ట్రిపుల్‌ ఐటీ సీట్లకు ఫైనల్‌ కౌన్సెలింగ్‌ | Andhra Pradesh Education News: MBBS, Engineering, IIIT counselling | Sakshi
Sakshi News home page

IIIT సీట్లకు ఫైనల్‌ కౌన్సెలింగ్‌.. త్వ‌ర‌ప‌డండి

Aug 6 2026 2:30 PM | Updated on Aug 6 2026 2:34 PM

Andhra Pradesh Education News: MBBS, Engineering, IIIT counselling

అడ్మిషన్ల కన్వీనర్‌ అమరేంద్రకుమార్‌

వేంపల్లె: ట్రిపుల్‌ ఐటీల్లో 2026–27 విద్యా సంవత్సరానికి శుక్రవారం చివరి దశ కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ టెక్నాలజీ(ఆర్జీయూకేటీ) ఏపీ యూజీ అడ్మిషన్ల కన్వీనర్‌ ప్రొఫెసర్‌ అమరేంద్రకుమార్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. చివరి విడత కౌన్సెలింగ్‌ను ఇడుపులపాయ (ఆర్కే వ్యాలీ) ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌లో నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. నూజివీడు, ఒంగోలు, ఇడుపులపాయ, శ్రీకాకుళం క్యాంపస్‌లలో మొత్తం 105 సీట్లు ఖాళీగా ఉన్నాయని తెలిపారు.

ఈ సీట్ల భర్తీ కోసం 1:1 నిష్పత్తిలో ప్రొవిజనల్‌ సెలక్షన్‌ జాబితా, 1:4 నిష్పత్తిలో వెయిటింగ్‌ లిస్ట్‌ను విడుదల చేశామని వివరించారు. ప్రొవిజనల్‌ సెలెక్షన్‌ జాబితాలో ఎంపికైన అభ్యర్థులు ఈ నెల 7వ తేదీ ఉదయం 8 గంటలకు ఇడుపులపాయ క్యాంపస్‌లో కౌన్సెలింగ్‌కు హాజరై ఒరిజినల్‌ ధ్రువపత్రాలను సమర్పించి అడ్మిషన్‌ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు. ఆ తర్వాత కూడా సీట్లు మిగిలితే వెయిటింగ్‌ లిస్ట్‌లో ఉన్న అభ్యర్థులకు 7వ తేదీ  మధ్యాహ్నం 12 గంటలకు కౌన్సెలింగ్‌ ఉంటుందని వివరించారు. స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ (శాప్‌) నుంచి మెరిట్‌ జాబితా అందిన వెంటనే స్పోర్ట్స్‌ కోటా సీట్లు భర్తీ చేస్తామని తెలిపారు.

ఎంబీబీఎస్ కన్వీనర్‌ కోటా కౌన్సెలింగ్‌ నోటిఫికేషన్‌ విడుదల  
ఎంబీబీఎస్, బీడీఎస్‌ 2026–27 కన్వీనర్‌ కోటా ప్రవేశాల కౌన్సెలింగ్‌కు బుధవారం ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. బుధవారం సాయంత్రం 5 గంటల నుంచి ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను ప్రారంభించింది. ఈ నెల 12న రాత్రి 9గంటల వరకు చివరి గడువుగా పేర్కొన్నారు. 13, 14 తేదీల్లో ఆలస్య రుసుంతో రిజిస్ట్రేషన్‌కు వీలు కల్పించారు. రిజిస్ట్రేషన్‌ సమయంలో ఓసీ, బీసీ విద్యార్థులు రూ.3 వేలు, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.2,400 చొప్పున ఫీజు చెల్లించాలి.

గడువులోగా రిజిస్ట్రేషన్‌ చేసుకోనట్లైతే అన్ని వర్గాల విద్యార్థులు రూ.20 వేల అదనపు రుసుంతో దరఖాస్తు చేసుకునే వీలుంది. నిబంధనలపై సందేహాల నివృత్తికి 89787 80501, 79977 10168, దరఖాస్తు సమయంలో సాంకేతిక సమస్యలు తలెత్తినట్లైతే 90007 80707, 80082 50842 నెంబర్‌లను సంప్రదించాలని విద్యార్థులకు వర్సిటీ సూచించింది. https://drntr.uhsap.in/index/లో పూర్తి నోటిఫికేషన్‌ అందుబాటులో ఉంచారు.    

వ్యవసాయ ఇంజినీరింగ్, ఫుడ్‌ టెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశాలు 
సాక్షి, అమరావతి/గుంటూరురూరల్‌/బాపట్ల: ఆచార్య ఎన్జీరంగా వ్యవ సాయ విశ్వవిద్యాలయం 2026–27 విద్యా సంవత్సరానికి బీటెక్‌ (అగ్రికల్చరల్‌ ఇంజినీరింగ్‌), బీటెక్‌ (ఫుడ్‌ టెక్నాలజీ) కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ వెలువరించింది. అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్‌ మణి ఓ ప్రకటనలో కోరారు.  

సీట్ల వివరాలు 
బీటెక్‌ (అగ్రికల్చరల్‌ ఇంజినీరింగ్‌) కోర్సులో ఎంపీసీ స్ట్రీమ్‌ రైతుల కోటా కింద బాపట్లలోని ఎన్టీఆర్‌ కాలేజ్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ ఇంజినీరింగ్‌లో  27 సీట్లు (2 ఈడబ్ల్యూఎస్‌తో కలిపి).

మడకశిర కాలేజ్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ ఇంజినీరింగ్‌లో 47 సీట్లు  
బీటెక్‌ (ఫుడ్‌ టెక్నాలజీ) కోర్సులో బైపీసీ స్ట్రీమ్‌ కింద 73 సీట్లు, ఎంపీసీ స్ట్రీమ్‌ రైతుల కోటా కింద బాపట్ల, పులివెందుల కళాశాలల్లో కలిపి 32 సీట్లు ఉన్నాయి. కోర్సుల్లో ప్రవేశాలకు ఏపీ ఈఏపీసెట్‌–2026 ర్యాంకుల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇంటర్మీడియట్‌ (ఎంపీసీ/బైపీసీ) పూర్తి చేసిన విద్యార్థులు అర్హులు. దరఖాస్తులను ఈనెల 10వ తేదీ సాయంత్రం 4గంట లలోపు ‘రిజిస్ట్రార్‌, ఆచార్య ఎన్‌.జీ.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, పరిపాలనా కార్యాలయం, గుంటూరు–522034’ చిరునామాకు చేరేలా రిజిస్టర్‌ పోస్ట్‌ ద్వారా లేదా నేరుగా అందజేయవచ్చు. మరిన్ని వివరాలకు విశ్వవిద్యాలయ అధికారిక వెబ్‌సైట్‌ లేదా 81257 29592, 73311 48417, 78935 20988 నంబర్లలో సంప్రదించవచ్చు.  

అభ్యంతరాల స్వీకరణ 
సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ (సీఏఎస్‌)ల ప్రొవిజనల్‌ ఫైనల్‌ సీనియార్టీ జాబితాను aphmfw.ap.gov.inలో అందుబాటులో ఉంచినట్టు ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ కార్యాలయం బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. అభ్యంతరాలు, ఫిర్యాదులున్న వైద్యులు శుక్రవారం సాయంత్రం ఐదు గంటల్లోపు e6sectionappealdphfw@gmail.comకు పంపాలని స్పష్టం చేసింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement