడుతూ.. కొడుకును పోగొట్టుకున్న సాయికృష్ణ తల్లి ఆర్తనాదంపై అధికార పక్షం స్పందించ లేదని, పైగా దీనిని రాజకీయ పార్టీలకు అంటగట్టడం దారుణమన్నారు. కృష్ణలంక పోలీసులు మార్కాపురం నుంచి గాదె సాయికృష్ణను తీసుకొచి్చ, దారుణంగా హింసించి చంపారని, అతడి తల్లి కన్నీటికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తాము తొలి నుంచి వంగవీటి రంగా మద్దతుదారులుగా ఉన్నామని, వారి కుటుంబంతో తమకు ఏళ్ల తరబడి సత్సంబంధాలు ఉన్నాయని చెప్పారు. విజయవాడలోని రాజకీయ నేతలతో తమకు కుటుంబ బాంధవ్యాలు ఉన్నాయని అన్నారు. కాపు యువకుడిని పోలీసులు ఇంత దారుణంగా చంపేసి, మృతదేహాన్ని కనిపించకుండా తగులబెట్టిన ఘటనపై కాపు సామాజికవర్గ నేతలు మౌనంగా ఉండటం తగదన్నారు.


