
ఇది అరాచక.. విధ్వంసక.. వినాశక పాలన
మహిళల భద్రతకు భరోసా లేదు
కూటమి ఏడాది పాలనపై మండిపడ్డ న్యాయవాదులు, వైద్యులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, వలంటీర్లు, డ్వాక్రా మహిళలు, మహిళా నాయకులు
కూటమి వైఫల్యాలను తూర్పారబట్టిన ఎమ్మెల్సీలు వరుదు కల్యాణి, కల్పలతారెడ్డి, మాజీ మంత్రి తానేటి వనిత,
మేయర్ శిరీష, సుభద్ర, మాజీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వం సాగించిన ఏడాది పాలనలో అన్ని రంగాల్లో మహిళలు వంచనకు గురయ్యారని వివిధ రంగాలకు చెందిన మహిళా నేతలు నిప్పులు చెరిగారు. కూటమి ఏడాది పాలనంతా ఆరాచక.. విధ్వంసక.. వినాశక పాలనగా సాగిందని మండిపడ్డారు. మహిళల భద్రతకు ఏవిధంగానూ భరోసా లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైఎస్సార్సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో ‘ఏడాది కూటమి పాలన.. మహిళలకు వంచన’ అనే అంశంపై విజయవాడ రామవరప్పాడులోని ఎం.కన్వెన్షన్ సెంటర్లో శనివారం చర్చావేదిక నిర్వహించారు. మహిళా న్యాయవాదులు, వైద్యులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, వలంటీర్లు, డ్వాక్రా సంఘాల నేతలు, వివిధ రంగాలకు చెందిన మహిళా ప్రముఖులు, మహిళా నేతలు పెద్దఎత్తున హాజరై తమ గళం వినిపించారు.
మహిళల జీవితాలు తల్లకిందులయ్యాయి
వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మాట్లాడుతూ.. ‘రాష్ట్రం అవినీతి పాలన అప్పుల ఆంధ్రాగా మారింది. ఏడాదిలోనే మహిళల జీవితాలు తలకిందులైపోయాయి. వైఎస్ జగన్మోహన్రెడ్డి మహిళా సాధికారతకు పెద్దపీట వేశారు. కానీ.. ఈ ప్రభుత్వంలో మహిళా భక్షక పాలన సాగుతోంది. తొలి ఏడాదిలో తొమ్మిది శాతం కూడా మహిళలకు ప్రయోజనం చేకూర్చలేదు.
రోజుకు 70 మంది మహిళలపై దాడులు జరగడం స్వర్ణాంధ్ర అంటారా? సందుసందుకి మద్యం షాపులు ఉండటాన్ని స్వర్ణాంధ్ర అంటారా? 17 ఏళ్లలో చేయనంత అప్పు చేయడాన్ని స్వర్ణాంధ్ర అంటారా?, సూపర్ సిక్స్ అమలు చేసేశాను.. ఎవరైనా అడిగితే వారి నాలుక మందం ఎక్కినట్టే అని సీఎం చెబుతున్నారు. సూపర్ సిక్స్ అడిగిన వారి నాలుక మందం అయితే.. ఎగ్గొట్టిన వారిని ఏమనాలి? ఇంటింటికీ బాండ్లు పంచిన వారిని ఏమనాలి? గతంలో అమ్మఒడిపై విమర్శలు చేశారు.
వైఎస్ జగన్ అమలు చేసిన పథకాలను ఈ ప్రభుత్వం కాపీకొట్టగలదు.. కానీ జగన్ చిత్తశుద్ధిని కాపీ కొట్టలేరు. ఏడాది కాలంలో మద్యం, గంజాయి, డ్రగ్స్ విపరీతంగా పెరిగిపోయాయి. రాష్ట్రంలో అఘాయిత్యాలకు ఇవే ప్రధాన కారణం. అనంతపురంలో బాలిక అదృశ్యమైందని తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా వారం రోజులు పట్టించుకోలేదు. పోలీసుల నిర్లక్ష్యంతో బాలిక శవమై తేలింది. సత్యసాయి జిల్లాలో 14 ఏళ్ల బాలికపై టీడీపీ కార్యకర్తలు నెలల తరబడి అత్యాచారానికి పాల్పడ్డారు’ అని మండిపడ్డారు..
మహిళలకు భద్రత కల్పించాలనే ఆలోచనే లేదు
మాజీ హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. ‘రాష్ట్రాన్ని ఎలా దోచుకోవాలా అనే ఆలోచన తప్ప మహిళలకు భద్రత కల్పించాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. వైఎస్ జగన్ దిశ యాప్ తెస్తే దానిపై ప్రస్తుత హోంమంత్రి హేళనగా మాట్లాడారు. అదే దిశ యాప్ పేరు మార్చి శక్తి యాప్ అని పెట్టారు. అమ్మఒడి పథకంలో పాఠశాలల నిర్వహణకు కొంత తీసుకుంటే లోకేశ్ అనరాని మాటలు అన్నారు. ఇప్పుడు తల్లికి వందనం పథకంలో లోకేశ్ రూ.2 వేలు కోత పెట్టారు. ఎవరైనా ప్రశ్నిస్తే కేసులుపెట్టి నానా రకాలుగా వేధిస్తున్నారు.
ఏడాది కాలంగా ఎంతోమంది చిన్నారులపై అఘాయిత్యాలు జరిగాయి. హోంమంత్రి అనిత కనీసం బాధిత కుటుంబాలను పరామర్శించి ధైర్యం చెప్పింది లేదు. హోంమంత్రి అనిత ఓ రబ్బర్ స్టాంప్ మాదిరి మారారు. రాష్ట్రం రావణకాష్టంలా మారింది. క్రైమ్ రేట్ విపరీతంగా పెరిగిపోయింది. ఇవన్నీ డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్కు కనిపించడం లేదా. పవన్ ఎందుకు మౌనవ్రతం దాల్చారో చెప్పాలి’ అని నిలదీశారు.
బడులకు దగ్గరే మద్యం షాపులు
ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి మాట్లాడుతూ.. ‘ఈ ప్రభుత్వంలో విద్యకు ఒక విధానమంటూ లేకుండాపోయింది. ఏడాది కాలంలోనే టీచర్లను రోడ్డు మీదకు లాగేశారు. బడులకు దగ్గర్లోనే మద్యం షాపులు పెట్టారు’ అని ధ్వజమెత్తారు. తిరుపతి మేయర్ డాక్టర్ శిరీష మాట్లాడుతూ.. ఆరోగ్యానికి వైఎస్ జగన్ పెద్దపీట వేశారని గుర్తు చేశారు. మాజీ ఎమ్మెల్యే కె.భాగ్యలక్ష్మి మాట్లాడుతూ.. అమలుకాని హామీలతో ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు.
విశాఖ జెడ్పీ చైర్పర్సన్ జె.సుభద్ర, మాజీ మేయర్ గొలగాని హరివెంకటకుమారి, మాజీ ఎమ్మెల్సీ శివకుమారి, న్యాయవాదులు లలిత, సౌమ్య, విశ్రాంత ఉపాధ్యాయిని రజనీ, కార్పొరేటర్ శశికళ, సోషల్ మీడియా యాక్టివిస్టులు పెద్దిరెడ్డి సుధారాణి, ఇంటూరి సృజన తదితరులు మాట్లాడారు.