
విశాఖ: నగరంలో ప్రేమోన్మాది దాడిలో గాయపడిన బాధితురాలు దీపక స్పృహలోకి వచ్చింది. అయితే ప్రేమోన్మాది దాడిలో తల్లి చనిపోయిందనే విషయం ఆమెకు తెలియదు. దాంతో స్పృహలోకి వచ్చిన వెంటనే తల్లి ఎక్కడ అని సైగల ద్వారా అడిగింది. గొంతుపై ఆమెకు లోతైన గాయం కారణంగా ఆరు కుట్లు పడ్డాయి. దాంతో మాట్లాడలేని స్థితిలో ఉన్న ఆమె.. తల్లి గురించి సైగల ద్వారా ఆరా తీసింది. అయితే తల్లి మరణించదన్న వార్తను కూతురికి తండ్రి చెప్పలేకపోయాడు.
ఇదిలా ఉండగా, తల్లి లక్ష్మి మృతదేహానికఇ పోస్ట్ మార్టం పూర్తయ్యింది. పోస్ట్ మార్టం పూర్తియిన తర్వాత మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు పోలీసులు. మృతదేహాన్ని శ్రీకాకుళం జిల్లాలోని స్వగ్రామానికి తరలించినట్లు తెలుస్తోంది.
కాగా, పెళ్లికి నిరాకరించారన్న కారణంతో తల్లీ కూతుళ్లపై ప్రేమోన్మాది విచక్షణారహితంగా దాడి చేసిన సంగతి తెలిసిందే.. బుధవారం జరిగిన ఈ ఘటనలో తల్లి మృతి చెందగా, కుమార్తె తీవ్రంగా గాయపడింది. పార్వతీపురం మన్యం జిల్లా దేవుదళ సమీపంలోని పెద్దపుర్లికి చెందిన నక్కా రాజు బతుకు తెరువు కోసం రెండేళ్ల క్రితం మధురవాడకు వచ్చి, కార్ డ్రైవర్గా పని చేస్తున్నాడు. భార్య గృహిణి. ఇద్దరు పిల్లలు. కుమార్తె దీపిక (20) ఆరేళ్ల క్రితం వీరఘట్టం మండలం పనసనందివాడలోని తన పిన్ని ఇంటికి ఓ కార్యక్రమానికి వెళ్లింది.
ఎదురింట్లో ఉంటున్న దమరసింగి నవీన్ పరిచయమయ్యాడు. నవీన్ డిగ్రీ పూర్తి చేసి, ఖాళీగా ఉంటున్నాడు. దీపిక విశాఖలోని మహిళా డిగ్రీ కళాశాలలో మైక్రోబయాలజీ పూర్తి చేసి, నర్సింగ్ చేస్తోంది. ఈ క్రమంలో దీపికను పెళ్లి చేసుకుంటానంటూ ఆమె తల్లిదండ్రులపై నవీన్ తీవ్రంగా ఒత్తిడి తెస్తున్నాడు. ఇతడి ప్రవర్తన సరిగా లేకపోవడంతో పెళ్లి ఆలస్యం చేస్తూ వచ్చారు. దీంతో పెళ్లికి అంగీకరించకపోతే చంపేస్తానని కూడా పలుమార్లు బెదిరించాడు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే అతడి జీవితం నాశనం అయిపోతుందని దీపిక తండ్రి రాజు ఆలోచించాడు. అదే ఆ కుటుంబానికి తీరని శోకం మిగిల్చింది.