సాక్షి,తాడేపల్లి: కూటమి ప్రభుత్వ డీఎస్సీ స్కాంకు బలైన డీఎస్సీ అభ్యర్థులకు తోడుగా ఉంటానని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హమీ ఇచ్చారు. చంద్రబాబు సర్కార్ తమను అన్యాయం చేసిందని ఆవేదన వ్యక్తం చేస్తూ పలువురు డీఎస్సీ అభ్యర్థులు బుధవారం తాడేపల్లిలో వైఎస్ జగన్తో భేటీ అయ్యారు.
ఈ భేటీలో అర్హత ఉన్నా తమకు ఉద్యోగం రాని తీరును వివరించారు. తెర వెనుక ‘డార్క్ ఆపరేషన్’ జరిగిందనీ.. పెద్ద ఎత్తున డబ్బు చేతులు మారాయని డీఎస్సీ అభ్యర్థులు ఫిర్యాదు చేశారు.
డీఎస్సీ అభ్యర్థులకు తోడుగా నేనుంటా
డీఎస్సీ అభ్యర్థుల ఆవేదనపై వైఎస్ జగన్ స్పందించారు. అభ్యర్థులకు న్యాయపరమైన సహాయం అందిస్తాం. అన్యాయం జరిగిందంటున్న అభ్యర్థులకు తోడుగా నిలుస్తాం. అభ్యర్థుల న్యాయ పోరాటాలకు తోడుగా ఉంటాం. పార్టీకి చెందిన లీగల్ విభాగం ఈ పోరాటంలో మీకు సహాయపడుతుంది. ఆ లీగల్ ఖర్చులను మేమే భరిస్తాం.
డీఎస్సీ అక్రమాలు, ఉల్లంఘనలపై సీబీఐ చేత ఎంక్వైరీ చేయించాలని ఇప్పటికే డిమాండ్ చేశాం. ఇప్పుడు అన్యాయం జరిగిందని చెప్తున్న కేసులన్నింటి మీద రీ ఎంక్వైరీ చేయిస్తాం. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కచ్చితంగా రీ ఎంక్వైరీ చేయిస్తాం. ఈ ప్రత్యేక కేసులమీదే కమిషన్కూడా వేయిస్తాం. స్పోర్ట్స్ కోటా పేరిట ఎలాంటి ఎగ్జామ్స్ లేకుండా సర్టిఫికెట్ ఆధారంగా ఇస్తామని జీవో ఇచ్చారు.
ఉద్యోగాలు పూర్తిచేశాక, మళ్లీ ఆ జీవోను మార్పు చేసి మళ్లీ కొత్త జీవో తీసుకొచ్చారు. ఎవరికోసం మొదట జీవో తీసుకొచ్చారు. ఎవరికి మేలు చేయడానికి తీసుకొచ్చారు. చంద్రబాబు తన వాళ్లకోసం గేట్లు తెరిచారు. వాళ్ల పని అయిపోయిన తర్వాత మళ్లీ జీవోను ఉప సంహరించుకున్నారని చంద్రబాబు సర్కార్పై వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.


