అన్యాయాలను ప్రశ్నిస్తే.. పొట్టన పెట్టుకున్నారు: వైఎస్‌ జగన్‌ | YS Jagan condemns death of YSRCP worker in Sri Sathya Sai district | Sakshi
Sakshi News home page

అన్యాయాలను ప్రశ్నిస్తే.. పొట్టన పెట్టుకున్నారు: వైఎస్‌ జగన్‌

Apr 1 2025 4:04 AM | Updated on Apr 1 2025 10:36 AM

YS Jagan condemns death of YSRCP worker in Sri Sathya Sai district

వైఎస్సార్‌సీపీ కార్యకర్త కురుబ లింగమయ్య హత్యను తీవ్రంగా ఖండించిన మాజీ సీఎం వైఎస్‌ జగన్‌

రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని తీవ్ర ఆగ్రహం 

కక్ష రాజకీయాలకు బడుగు, బలహీనవర్గాల వారిని బలిచేస్తున్నారంటూ ఆవేదన 

ఈ ఘటనకు బాధ్యులైన వారిని కచ్చితంగా చట్టం ముందు నిలబెడతామని హెచ్చరిక 

లింగమయ్య కుటుంబానికి వైఎస్సార్‌సీపీ అండగా నిలుస్తుందని భరోసా 

సాక్షి, అమరావతి: అధికార పార్టీ అన్యాయాలను ప్రశ్నించినందుకు.. దాడులను వ్యతిరేకించినందుకు శ్రీసత్యసాయి జిల్లాలో వైఎస్సార్‌సీపీ కార్యకర్త, బీసీ వర్గానికి చెందిన కురుబ లింగమయ్యను టీడీపీ నాయకులు పొట్టనపెట్టుకున్నారని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కురుబ లింగమయ్య హత్యను ఆయన తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని.. కురబ లింగమయ్య హత్యే దీనికి నిదర్శనమని విమర్శించారు. పార్టీ కార్యకర్త కురుబ లింగమయ్య కుటుంబానికి వైఎస్‌ జగన్‌ ప్రగాఢ సంతాపం తెలిపారు.

వారి కుటుంబానికి వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ మేరకు సోమవారం వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటనలో వైఎస్‌ జగన్‌  ఏమన్నారంటే.. ‘శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గంలోని రామగిరి మండలం పాపిరెడ్డిపల్లికి చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త, బీసీ వర్గానికి చెందిన కార్యకర్త కురుబ లింగమయ్య హత్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. బడుగు, బలహీన వర్గాల వారిని కక్ష రాజకీయాలకు బలిచేస్తున్నారు. ఈ ఘటనకు బాధ్యులైన­వారిని కచ్చితంగా చట్టంముందు నిలబెడతాం. రాష్ట్రంలో చట్టబద్ధ పాలన లేదు.

కూటమి పాలనలో టీడీపీ అరాచకాలపై వైఎస్ జగన్ ఫైర్

వ్యక్తుల భద్రతకు భరోసా కొరవడిన పరిస్థితులు నెలకొన్నాయి. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నాయకుల మీద దాడులు పరిపాటిగా మారాయి. రక్షణ కల్పించాల్సిన పోలీసులు అధికార పార్టీ నాయకులతో కుమ్మక్కయ్యారు. రామగిరి మండల ఉప ఎన్నికలో జరిగిన అరాచకాల వెనుక పోలీసుల వైఫల్యం తీవ్రంగా ఉంది.

 అధికార పార్టీ నేతల దారుణాలను అడ్డుకోవడంలో, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంలో వారి బాధ్యతా రాహిత్యం కారణంగానే ఈ ఘటన జరిగింది. రామగిరిలో వైఎస్సార్‌సీపీకి చెందిన ఎంపీటీసీ సభ్యులు టీడీపీ నేతల దౌర్జన్యాలతో భయభ్రాంతులకు గురై ఎన్నికలను బహిష్కరించినా, పోలీసులు అధికార పార్టీకి వంతపాడుతూ వైఎస్సార్‌సీపీ నేతల పైనే తప్పుడు కేసులు నమోదు చేయడం దుర్మార్గం’ అని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement