
వనామీ ధరలు పతనం
100 కౌంట్ ధర రూ.240 నుంచి రూ.200 తగ్గింపు
2 టన్నులలోపు అయితే రూ.180
ఆందోళనలో ఆక్వా రైతులు
సిండికేట్గా మారి ధరలు తగ్గించేస్తున్నారని ఆవేదన
అప్సడాతో సిండికేట్ ఆగడాలకు చెక్ పెట్టిన జగన్ ప్రభుత్వం
సాక్షి, భీమవరం: వారం వ్యవధిలో వనామీ రొయ్యల ధరలు అమాంతం పడిపోయాయి. నిన్నమొన్నటి వరకు కిలో రూ.240 ఉన్న 100 కౌంట్ ధర రూ.200 నుంచి రూ.180కి తగ్గించేయడం ఆక్వా రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. ప్రాసెసింగ్ ప్లాంట్ల యజమానులు, ఎగుమతిదారులు సిండికేట్గా మారి ధరలు తగ్గించేస్తున్నారని రైతులు వాపోతున్నారు. కూటమి ప్రభుత్వం సిండికేటుకు కొమ్ముకాస్తోందని విమర్శిస్తున్నారు.
అమెరికా పన్నుల పేరిట దోపిడీ
వేసవి ఉష్ణోగ్రతలు అనుకూలించి మార్కెట్లోకి రొయ్యలు రావడం పెరగడంతో ఎగుమతిదారులు, ప్రాసెసింగ్ ప్లాంట్ల యజమానులు, వ్యాపారులు ఏకమై ధరలు తగ్గిస్తూ వచ్చారు. ఏప్రిల్ 3న అమెరికా ప్రతీకార సుంకాల ప్రకటన వెలువడే నాటికి 30 కౌంట్ ధర రూ.460, 40 కౌంట్ ధర రూ.370, 100 కౌంట్ ధర రూ.230కి తగ్గించేశారు. అమెరికా పన్నులను సాకుగా చూపించి కౌంట్కు కేజీకి రూ.30 నుంచి రూ.70 వరకు కోత పెట్టారు. ఇప్పట్లో పన్నులు లేవని తర్వాత అమెరికా ప్రకటించినా సిండికేట్ వర్గాలు ధరలను పెంచకపోవడం గమనార్హం.
కంటితుడుపు చర్యలతో సరి
ఫీడ్ ప్లాంట్ల యజమానులు మేత ధరలు పెంచేయడం.. ప్రాసెసింగ్ ప్లాంట్ల యజమానులు, ఎగుమతిదారులు ఏకమై తమ కష్టాన్ని దోచుకుంటుంటే కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఏప్రిల్లో రైతులు రోడ్డెక్కి నిరసనలు తెలిపారు. పాలకొల్లు, నరసాపురం, ఆచంట నియోజకవర్గాల్లోని జై భారత్ క్షీరారామ ఆక్వా రైతు సంఘం ఆధ్వర్యంలో పంట విరామం సైతం ప్రకటించారు. ఈ పరిణామాలతో ఉలిక్కిపడిన ప్రభుత్వం ఉండిలో ఆక్వా సదస్సు, విజయవాడలో ప్రాన్స్ కో–ఆర్డినేషన్ కమిటీ సమావేశాల్లో మేత ధరలను కేవలం టన్నుకు రూ.4 వేలు మాత్రమే తగ్గించడం, 100 కౌంట్ ధరను స్వల్పంగా పెంచడం తదితర కంటితుడుపు చర్యలతో సరిపెట్టింది.
మళ్లీ ధరలు పతనం
వారం క్రితం 100 కౌంట్ ధర దాదాపుగా రూ.240 ఉండగా, 30 కౌంట్ ధర రూ.385, 40 కౌంట్ ధర రూ.325, 50 కౌంట్ ధర రూ.295, 60 కౌంట్ ధర రూ.265 వరకు ఉన్నాయి. రానున్న సీజన్కు గాను మరలా చెరువులను సిద్ధం చేసుకునేందుకు రైతులు పట్టుబడులు ముమ్మరం చేయడంతో మార్కెట్లోకి రొయ్యలు రావడం ముమ్మరమైంది. ఇదే అదునుగా తిరిగి సిండికేట్లు ధరలను తగ్గించేస్తున్నాయి.
పెద్ద రైతులైతే ఎక్కువ టన్నుల్లో పట్టుబడులు జరిగి 100 కౌంట్కు రూ.210 వరకు ధర చెల్లిస్తుంటే.. చిన్న రైతులు మూడు టన్నుల లోపు పట్టుబడులు చేయడం వల్ల పట్టుబడి పరిమాణం బట్టి 100 కౌంట్ రొయ్యలను రూ.200 నుంచి రూ.180కు కొనుగోలు చేస్తున్నట్టు రైతులు చెబుతున్నారు. మిగిలిన కౌంట్ల ధరలు సైతం తగ్గించేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతికూల వాతావరణం, నాణ్యత లేని సీడ్, ఫీడ్తో ఇబ్బందులు పడుతుంటే ధరల పతనం తమను మరింత నష్టాల్లోకి నెట్టేస్తోందని వాపోతున్నారు.
నాడు అప్సడాతో అండ
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2020లో ఏపీ స్టేట్ ఆక్వా డెవలప్మెంట్ అథారిటీ (అప్సడా)ని ఏర్పాటు చేసి హేచరీలు, ఫీడ్, ప్రాసెసింగ్ ప్లాంట్ల ఆగడాలకు చెక్ పెట్టింది. ప్రతి 10 రోజులకు ఒకసారి సమావేశమై ధరల స్థిరీకరణకు చర్యలు తీసుకుంది. రైతులకు లాభసాటి ధర అందేలా పనిచేసింది.
ఆక్వా రంగం కుదేలు
ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మంది కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్న ఆక్వా రంగం సిండికేటు దోపిడీతో సంక్షోభంలో కూరుకుపోతోంది. సీడ్, ఫీడ్, లీజు, మెడిసిన్ ధరలు 100 శాతం పెరగ్గా.. రొయ్యల ధర మాత్రం పతనమవుతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే సాగు చేయడం చాలా కష్టం. ఇప్పటికే ఎకరాకు రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు నష్టపోతున్నాం. – పొత్తూరి శ్రీనివాసరాజు, ఆక్వా రైతు, కలగంపూడి
గత ప్రభుత్వంలో ఇలా లేదు
ఎగుమతిదారులు, ప్రాసెసింగ్ ప్లాంట్ల యజమానులు సిండికేట్ అయి ఇష్టానుసారం ధరలు తగ్గించేస్తున్నారు. టన్నులను బట్టి 100 కౌంట్ రూ.210 నుంచి రూ.180కి కొంటున్నారు. గత ప్రభుత్వంలో ఈ పరిస్థితి ఉండేది కాదు. ధరలు స్థిరంగా ఉండేవి. ఇప్పుడు రోజుకు ఎలా మారతాయో తెలియడం లేదు. ఆక్వా రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. – పెనుమాల నరసింహస్వామి, ఆక్వా రైతు, గొల్లవానితిప్ప