
శ్రీనగర్/విశాఖపట్నం: జమ్ముకశ్మీర్లోని పహల్గాం సమీప బైసరన్లో జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి వివరాలు బయటకు వస్తున్నాయి. ఈ ఘటనలో విశాఖ వాసి చంద్రమౌళిని ముష్కరులు దారుణంగా హత్య చేసినట్టు తెలిసింది. ఉగ్రవాదులు.. చంద్రమౌళిని వెంటాడి మరీ కాల్చినట్లు సమాచారం.
వివరాల ప్రకారం.. పహల్గాంలో మంగళవారం ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారిలో విశాఖ వాసి ఉన్నారు. విశాఖ వాసి చంద్రమౌళిని ఉగ్రవాదులు కాల్చి చంపారు. అతడిని వెంటాడి మరీ కాల్చినట్లు సమాచారం. చంపొద్దని వేడుకున్నా.. మోదీకి చెప్పుకోవాలంటూ విచక్షణా రహితంగా కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. చంద్రమౌళి మృతదేహాన్ని సహచర టూరిస్టులు గుర్తించారు. ఇక, చంద్రమౌళి.. రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి అని తెలిసింది.
చంద్రమౌళి బంధువు DSP నాగేశ్వర్ రావు తాజాగా సాక్షితో మాట్లాడుతూ.. ఈ నెల 18న చంద్రమౌళి కశ్మీర్కు బయలుదేరి వెళ్లారు. ఆరుగురు కలిసి విహారయాత్రకి వెళ్లారు. ఇలాంటి దుర్ఘటన చాలా బాధాకరం. ఉగ్రవాద చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ మధ్య గ్రాండ్గా చంద్రమౌళి పుట్టినరోజు వేడుకలు జరిపాం. ఇప్పటికీ మా వదినకి ఆయన చనిపోయిన విషయం తెలియదు.
ఉగ్రవాద దాడిలో మృతి చెందిన చంద్రమౌళి సమీప బంధువు కుమార్ రాజా తాజాగా మాట్లాడుతూ..‘ఈనెల 16న ట్రావెల్ ఏజెంట్స్ ద్వారా కశ్మీర్ టూర్కి వెళ్లారు. మొత్తం ఆరుగురు వెళ్లారు. ఈనెల 25 నాటికి తిరిగి రావాల్సి ఉంది. చంద్రమౌళి ఫ్యామిలీతో పాటు అప్పన్న, శశిధర్ ఫామిలీలు వెళ్లాయి. చంద్రమౌళి తప్పించుకునే ప్రయత్నం చేశారు.. కానీ, ముష్కరులు హతమార్చారు. మిగిలిన ఐదుగురు క్షేమంగా ఉన్నట్లు చెప్పారు. మృతదేహం ఇవాళ రాత్రి విశాఖకు తరలిస్తారు. ఆయన ఇద్దరు కుమార్తెలు అమెరికా ఉన్నారు. వారిద్దరూ రేపు.. విశాఖకు చేరుకుంటారు. ఎల్లుండి అంత్యక్రియలు జరుగుతాయి.

నెల్లూరు వాసి మృతి..
కశ్మీర్లోని పహాల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో కావలికి చెందిన సోమిశెట్టి మధుసూదన్ రావు మృతిచెందాడు. నిన్న జరిగిన ఉగ్రదాడిలో మధుసూదన్ని కాల్చి చంపిన ఉగ్రవాదులు. బెంగళూరులో సాఫ్ట్వేర్గా పనిచేస్తున్న మధుసూదన్. బెంగళూరులో స్థిరపడ్డ మధుసూదన్ కుటుంబ సభ్యులతో విహారయాత్రకు వెళ్ళగా ఈ విషాదకర ఘటన నెలకొంది. కావలి కుమ్మరి వీధిలో సోమిశెట్టి తిరుపాలు పద్మ దంపతుల కుమారుడుగా గుర్తింపు. మృతుడు మధుసూదనన్కు భార్య ఇద్దరు పిల్లలు. నేడు ప్రత్యేక విమానంలో మృతదేహాన్ని చెన్నైకి తరలింపు.. సాయంత్రానికి కావలికి చేరుకోనున్న మధుసూదన్ మృతదేహాం. అతడి తల్లిదండ్రులు హార్ట్ పేషంట్స్ కావడంతో విషయం గోప్యంగా ఉంచిన బంధువులు.