నేడు వైఎస్సార్ జీవిత సాఫల్య అవార్డుల ప్రకటన
సాక్షి, అమరావతి: వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన వ్యక్తులకు వైఎస్సార్ జీవిత సాఫల్య (లైఫ్టైమ్ అచీవ్మెంట్), వైఎస్సార్ సాఫల్య (అచీవ్మెంట్) పురస్కారాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించనుంది. ప్రభుత్వం తరఫున అవార్డుల హై పవర్ స్క్రీనింగ్ కమిటీ సభ్యుడు, రాష్ట్ర కమ్యూనికేషన్ల సలహాదారు జీవీడీ కృష్ణమోహన్ ఈ నెల 7న వివరాలు వెల్లడించనున్నారు. వ్యవసాయం, కళలు, సంస్కృతి, సాహిత్యం మొదలైన కేటగిరీలకు ఈ అవార్డుల్లో ప్రభుత్వం ప్రాధాన్యతనిచ్చింది.
విశిష్ట సేవలు అందించిన కోవిడ్ వారియర్స్తో పాటు అసామాన్య ప్రతిభ కనబరిచిన సామాన్యులకు కూడా ప్రభుత్వం పురస్కారాలు అందజేయనుంది. వైఎస్సార్ జీవిత సాఫల్య పురస్కారానికి రూ.10 లక్షలు, వైఎస్సార్ కాంస్య ప్రతిమ, మెడల్(జ్ఞాపిక)ను బహూకరించనుంది. వైఎస్సార్ సాఫల్య అవార్డుకు రూ.5 లక్షలు, వైఎస్సార్ కాంస్య ప్రతిమ, మెడల్(జ్ఞాపిక)ను అందించనుంది.