మానవ మృగానికి ఉరే సరైన శిక్ష | Visakhapatnam Court Sentences Person Be Executed Involved In Six Family Murders, More Details About This Case | Sakshi
Sakshi News home page

మానవ మృగానికి ఉరే సరైన శిక్ష

Jun 28 2025 9:24 AM | Updated on Jun 28 2025 1:13 PM

Visakhapatnam Court Sentences Person Be Executed Involved In Six Family Murders

ఆరుగుర్ని హత్య చేసిన నిందితుడికి ఉరి శిక్ష విధిస్తూ తీర్పు 

నాలుగేళ్ల క్రితం జుత్తాడలో  ఘోర సంఘటన

విశాఖపట్నం: పెందుర్తి మండలం వి.జుత్తాడలో నాలుగేళ్ల క్రితం(2021 ఏప్రిల్‌ 15న) జరిగిన దారుణ హత్యల కేసులో నిందితుడు బత్తిన అప్పలరాజుకు జిల్లా కోర్టు శుక్రవారం మరణశిక్ష విధిస్తూ సంచలన తీర్పు చెప్పింది. ఈ తీర్పుతో బాధిత కుటుంబం, స్థానికులు న్యాయం లభించిందని భావిస్తున్నారు. ఈ ఘటనలో ఇద్దరు పసిపిల్లలతో సహా ఆరుగురు నిద్రమత్తులోనే ప్రాణాలు కోల్పోగా, అప్పటి నుంచి న్యాయం కోసం నిరీక్షిస్తున్న కుటుంబానికి ఈ తీర్పు కొంత ఊరటనిచ్చింది. 

అనుమానమే ఆరుగురి ప్రాణాలు తీసింది 
2021 ఏప్రిల్‌ 15 తెల్లవారుజామున జుత్తాడ గ్రామం రక్తసిక్తమైంది. నిందితుడు బత్తిన అప్పలరాజు కుమార్తెకు, అదే గ్రామానికి చెందిన బమ్మిడి విజయ్‌కిరణ్‌కు వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో ఇరు కుటుంబాల మధ్య దీర్ఘకాలంగా వివాదం నడుస్తోంది. ఈ పగతో రగిలిపోయిన అప్పలరాజు.. విజయ్‌కిరణ్‌ కుటుంబంపై ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు. ఆ రోజు ఉదయం వారింట్లోకి ప్రవేశించి నిద్రలో ఉన్న బమ్మిడి రమణ(63), బమ్మిడి ఉషారాణి(35), అల్లు రమాదేవి(53), నక్కెళ్ల అరుణ(40), బమ్మిడి ఉదయ్‌నందన్‌ (2), బమ్మిడి ఉర్విష విజయ్‌కిరణ్‌(6 నెలలు)లను కత్తితో అత్యంత పాశవికంగా హతమార్చాడు. అభంశుభం తెలియని పసికందులను కూడా వదలకుండా చంపడం అందరినీ కలచివేసింది. రక్తపు మడుగులో మృతదేహాల దృశ్యం చూసిన వారందరినీ కన్నీరు పెట్టించింది. 

న్యాయం దిశగా ... 
ఈ దారుణ ఘటన అనంతరం అప్పలరాజు పోలీసులకు లొంగిపోయాడు. ప్రభుత్వం కూడా ఈ ఘటనపై తీవ్రంగా స్పందించి, బాధిత కుటుంబానికి అండగా నిలబడింది. నష్టపరిహారం చెల్లించి, నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని హామీ ఇచ్చింది. పోలీసులు ఈ కేసును అత్యంత పకడ్బందీగా విచారించి కోర్టులో నివేదించారు. నాలుగేళ్ల సుదీర్ఘ న్యాయపోరాటం అనంతరం, ఈ రోజు విశాఖ కోర్టు అప్పలరాజుకు ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. 

విశాఖలో ఆరుగురిని హత్య చేసిన కేసులో సంచలన తీర్పు

బాధిత కుటుంబ సభ్యుల ఆనందం 
ఈ తీర్పుపై బాధిత కుటుంబ సభ్యులు నాటి ఘటనను తల్చుకుని కన్నీరు పెట్టుకుంటూనే తమ ఆనందం వ్యక్తం చేశారు. ‘మానవ మృగానికి ఉరే సరైన శిక్ష. మా కుటుంబానికి న్యాయం జరిగింది’అని తెలిపారు. ఈ తీర్పు భవిష్యత్తులో ఇలాంటి దారుణాలకు పాల్పడే వారికి ఒక హెచ్చరికగా నిలుస్తుందని పేర్కొన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement