
99 ఏళ్ల లీజుకు విలువైన భూములు అప్పగింత
నిర్మాణ సమయంలో ఎలాంటి అద్దె కట్టక్కర్లేదు
పదేళ్లకొకసారి 10 శాతం చొప్పున పెంపు
ఇవికాక.. ఇతర పారిశ్రామిక రాయితీలు కూడా..
వీఎంఆర్డీఏ నుంచి భూమిని తిరిగి ఏపీఐఐసీకి అప్పగించేలా చర్యలు
రాష్ట్ర పరిశ్రమల శాఖ కార్యదర్శి ఉత్తర్వులు
సాక్షి, అమరావతి: విశాఖ నడిబొడ్డున ఉన్న 13.43 ఎకరాల విలువైన హార్బర్ పార్కు భూములను లూలూ గ్రూపునకు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. గతంలో ఈ సంస్థ రద్దుచేసుకున్న ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ను తిరిగి ప్రారంభించడానికి సీఎం అధ్యక్షతన ఇటీవల జరిగిన స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు (ఎస్ఐపీబీ) ఆమోదం తెలిపింది.
అలాగే, భూ కేటాయింపు చేయాల్సిందిగా అధికారులను అదేశించింది. ప్రస్తుతం ఈ భూములు విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (వీఎంఆర్డీఏ) పరిధిలో ఉండడంతో వీటిని తిరిగి ఏపీఐఐసీకి బదలాయించాలని.. ఇందుకోసం రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలని పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్. యువరాజ్ బుధవారం ఆదేశాలు జారీచేశారు.
సీఎంకు ‘లూలూ’ చైర్మన్ లేఖ..
విశాఖలో హైపర్ మార్కెట్తో పాటు చిల్ర్డన్ ఎమ్యూజ్మెంట్ పార్కు, ఫైన్ డైనింగ్ ఫుడ్ కోర్టులు, ఎనిమిది స్క్రీన్ల మల్టీప్లెక్స్, భారీస్థాయిలో కారు పార్కింగ్ను అభివృద్ధి చేస్తామంటూ ఈ ఏడాది జనవరి 17న లూలూ గ్రూపు చైర్మన్ సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. గతంలో మాదిరిగానే 99 ఏళ్ల లీజుకు భూములను ఇవ్వడంతో పాటు మల్టీప్లెక్స్ ప్రారంభం అయ్యేవరకు లేదా మూడేళ్ల వరకు ఈ రెండింటిలో ఏది ముందయితే అంతవరకు అద్దె మినహాయింపు ఇవ్వాల్సిందిగా కోరారు.
అదే విధంగా.. పదేళ్లకొకసారి 10 శాతం చొప్పున అద్దె పెంచుతామని, ఇవికాక ఇతర పారిశ్రామిక రాయితీలు కూడా వర్తింపజేయాలని కోరారు. ఈ ప్రతిపాదనలను ఎస్ఐపీబీ పరిశీలించి ఆమోదించింది. అలాగే, భూములను వీఎంఆర్డీఏ నుంచి ఏపీఐఐసీకి బదిలీ చేయాల్సిందిగా తీసుకున్న నిర్ణయం మేరకు ఈ ఉత్తర్వులు జారీచేసినట్లు యువరాజ్ పేర్కొన్నారు.