breaking news
Illegal sand danda
-
అన్నదమ్ములను బలిగొన్న ఇసుకాసురులు
చక్రాయపేట: ఇసుకాసురుల బరితెగింపు, ఇష్టారాజ్యంగా చేస్తున్న అక్రమాలకు ముక్కుపచ్చలారని ఇద్దరు అన్నదమ్ములు బలయ్యారు. వైఎస్సార్ కడప జిల్లా చక్రాయపేట మండలం అద్దాలమర్రి సమీపంలోని పాపాఘ్ని నదిలో వీరు ఈతకు వెళ్లి అక్రమంగా తవ్విన ఇసుక క్వారీ గుంతలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. మృతులు పెండ్లిమర్రి మండలం కారపురెడ్డిపల్లెకు చెందిన కారపురెడ్డి జయంత్రెడ్డి (17) కారపురెడ్డి రాజ్వర్థన్రెడ్డి (15)లుగా పోలీసులు గుర్తించారు. బంధువుల కథనం ప్రకారం వివరాలివీ.. కారపురెడ్డిపల్లెకు చెందిన లోకేశ్వరరెడ్డి, ఓబుళమ్మల కుమారులైన జయంత్రెడ్డి, రాజ్వర్థన్రెడ్డిలు వారం క్రితం అమ్మమ్మ ఊరైన అద్దాలమర్రి గ్రామానికి వచ్చారు. ఆదివారం మ.3 గంటలసమయంలో అన్నదమ్ములిద్దరూ ఈతకోసం పాపాఘ్ని నదిలోకి దిగారు. అయితే, నదిలో ఇసుకాసురుల అడ్డగోలు తవ్వకాలతో ఏర్పడిన గుంతల్లోకి ఇద్దరూ ఒక్కసారిగా మునిగిపోయారు. అయితే, నది వైపు వెళ్లిన పిల్లలు ఎంతసేపటికీ రాకపోవడంతో బంధువులు వెళ్లి చూడగా గట్టున దుస్తులు కనిపించాయి. వెంటనే గ్రామస్తులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆర్కే వ్యాలీ సీఐ శంకర్రెడ్డి, ఎస్ఐ చంద్రశేఖర్ సిబ్బందింతో సంఘటన స్థలానికి చేరుకున్నారు. రెస్క్యూ టీంతో పాటు గ్రామస్తులు నదిలోకి దిగి రెండు గంటలపాటు గాలించగా ఇద్దరి మృతదేహాలు లభించాయి. విగతజీవులుగా మారిన పిల్లలను చూడగానే కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. జయంత్రెడ్డి బీటెక్ ఫస్టియర్లో చేరాల్సి ఉండగా.. రాజ్వర్థన్రెడ్డి చెన్నూరులో ఇంటర్ ఫస్టియర్లో చేర్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతదేహాలను తరలించం.. అక్రమంగా ఇసుక తవ్వి ఇద్దరి ప్రాణాలు పోవడానికి కారణమైన ఇసుక క్వారీ వారు వచ్చేవరకు మృతదేహాలను ఇక్కడి నుంచి తరలించే ప్రసక్తేలేదని గ్రామస్తులు నది వద్ద బైఠాయించారు. పోలీసులు ఎంత నచ్చచెప్పినా వారు శాంతించలేదు. బీటెక్ రవి సహకారంతోనే దందా.. పర్యావరణ పరిరక్షణ, వర్షాకాలం దృష్ట్యా ఆగస్టు 15 వరకు నదుల నుంచి ఇసుకను ఎట్టి పరిస్థితుల్లోనూ తరలించరాదని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ ఆదేశాలిచ్చారు. అలాగే, ఇసుక అక్రమ రవాణాపై కొవ్వూరు శ్రీధర్రెడ్డి దాఖలు చేసిన 78/2026 రిట్ పిటిషన్ను స్వీకరించిన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ జస్టిస్ ఎస్. కుమార్సింగ్, గౌరవ మెంబర్ ప్రశాంత్గార్గ్ల బెంచ్.. నాలుగు వారాల్లో చర్యలు చేపట్టాలని కలెక్టర్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డును ఆదేశించింది. కానీ, ఈ ఉత్తర్వులన్నీ ఇక్కడ బుట్టదాఖలయ్యాయి. టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి ముఖ్య సహకారంతో.. స్థానిక టీడీపీ మండల శాఖ అధ్యక్షుడు మహేశ్వరరెడ్డి నేతృత్వంలోనే ఈ ఇసుక అక్రమ సామ్రాజ్యం నడుస్తోందని స్పష్టమవుతోంది. ఇదే విషయమై కడప వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి స్వయంగా ప్రెస్మీట్ పెట్టి ఆధారాలతో సహా ఆరోపించినా అధికారుల్లో కనీస చలనం లోపించింది. అధికారుల నిర్లక్ష్యంవల్లే అన్నదమ్ములు ఇద్దరూ మృత్యువాతపడ్డారని.. ఇసుకాసురులైన టీడీపీ నేతలపై హత్య కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని జిల్లా ప్రజలు, ప్రజాసంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. -
‘హద్దు’లు దాటి ఇసుక దందా!
సాక్షి ప్రతినిధులు మహబూబ్నగర్/ఖమ్మం/సత్తుపల్లి: ధనార్జనే ధ్యేయంగా ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. అర్ధరాత్రి వేళ ఆంధ్రప్రదేశ్ నుంచి భారీ వాహనాల్లో ఇసుకను రవాణా చేస్తున్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు తరలిస్తూ భారీ ఎత్తున సొమ్ము చేసుకుంటున్నారు. ఏపీ సరిహద్దులు దాటి మహబూబ్నగర్, ఖమ్మం జిల్లాల మీదుగా లారీలు తెలంగాణలో ప్రవేశిస్తున్నాయి. ఏపీలోని తాడిపత్రిలో ఉన్న ఓ అధికారిక రీచ్ నుంచి కర్నూలు మీదుగా వాహనాలు వస్తున్నాయి. జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం ఉండవెల్లి మండలంలోని పుల్లూరు టోల్ ప్లాజా గుండా ఉమ్మడి మహబూబ్నగర్లోని గద్వాల, రంగారెడ్డి జిల్లాలోని షాద్నగర్, ఆదిభట్ల తదితర ప్రాంతాలతోపాటు హైదరాబాద్లోని పలు చోట్లకు ఇసుకను తరలిస్తున్నారు. నిత్యం 70 నుంచి 90 వరకు బెంజ్ వాహనాల్లో ఈ అక్రమ రవాణా కొనసాగుతోంది. కర్నూలు జిల్లాలో ఏపీ కూటమి ప్రభుత్వంలోని కీలక పార్టీకి చెందిన వ్యక్తి ఈ దందా కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఏపీలోని అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే అండతో బినామీలు రెచ్చిపోతున్నారు. గోదావరి ఇసుకను దర్జాగా ఏపీ సరిహద్దు దాటిస్తున్నారు. ఏలూరు జిల్లాకు చెందిన ఆ ఎమ్మెల్యే బినామీలకు చెందిన ఇసుక టిప్పర్లు ఆదివారం రాత్రి ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో పట్టుబడడం గమనార్హం. కాగా ఏపీకి చెందిన నేతలు ఈ విధంగా ఇష్టారాజ్యంగా ఇసుక దందా చేస్తున్నా..పట్టించుకునే నాథుడే లేడనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాడిపత్రి నుంచి యధేచ్చగా.. అనంతపురం జిల్లా తాడిపత్రి రీచ్ వద్ద ఒక లారీ లేదా బెంజ్ లోడ్కు రూ.10 వేల నుంచి రూ.12 వేలు తీసుకుంటున్నట్లు తెలిసింది. ధర తక్కువగా ఉండడంతో కన్నేసిన ఇసుక మాఫియా అక్కడి నుంచి హైదరాబాద్ తదితర ప్రాంతాలకు తరలించి టన్ను రూ.1,800 నుంచి రూ.2,400 వరకు విక్రయిస్తూ సొమ్ము చోసుకుంటున్నట్లు సమాచారం. అర్ధరాత్రి 12.30 నుంచి తెల్లవారుజాము 3 గంటల మధ్య ఇసుక లోడ్ వాహనాలు సరిహద్దులోని పుల్లూరు టోల్ప్లాజా దాటేలా అక్రమార్కులు పకడ్బందీగా వ్యవహరిస్తున్నారు. ఈ సమయంలో గస్తీ నామమాత్రంగా ఉండడంతో ఇసుక వాహనాలు సులువుగా సరిహద్దులు దాటుతున్నాయి. ఎక్కువగా 16 టైర్ల లారీల్లోనే ఇసుకను తరలిస్తున్నారు. రవాణా శాఖ నిబంధనల ప్రకారం 16 టైర్ల వాహనంలో 47 టన్నులు, 14 టైర్ల వాహనంలో 42 టన్నులు, 12 టైర్ల వాహనంలో 36 టన్నులు, 10 టైర్ల వాహనంలో 28 టన్నుల ఇసుకను మాత్రమే తరలించాలి. కానీ ఆయా వాహనాలను రీడిజైన్ చేసి.. సామర్థ్యానికి మించి 35 నుంచి 45 శాతం మేర అధికంగా ఇసుకను తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీ కూటమి పార్టీ వ్యక్తి, స్థానిక నేత కుమ్మక్కు ఇసుక దందా వెనుక ఇద్దరు వ్యక్తులు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఏపీ కూటమి ప్రభుత్వంలో కీలకంగా ఉన్న పార్టీకి చెందిన ఒక వ్యక్తి.. తెలంగాణ అలంపూర్ నియోజకవర్గంలో అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడి కనుసన్నల్లో ఈ దందా కొనసాగుతున్నట్లు ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఆ ఇద్దరి మధ్య ఎప్పటినుంచో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, సమీప బంధువులని కూడా సమాచారం. నెల రోజులుగా ఏపీ నుంచి తెలంగాణకు ఇసుకను తరలిస్తున్న పది వాహనాలను స్థానిక పోలీసులు పట్టుకుని కేసులు నమోదు చేశారు. అయినా ఇసుక రవాణా కొనసాగుతుండగా.. ఇటు పోలీసులు, అటు రవాణా శాఖ చూసీచూడనట్లు వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే రాత్రివేళ దొంగ చాటుగా ఇసుక లారీలు తెలంగాణకు వస్తున్న నేపథ్యంలో టోల్ప్లాజా వద్ద గస్తీ పెంచామని జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి ఎస్ఐ శేఖర్ తెలిపారు. ఏజెంట్ల ద్వారా వ్యవహారం ఆంధ్రప్రదేశ్లోని కొవ్వూరులో లోడ్ చేస్తున్న గోదావరి ఇసుకను ఆర్డర్ల ఆధారంగా టిప్పర్లు, లారీల్లో సత్తుపల్లి, ఖమ్మం, హైదరాబాద్కు తరలించి అధిక ధరకు విక్రయిస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండానే వాహనాలు ఆంధ్రప్రదేశ్ సరిహద్దు దాటి తెలంగాణలోకి ప్రవేశిస్తున్నాయి. ఇందులో ఏలూరు జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యే ప్రధాన భూమిక పోషిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. టన్ను రూ.250 చొప్పున టిప్పర్లలో 40 – 50 టన్నుల వరకు లోడ్ చేసి, సత్తుపల్లిలో టన్ను రూ.1,200 చొప్పున, ఖమ్మంలో రూ.1,600 – రూ.1700, అదే హైదరాబాద్కు తీసుకెళ్తే రూ.2,500కు అమ్ముతున్నారు. ఏపీలోని ఏలూరు జిల్లాకు ఆనుకుని తెలంగాణలోని అశ్వారావుపేట, సత్తుపల్లి నియోజకవర్గాలు ఉన్నాయి. సత్తుపల్లిలో కొందరు ఏజెంట్లను నియమించుకుని వారి కనుసన్నల్లో ఆయన బినామీలు వ్యవహారం నడిపిస్తున్నారు. టిప్పర్లు రాగానే వేగంగా అన్లోడ్ చేసేలా ఈ ఏజెంట్లు చర్యలు తీసుకుంటున్నారు. ఏలూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యే నియోజకవర్గంలో పూర్వపు ఖమ్మం జిల్లాలోని కొన్ని మండలాలు కలిసి ఉండడంతో అడ్డూ అదుపూ లేకుండా ఇసుక దందా నిర్వహిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆ ఎమ్మెల్యే బినామీలే ఇటీవల ఏపీలో రూ.100 కోట్ల ఆరోపణలు ఎదుర్కొన్న ఎమ్మెల్యేకు చెందిన బినామీలే ఇసుక దందా చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇసుక టిప్పర్లు కూడా ఆ ఎమ్మెల్యేకు చెందిన నియోజకవర్గాల్లోని వ్యక్తులవే కావడం ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. అయితే రెండురోజుల క్రితం ఆ ఎమ్మెల్యే హడావుడిగా ప్రెస్మీట్ ఏర్పాటు చేసి తన పేరు చెప్పుకుని కొందరు ఇసుక, మట్టి దందా చేస్తున్నారని.. వారికి, తనకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించడం విశేషం. కాగా ఇసుక అక్రమ రవాణ జరుగుతున్నట్లుగా అందిన విశ్వసనీయ సమాచారంతో నిఘా వేసిన ఖమ్మం జిల్లా సత్తుపల్లి పోలీసులు..ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గంలోని గంగవరం రాజవరం గ్రామానికి చెందిన కలిదిండి రాజేష్ పేరుతో ఉన్న ఏపీ 39 డబ్ల్యూహెచ్ 7666, ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం జీలుగుమిల్లి మండలం బర్రింకలపాడు గ్రామానికి చెందిన కరకం శ్రీనివాస్ పేరిట ఉన్న ఏపీ 36డబ్ల్యూజీ 9666 టిప్పర్లలో ఇసుక తరలిస్తుండగా ఆదివారం రాత్రి పట్టుకోవడం గమనార్హం. -
కూటమి నేతల అండదండలతో రెచ్చిపోతున్న ఇసుక మాఫియా
-
బుసకనూ బొక్కేస్తున్నారు
సాక్షి, అవనిగడ్డ(కృష్ణా) : మండల పరిధిలోని పలు ప్రాంతాల్లో ఇష్టారాజ్యంగా బుసక, మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. నాలుగు రోజుల నుంచి అక్రమంగా రవాణా సాగుతున్నా అధికారులు స్పందించక పోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ట్రాక్టర్లను స్పీడుగా తోలడం వల్ల ఎప్పుడు ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయోనని ఈ ప్రాంత ప్రజలు భయాందోనలకు గురవుతున్నారు. భారీగా తవ్వకాలు మండల పరిధిలోని వేకనూరులో సొసైటీ భూములు, కృష్ణానది ఒడ్డు నుంచి బుసక అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. నాలుగు రోజుల నుంచి ఇష్టారాజ్యంగా ఈ ప్రాంతంలో పొక్లెయిన్లు పెట్టి బుసకను తవ్వి అక్రమంగా తరలిస్తున్నారు. నాలుగు రోజుల్లో అవనిగడ్డ మండలంలో రూ.10 లక్షల విలువైన మట్టి, బుసకను అక్రమంగా తరలించారని ఎడ్లంక, పల్లెపాలెం వాసులు చెబుతున్నారు. ట్రాక్టర్లపై పట్టాలు కప్పకుండా తరలిస్తుండటంతో దుమ్మురేగి స్థానికులు, ట్రాక్టర్ల వెనుకవచ్చే వారి కళ్లల్లో పడుతోంది. దుమ్ముతో గ్రామస్తులు ఇబ్బందులకు గురవుతున్నారు. బుసక ట్రాక్టర్ల వల్ల అవనిగడ్డ నుంచి ఎడ్లంక వెళ్లలేని పరిస్థితి నెలకొందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. దీనిపై ప్రశ్నిస్తే కొందరు డ్రైవర్లు దౌర్జన్యానికి దిగుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తంచేశారు. పట్టించుకోని అధికారులు నాలుగు రోజుల నుంచి జరుగుతున్న అక్రమ బుసక రవాణాపై అధికారులు, పోలీసులకు చెప్పినా ఎవరూ పట్టించుకోవడం లేదని ఎడ్లంక, పల్లెపాలెం ప్రజలు విమర్శిస్తున్నారు. ట్రాక్టర్ ట్రక్కులపై ఎలాంటి రక్షణ చర్యలు లేకుండా స్థానిక పోలీసుస్టేషన్, తహసీల్దార్ కార్యాలయాల మీదుగానే యథేచ్ఛగా తరలివెళుతున్నా అధికారుల్లో స్పందన లేదని చెప్పారు. రెండు గ్రామాల నుంచి.. మండల పరిధిలోని రామచంద్రపురం, దక్షిణ చిరువోలులంక గ్రామాల నుంచి జోరుగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి అక్రమ బుసక, మట్టి రవాణాను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. దీనిపై అవనిగడ్డ తహసీల్దార్ ఎన్. నరసింహమూర్తిని వివరణ కోరగా మండలంలో ఎక్కడా బుసక, మట్టి, ఇసుక తవ్వకాలకు ఎలాంటి అనుమతులు లేవని, వీఆర్వోలను పంపించి అలాంటివి జరిగితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఏడాదిలో పదివేల ట్రక్కులకు పైగా తరలింపు నాలుగు రోజుల నుంచి వేకనూరు లంకల్లో యథేచ్ఛగా బుసక, మట్టి తవ్వకాలు సాగుతున్నాయి. రోజుకు 20 ట్రాక్టర్లకు పైగా బుసకను అక్రమంగా రవాణా చేస్తున్నారు. ఇష్టారాజ్యంగా ట్రాక్టర్లు నడపడం వల్ల రహదారులు దెబ్బతింటున్నాయి. ట్రక్కులపై ఎలాంటి పరజా లేకుండా వెళ్లడంతో కళ్ల నిండా దుమ్ము పడుతోంది. ఏడాదిలో ఎడ్లంక, వేకనూరు నుంచి పదివేలకు పైగా ట్రాక్టర్ ట్రక్కుల ఇసుకను తరలించారు. – దోవా గోవర్దన్, మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందో నాలుగు రోజుల నుంచి మా ఊరి మీదుగా పెద్దఎత్తున బుసక అక్రమ రవాణా సాగుతోంది. ట్రాక్టర్లు చాలా స్పీడుగా వెళుతున్నాయి. ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందో తెలియడం లేదు. ఈ రోడ్డుపై వెళుతుంటే కళ్లనిండా బుసక, దుమ్ము పడుతోంది. రోడ్డుపై ప్రయాణించలేకపోతున్నాం. – కొల్లు గోపాలకృష్ణ, పాతఎడ్లంక -
దొరికితే దొంగలు.. .
సిరుగుప్పలో యథేచ్ఛగా ఇసుక దందా సిరుగుప్ప : ప్రభుత్వ యంత్రాంగం, పోలీసు శాఖ నగరంలో చాప కింద నీరులా జరుగుతున్న అక్రమ ఇసుక దందాను అరికట్టలేక పోవడం చూస్తుంటే నగరవాసులలో పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇసుక అక్రమ దందారాయుళ్లు రాత్రి 11 గంటల నుంచి తెల్లవారు జామున 4 గంటల మధ్య, ఒక ట్రాక్టరు రూ.3000ల ప్రకారం ఒప్పందం చేసుకొంటున్నారు. రాత్రి గస్తీ తిరుగుతున్న పోలీసులకు దొరికితే మాత్రం దొంగ ట్రాక్టరు సీజ్ అవుతుంది. లేకపోతే దొరలా వేలాది రూపాయల సంపాదన చేసుకుంటున్నారు. సిరుగుప్పలో క్లబ్లు, మట్కా, అన్న భాగ్య బియ్యం అక్రమ రవాణా తదితర వాటిని నివారించి, సిరుగుప్ప ప్రజల మన్ననలందుకున్న జిల్లా ఎస్పీ చేతన్ ఇసుక అక్రమ రవాణాపై కూడా దృష్టి సారించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు తాలూకాలో ఇళ్ల నిర్మాణానికి ఇసుక లేకపోవడంతో భవన నిర్మాణ కార్మికులు పూటగడవటం కష్టంగా మారుతోంది. -
ఇసుకను పిండి కోట్లు దండి
ర్యాంపుల్లో యథేచ్ఛగా దందా అక్రమంగా తరలిపోతున్న ఇసుక కళ్లు మూసుకున్న అధికార యంత్రాంగం ‘దోచుకున్న వాడికి దోచుకున్నంత..’ అన్నట్టుగా ఉంది జిల్లాలో ఇసుక వ్యాపారం. నిబంధనల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఇసుకను దొరకని ముడిసరుకుగా మార్చేయడంతో అధికార పార్టీ అండదండలతో ఇసుక మాఫియా ఇష్టారాజ్యంగా దండుకుంటోంది. ప్రభుత్వ అనుమతి ఉందనే సాకు చూపిస్తూ ర్యాంప్ల వద్ద ఎవరికి దొరికినంత వారు దోచేస్తూ కోట్లాది రూపాయలు అక్రమంగా వెనకేసుకుంటున్నారు. చోడవరం: చోడవరం, మాడుగుల నియోజకవర్గాల పరిధిలో ఇసుక రవాణా జోరుగా సాగుతుంది. అనధికార ర్యాంప్లతో పాటు అధికార ర్యాంప్ వద్ద కూడా అక్రమ ఇసుక దందా యథేచ్ఛగా సాగుతోంది. శారదా, పెద్దేరు, బొడ్డేరు, తాచేరు నదుల్లో నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న అన్ని గ్రామాల్లోనూ ఇసుక వ్యాపారం జరుగుతోంది. శారదానదిలో గోవాడ, అంబేరుపురం, గజపతినగరం, ముద్దుర్తి, రాయపురాజుపేట ,కలిగొట్ల, బోయిల కింతాడ, తారువ, మల్లంపాలెం, లక్కవరం, భోగాపురం వద్ద, బొడ్డేరు, పెద్దేరు నదుల్లో విజయరామరాజుపేట, జన్నవరం వీరనారాయణం, వీరవిల్లి అగ్రహారం, మాడుగుల, బెన్నవోలు, పీఎస్పేట, అంకుపాలెంలక్ష్మీపురం కల్లాలు వద్ద అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. -
అక్రమ ఇసుక దందాపై దాడిశెట్టి పోరు
బొద్దవరం డంపింగ్యూర్డులో నిల్వల్ని గుర్తించిన ఎమ్మెల్యే రాజా స్థానికాధికారులు స్పందించకపోవడంతో కలెక్టర్, ఆర్డీఓలకు ఫిర్యాదు రైతులు, పార్టీ నాయకులతో ఏడున్నర గంటలకు పైగా యూర్డులోనే నిరీక్షణ చివరికి వేలాది క్యూబిక్ మీటర్ల ఇసుక, 11లారీలు, రెండు జేసీబీల సీజ్ తుని :కోట్ల విలువ చేసే ఇసుక అక్రమంగా తరలిపోతుంటే అవినీతితో, అధికారపార్టీ నేతల ఒత్తిళ్లతో పట్టించుకోని అధికారులను తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా తన పట్టుదలతో దిగివచ్చేలా చేశారు. అక్రమ ఇసుక నిల్వలను స్వయంగా గుర్తించిన ఆయన వాటిని స్వాధీనం చేసుకునే వరకూ పట్టువిడవ లేదు. ఏడున్నర గంటలపాటు అధికారుల కోసం నిరీక్షించి మరీ వేలాది క్యూబిక్ మీటర్ల అక్రమ ఇసుక నిల్వలను, తరలించడానికి ఉద్దేశించిన వాహనాలను పట్టించారు. ఇసుక అక్రమ దందాతో తాండవ ఒడ్డున పంట భూములు కోల్పోతున్న రైతులను ఆదుకోవాలని సంకల్పించిన ఎమ్మెల్యే రాజా రైతులు, మండల వైఎస్సార్ సీపీ నాయకులతో కలిసి శనివారం మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో కోటనందూరు మండలం బొద్దవరం వెళ్లారు. తాండవ నదిలో తవ్విన ఇసుకను నిల్వచేసిన డంపింగ్ యార్డుకు వెళ్లి, 11 లారీలు, రెండు జేసీబీలతోపాటు వేలాది క్యూబిక్ మీటర్ల ఇసుక నిల్వలను గుర్తించారు. దీనిపై స్థానిక రెవెన్యూ, మండల పరిషత్ అధికారులకు సమచారమిచ్చారు. గంటలు గడుస్తున్నా స్థానిక అధికారులు స్పందించకపోవడంతో కలెక్టర్ అరుణ్కుమార్, పెద్దాపురం ఆర్డీవో విశ్వేశ్వరరావులకు ఫోన్లో ఫిర్యాదు చేశారు. కలెక్టర్ స్పందించి ఇసుక నిల్వలు, వాహనాలను సీజ్ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అధికారులు వచ్చే వరకు కదిలేది లేదన్న ఎమ్మెల్యే రాత్రి తొమ్మిది గంటల వరకూ అక్కడే ఉండిపోయూరు. కాగా అధికార పార్టీ పెద్దలు చీకటిపడ్డాక ఇసుక అక్రమార్కులను ఉసిగొల్పి ఎమ్మెల్యేను, గ్రామస్తులను బెదిరించే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో ఉద్రిక్త పరిస్థితి తలెత్తడంతో ఎస్పీ, డీఎస్పీలకు ఫోన్లో సమాచారం ఇచ్చారు. రాత్రి తొమ్మిదిన్నర ప్రాంతంలో తుని రూరల్ సీఐ చెన్నకేశవరావు, తహశీల్దారు పి.వరహాలయ్య, ఎంపీడీఓ మధుసూదన్లు వచ్చి ఇసుక తరలింపుకు ఉపయోగిస్తున్న వాహనాలను సీజ్ చేస్తామని చెప్పారు. అయితే లిఖితపూర్వకంగా చెబితేనే అక్కడ నుంచి కదులుతానని ఎమ్మెల్యే రాజా తేల్చిచెప్పడంతో చివరికి సీజ్ చేసి పోలీసులకు అప్పగించారు. ఇదంతా జరిగే సరికి రాత్రి 10 గంటలైంది. రైతుల శ్రేయస్సుకు రాజీలేని పోరు: ఎమ్మెల్యే రాజా తాండవ నదిలో ఇసుకను గృహనిర్మాణదారుల కోసమంటూ పంచాయతీ జారీ చేసే పర్మిట్లను అడ్డుపెట్టుకుని రోజుకు రూ.కోటి పైగా విలువ చేసే ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని ఎమ్మెల్యే రాజా విలేకరులకు చెప్పారు. కోటనందూరు నుంచి తుని మండలం వరకూ ఉన్న తాండవలో సుమారు పదిచోట్ల అధికారపార్టీ అండదండలతో ఇసుక మాఫియూ చెలరేగిపోతోందన్నారు. ఆరునెలలుగా ఇది జరుగుతున్నా ఒక్క అధికారీ పట్టించుకోలేదని ఆరోపించారు. విచ్చలవిడి తవ్వకాలతో నదీగమనం మారి సాగు భూములు నదిలో కలిసిపోతున్నాయని, బోరుబావుల్లో నీటి నిల్వలు తగ్గుతున్నాయని అన్నారు. రైతుల శ్రేయస్సు కోసం ఇసుకమాఫియాను అరికట్టేంత వరకూ రాజీ లేని పోరాటం చేస్తానన్నారు. ఎమ్మెల్యే వెంట మండల వైఎస్సార్ సీపీ కన్వీనర్ గొర్లి రామచ ంద్రరావు, మాజీ ఎంపీపీ గొర్లి అచ్చియ్యనాయుడు, మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు పెదపాటి అమ్మాజీ, పార్టీ నాయకులు దాడి బాబులు, వేముల రాజబాబు, చింతకాయల చినబాబ్జి, లగుడు శ్రీను, లంకప్రసాద్, ఎల్లపు సూర్యనారాయణ, సుర్ల అప్పలనాయుడు, కూరపాటి రమణ, బర్రి అప్పారావు, రేలంగి రమణాగౌడ్, మోతుకూరి వెంకటేష్, పలువురు రైతులు ఉన్నారు. ప్రోటోకాల్ను విస్మరించిన అధికారులు ఎమ్మెల్యే రాజా, రైతులు కలసి అనధికార ఇసుక నిల్వలపై లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినా అధికారులు సకాలంలో స్పందించలేదు. చివరికి డిప్యూటీ తహశీల్దార్ ఆర్.వెంకటేశ్వరరావు వచ్చి లారీలు, జేసీబీలు,ఇసుక నిల్వల వివరాలను నమోదు చేశారు. స్థానిక పంచాయతీ కార్యదర్శి సత్యనారాయణ వివరణ కోరేందుకు ఫోన్లో ప్రయత్నిం చగా రెండు నిమిషాలు మాట్లాడాక స్విచాఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కాగా ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యేకి బందోబస్తు ఇవ్వవలసిన పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించారు. ఎమ్మెల్యే బొద్దవరం వచ్చిన అరగంటకు వచ్చిన కోటనందూరు ఎస్సై గోపాలకృష్ణ పది నిమిషాల్లోనే ఉన్నతాధికారుల నుంచి ఫోన్ రాగా వెళ్లిపోయారు. అనంతరం తహశీల్దార్, ఎంపీడీఓ కూడా ఇలాగే వ్యవహరించారు.


