అన్నదమ్ములను బలిగొన్న ఇసుకాసురులు | Two die after falling into quarry pit while swimming | Sakshi
Sakshi News home page

అన్నదమ్ములను బలిగొన్న ఇసుకాసురులు

Jun 22 2026 5:52 AM | Updated on Jun 22 2026 5:52 AM

Two die after falling into quarry pit while swimming

జయంత్‌ రెడ్డి, రాజ్‌వర్ధన్‌ రెడ్డి (ఫైల్‌ ఫొటోలు)

ఈతకు వెళ్లి క్వారీ గుంతలో పడి ఇద్దరు మృత్యువాత  

వైఎస్సార్‌ కడప జిల్లాలో విషాదం 

క్వారీ నిర్వాహకులు వచ్చేవరకూ మృతదేహాలను తరలించేదిలేదని గ్రామస్తుల బైఠాయింపు 

పోలీసులు నచ్చజెప్పినా ససేమిరా 

టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బీటెక్‌ రవి నేతృత్వంలో ఇసుక అక్రమ సామ్రాజ్యం దందా 

చక్రాయపేట: ఇసుకాసురుల బరితెగింపు, ఇష్టారాజ్యంగా చేస్తున్న అక్రమాలకు ముక్కుపచ్చలా­రని ఇద్దరు అన్నదమ్ము­లు బలయ్యారు. వైఎస్సార్‌ కడప జిల్లా చక్రాయపేట మండలం అద్దాలమర్రి సమీపంలోని పాపాఘ్ని నదిలో వీరు ఈతకు వెళ్లి అక్రమంగా తవ్విన ఇసుక క్వారీ గుంతలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. మృతులు పెండ్లిమర్రి మండలం కారపురెడ్డిపల్లెకు చెందిన కారపురెడ్డి జయంత్‌రెడ్డి (17) కారపురెడ్డి రాజ్‌వర్థన్‌రెడ్డి (15)లుగా పోలీసులు గుర్తించారు. బంధువుల కథనం ప్రకారం వివరాలివీ.. కారపురెడ్డిపల్లెకు చెందిన లోకేశ్వరరెడ్డి, ఓబుళమ్మల కుమారులైన జయంత్‌రెడ్డి, రాజ్‌వర్థన్‌రెడ్డిలు వారం క్రితం అమ్మమ్మ ఊరైన అద్దాలమర్రి గ్రామానికి వచ్చారు. ఆదివారం మ.3 గంటల
సమయంలో అన్నదమ్ములిద్దరూ ఈతకోసం పాపాఘ్ని నదిలోకి దిగారు. 

అయితే, నదిలో ఇసుకాసురుల అడ్డగోలు తవ్వకాలతో ఏర్పడిన గుంతల్లోకి ఇద్దరూ ఒక్కసారిగా మునిగిపోయారు. అయితే, నది వైపు వెళ్లిన పిల్లలు ఎంతసేపటికీ రాకపోవడంతో బంధువులు వెళ్లి చూడగా గట్టున దుస్తులు కనిపించాయి. వెంటనే గ్రామస్తులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆర్కే వ్యాలీ సీఐ శంకర్‌రెడ్డి, ఎస్‌ఐ చంద్రశేఖర్‌ సిబ్బందింతో సంఘటన స్థలానికి చేరుకున్నారు. రెస్క్యూ టీంతో పాటు గ్రామస్తులు నదిలోకి దిగి రెండు గంటలపాటు గాలించగా ఇద్దరి మృతదేహాలు లభించాయి. విగతజీవులుగా మారిన పిల్లలను చూడగానే కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. జయంత్‌రెడ్డి బీటెక్‌ ఫస్టియర్‌లో చేరాల్సి ఉండగా.. రాజ్‌వర్థన్‌రెడ్డి చెన్నూరులో ఇంటర్‌ ఫస్టియర్‌లో చేర్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.  

మృతదేహాలను తరలించం.. 
అక్రమంగా ఇసుక తవ్వి ఇద్దరి ప్రాణాలు పోవడానికి కారణమైన ఇసుక క్వారీ వారు వచ్చేవరకు మృతదేహాలను ఇక్కడి నుంచి తరలించే ప్రసక్తేలేదని గ్రామస్తులు నది వద్ద బైఠాయించారు. పోలీసులు ఎంత నచ్చచెప్పినా వారు శాంతించలేదు. 
 
బీటెక్‌ రవి సహకారంతోనే దందా.. 
పర్యావరణ పరిరక్షణ, వర్షాకాలం దృష్ట్యా ఆగస్టు 15 వరకు నదుల నుంచి ఇసుకను ఎట్టి పరిస్థితుల్లోనూ తరలించరాదని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ శ్రీధర్‌  ఆదేశాలిచ్చారు. అలాగే, ఇసుక అక్రమ రవాణాపై కొవ్వూరు శ్రీధర్‌రెడ్డి దాఖలు చేసిన 78/2026 రిట్‌ పిటిషన్‌ను స్వీకరించిన నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ జస్టిస్‌ ఎస్‌. కుమార్‌సింగ్, గౌరవ మెంబర్‌ ప్రశాంత్‌గార్గ్‌ల బెంచ్‌.. నాలుగు వారాల్లో చర్యలు చేపట్టాలని కలెక్టర్, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డును ఆదేశించింది. కానీ, ఈ ఉత్తర్వులన్నీ ఇక్కడ బుట్టదాఖలయ్యాయి. టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్, మాజీ ఎమ్మెల్సీ బీటెక్‌ రవి ముఖ్య సహకారంతో.. స్థానిక టీడీపీ మండల శాఖ అధ్యక్షుడు మహేశ్వరరెడ్డి నేతృత్వంలోనే ఈ ఇసుక అక్రమ సామ్రాజ్యం నడుస్తోందని స్పష్టమవుతోంది. ఇదే విషయమై కడప వైఎస్సార్‌సీపీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి స్వయంగా ప్రెస్‌మీట్‌ పెట్టి ఆధారాలతో సహా ఆరోపించినా అధికారుల్లో కనీస చలనం లోపించింది. అధికారుల నిర్లక్ష్యంవల్లే అన్నదమ్ములు ఇద్దరూ మృత్యువాతపడ్డారని.. ఇసుకాసురులైన టీడీపీ నేతలపై హత్య కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని జిల్లా ప్రజలు, ప్రజాసంఘాల నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement