
రౌడీ రాజకీయాలు తప్ప ప్రజల అభిమానాన్ని, మనసును గెలుచుకోలేరు
వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మండిపాటు
కుట్రలు, దౌర్జన్యాలు, దాడులు, అబద్ధాలు, మోసాలు, వెన్నుపోట్లతో కుర్చీ లాక్కుంటారు
ఇందుకు పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాల ఉప ఎన్నికల్లో బరితెగింపే సాక్ష్యం
చంద్రబాబు అడుగులకు మడుగులొత్తే కొందరు అధికారులు, పోలీసులతో ముఠా ఏర్పాటు
టీడీపీ అరాచక గ్యాంగ్లతో కలిసి చేసే దారుణాలతో ఉప ఎన్నికలను హైజాక్ చేసే కుట్ర
ఇదివరకెన్నడూ లేని విధంగా వందలాది మంది వైఎస్సార్సీపీ నేతల బైండోవర్
ఈనెల 5న ఓ పెళ్లికి వెళ్లిన అమరేష్ రెడ్డి, సైదాపురం సురేష్ రెడ్డిపై దాడి
అడ్డుకోబోయిన పెళ్లి వారిపై, శ్రీకాంత్, నాగేశ్, తన్మోహన్ రెడ్డి తదితరులపైనా దాడి
ఈనెల 6న ఎమ్మెల్సీ రమేష్ కుమార్ యాదవ్, వేల్పుల రామలింగారెడ్డిలపై హత్యాయత్నం
ఈ సమయంలో లా అండ్ ఆర్డర్ కాపాడాల్సిన పోలీసులు పూర్తిగా ప్రేక్షక పాత్ర.. దాడికి పాల్పడిన వారిలో ఒక్కరిని కూడా అరెస్ట్ చేయని వైనం
పైగా బాధితుడైన వేల్పుల రాము సహా మరో 50 మందిపై ఎస్సీ, ఎస్టీ కేసు
జరగని ఘటనను జరిగినట్టుగా దుర్మార్గంగా తప్పుడు ఫిర్యాదు సృష్టించిన వైనం
బెదిరింపులతో పార్టీ మారిన వ్యక్తితో ఫిర్యాదు ఇప్పించి నలుగురికి నోటీసులు
ఇన్ని చేసినా ఫలితం లేదని ఇష్టానుసారంగా పోలింగ్ బూత్ల మార్పు.. మీడియాపై ఆంక్షలు
సాక్షి, అమరావతి: చంద్రబాబు అనే వ్యక్తి ఒక అప్రజాస్వామిక, అరాచక వాది అని.. రౌడీ రాజకీయాలు తప్ప ప్రజల అభిమానాన్ని, ప్రజల మనసును గెలుచుకుని రాజకీయాలు చేయరని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. కుట్రలు చేసి, దాడులు, దౌర్జన్యాలు చేసి, అబద్ధాలు చెప్పి, మోసాలు చేసి, వెన్నుపోట్లు పొడిచి కుర్చిని లాక్కోవాలని చూస్తున్నారనడానికి మరోమారు మన కళ్లెదుటే రుజువులు కనిపిస్తున్నాయంటూ దెప్పి పొడిచారు.
పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాల ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యానికి పాతర వేస్తూ ఆయన చేస్తున్న నిస్సిగ్గు, బరితెగింపు రాజకీయాలే దీనికి సాక్ష్యాలు అంటూ ఎత్తిచూపారు. ముఖ్యమంత్రిగా తనకున్న అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరగనీయకుండా, కుట్ర పూరితంగా, అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
చంద్రబాబు, ఆయన అడుగులకు మడుగులొత్తే కొంత మంది అధికారులు, టీడీపీ అరాచక గ్యాంగులు, ఈ గ్యాంగులకు కొమ్ముకాసే మరికొంత మంది పోలీసులు.. వీరంతా ఒక ముఠాగా ఏర్పడి అక్కడి ఎన్నికను హైజాక్ చేయడానికి దుర్మార్గాలు, దారుణాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాల ఉప ఎన్నికల్లో చంద్రబాబు అమలు చేస్తున్న కుట్రపూరిత పన్నాగాన్ని సాక్ష్యాధారాలతో వివరిస్తూ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..
⇒ పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాల ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ వచి్చంది మొదలు పోలీసుల అరాచకాలు పెరిగిపోయాయి. వందల మంది వైఎస్సార్సీపీ నాయకులను, కార్యకర్తలను బైండోవర్ చేశారు. తమ జీవితంలో ఎప్పుడూ పోలీస్స్టేషన్ గడప తొక్కని వారిని, ఎలాంటి కేసులు లేని వారిని కూడా బైండోవర్ చేసి, వైఎస్సార్సీపీ తరఫున పని చేస్తున్న వారిని, ప్రచారం చేస్తున్న వారిని పోలీసులను ఉపయోగించుకుంటూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఇది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.
⇒ ఎన్నికల్లో భయాన్ని నింపడానికి ఆగస్టు 5న పులివెందులలో ఓ వివాహానికి హాజరైన వైఎస్సార్సీపీ నాయకులపై టీడీపీ గ్యాంగులు దాడి చేశాయి.
ఈ ఘటనలో అమరేష్ రెడ్డి, సైదాపురం సురేష్ రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. అడ్డుకోబోయిన పెళ్లి వారిని, శ్రీకాంత్, నాగేశ్, తన్మోహన్ రెడ్డి తదితరులపైనా దాడికి దిగారు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున పని చేస్తే ఇలానే దాడులు చేస్తామంటూ హెచ్చరికగా దీనికి పాల్పడ్డారు.

⇒ ఆగస్టు6న ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న బీసీ యాదవ సామాజిక వర్గానికి చెందిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వైఎస్సార్సీపీ నాయకుడు వేల్పుల రామలింగారెడ్డిలను హత్య చేయడమే లక్ష్యంగా నల్లగొండువారిపల్లి వద్ద వారు ప్రయాణిస్తున్న కారుపై టీడీపీ గ్యాంగులు కర్రలు, రాళ్లు, రాడ్లతో దాడి చేసి, వీరిని తీవ్రంగా గాయపరిచారు. కారుని బద్దలు కొట్టారు.
పెట్రోల్ పోసి ఆ కారుకు నిప్పంటించే ప్రయత్నం కూడా చేశారు. రమేష్ యాదవ్కు గాయాలుకాగా, తీవ్ర గాయాలతో రక్తం ఓడుతున్న వేల్పుల రామలింగారెడ్డిని ఆస్పత్రిలో చేరి్పంచారు. లా అండ్ ఆర్డర్ కాపాడాల్సిన పోలీసులు పూర్తిగా ప్రేక్షక పాత్ర వహించారు. వైఎస్సార్సీపీ నాయకులెవ్వరినీ పల్లెల్లో తిరగనీయకూడదని, ఒకవేళ అలా చేస్తే ఈ రకంగా దాడులు చేస్తామన్న సంకేతాలు ఇవ్వడానికే టీడీపీ గ్యాంగులతో ఈ దారుణాలకు ఒడిగట్టారు.
⇒ తప్పు చేసిన వారిని అరెస్టులు చేయాల్సింది పోయి, ఆగస్టు 6వ తేదీ మధ్యాహ్నం 3.30 గంటలకు వైఎస్సార్సీపీ నాయకులపైనే తప్పుడు కేసు పెట్టారు. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వేల్పుల రామలింగారెడ్డిపై దాడి చేసిన వారిలో ఒక్కరిని కూడా పోలీసులు అరెస్టు చేయకపోగా, జరగని ఘటనను జరిగినట్టుగా ఒక తప్పుడు ఫిర్యాదును సృష్టించి, దాని ఆధారంగా బాధితుడైన వేల్పుల రాము సహా మరో 50 మందిని నిందితులుగా పేర్కొంటూ ఎస్సీ, ఎస్టీ, హత్యాయత్నం కేసు పెట్టారు. ఈ తప్పుడు కేసును వాడుకుని, ఇప్పటికే పలు అరెస్టులు చేశారు. పోలింగ్ రోజున మరింత మంది వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను నిర్బంధించే కుట్రను అమలు చేస్తున్నారు.
⇒ ఆగస్టు 8న వైఎస్సార్సీపీకి చెందిన ఒక నాయకుడిని బెదిరించి, భయపెట్టి, ప్రలోభపెట్టి, తమ వైపునకు లాక్కుని, అలా పార్టీ మారిన వ్యక్తి నుంచి తప్పుడు ఫిర్యాదు తీసుకుని.. తప్పుడు కేసుపెట్టి, దాని ఆధారంగా వైఎస్సార్సీపీకి చెందిన రాఘవరెడ్డి, గంగాధరరెడ్డి, వైఎస్ భాస్కర్రెడ్డి, దేవిరెడ్డి శివశంకరరెడ్డిలకు నోటీసులు జారీ చేశారు.

⇒ అధికార పార్టీతో చేతులు కలిపిన అధికారులు.. ఆగస్టు 8న వైఎస్సార్సీపీ ఓట్లను తగ్గించేందుకు పల్లెల పోలింగ్ బూత్లను ఆ గ్రామాల్లో కాకుండా పక్క గ్రామాలకు మార్చారు. ఓటు వేయాలంటే రెండు గ్రామాల ప్రజలు 2 కి.మీ, మరో రెండు గ్రామాల ప్రజలు 4 కి.మీ దూరం వెళ్లాల్సి ఉంటుంది. పులివెందుల జెడ్పీటీసీలో 10,601 ఓట్లు ఉంటే అందులో దాదాపు 4 వేల మంది ఓటర్లను, పక్కా వైఎస్సార్సీపీకి చెందిన గ్రామాలకు చెందిన వారిని ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నారు.
వీళ్లు ఓటేయడానికి వెళ్లకుండా బెదిరించడం, భయపెట్టడం, భౌతిక దాడులకు దిగడం, ఓటు వేయనీయకుండా అడ్డుకుని, తద్వారా ఓటింగ్ను తగ్గించడం, బూత్లను ఆక్రమించుకుని రిగ్గింగ్కు పాల్పడటం.. ఈ మాదిరి చంద్రబాబు కుట్ర చేస్తున్నారు. (పోలింగ్ బూత్లను అడ్డగోలుగా ఎలా మార్చారన్నది టేబుల్లో పరిశీలించగలరు.)
⇒ నల్లగొండువారిపల్లి వద్ద టీడీపీ గ్యాంగుల దాడిలో గాయపడ్డ వేల్పుల రామలింగారెడ్డిపైనే ఆగస్టు 8వ తేదీ రాత్రి ఎస్సీ, ఎస్టీ తప్పుడు కేసు పెట్టిన ఘటనలో 12 మందిని అరెస్టు చేశారు. ఇందులో కొంత మంది, ఆ ఘటన జరిగినట్టుగా పోలీసులు చెబుతున్న సమయంలో బైండోవర్ ప్రక్రియలో భాగంగా అదే పోలీస్
స్టేషన్లో, పోలీసుల సమక్షంలోనే ఉన్నారు.
అయినా వారి మీద కూడా ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టారు. సాక్ష్యాలు, రుజువులు చూపించడంతో తప్పని పరిస్థితుల్లో పోలీసులు వీరిని వదిలి పెట్టాల్సి వచి్చంది. మిగిలిన 8 మందిని ఈ తప్పుడు కేసులో రిమాండ్కు తరలించారు. ఈ తప్పుడు కేసులోనే టీడీపీ వాళ్లు ఎవరు కోరితే వారిని నిర్బంధించే పనిలో పోలీసులు ఉన్నారు. విచిత్రం ఏంటంటే, టీడీపీ కండువా కప్పుకోగానే ఒకర్ని ఈ కేసులో నిందితుల జాబితా నుంచి తప్పించారు.
⇒ ఎన్నికల పోలింగ్ రోజున ఓటింగ్ శాతం తగ్గించేందుకు, తాము చేసే దాడులు, దౌర్జన్యాలు, బూత్ ఆక్రమణలు, రిగ్గింగ్లు కనిపించకుండా ఉండేందుకు, అక్కడ వాస్తవాలేమీ బయటకు తెలియనీయకుండా ఉండేందుకు మీడియాను కట్టడి చేస్తున్నారు. వారిపైనా దాడులకు సిద్ధమవుతున్నారు. లైవ్ వాహనాలను, వాటికి సంబంధించిన కిట్లను ధ్వంసం చేయడానికి టీడీపీ గ్యాంగులు ఇప్పటికే తిరుగుతున్నాయి. అసలు ఇవి ప్రజాస్వామ్య ఎన్నికలు అని చెప్పుకునేందుకు సిగ్గుపడాలి. అయినా దేవుడి మీద, ప్రజల మీద నమ్మకం ఉంది. అంతిమంగా ధర్మమే గెలుస్తుంది.