breaking news
IIIT Nuziveedu
-
ట్రిపుల్ ఐటీ సీట్లకు ఫైనల్ కౌన్సెలింగ్
వేంపల్లె: ట్రిపుల్ ఐటీల్లో 2026–27 విద్యా సంవత్సరానికి శుక్రవారం చివరి దశ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు రాజీవ్గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీ(ఆర్జీయూకేటీ) ఏపీ యూజీ అడ్మిషన్ల కన్వీనర్ ప్రొఫెసర్ అమరేంద్రకుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. చివరి విడత కౌన్సెలింగ్ను ఇడుపులపాయ (ఆర్కే వ్యాలీ) ట్రిపుల్ ఐటీ క్యాంపస్లో నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. నూజివీడు, ఒంగోలు, ఇడుపులపాయ, శ్రీకాకుళం క్యాంపస్లలో మొత్తం 105 సీట్లు ఖాళీగా ఉన్నాయని తెలిపారు.ఈ సీట్ల భర్తీ కోసం 1:1 నిష్పత్తిలో ప్రొవిజనల్ సెలక్షన్ జాబితా, 1:4 నిష్పత్తిలో వెయిటింగ్ లిస్ట్ను విడుదల చేశామని వివరించారు. ప్రొవిజనల్ సెలెక్షన్ జాబితాలో ఎంపికైన అభ్యర్థులు ఈ నెల 7వ తేదీ ఉదయం 8 గంటలకు ఇడుపులపాయ క్యాంపస్లో కౌన్సెలింగ్కు హాజరై ఒరిజినల్ ధ్రువపత్రాలను సమర్పించి అడ్మిషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు. ఆ తర్వాత కూడా సీట్లు మిగిలితే వెయిటింగ్ లిస్ట్లో ఉన్న అభ్యర్థులకు 7వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు కౌన్సెలింగ్ ఉంటుందని వివరించారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) నుంచి మెరిట్ జాబితా అందిన వెంటనే స్పోర్ట్స్ కోటా సీట్లు భర్తీ చేస్తామని తెలిపారు.ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదల ఎంబీబీఎస్, బీడీఎస్ 2026–27 కన్వీనర్ కోటా ప్రవేశాల కౌన్సెలింగ్కు బుధవారం ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. బుధవారం సాయంత్రం 5 గంటల నుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. ఈ నెల 12న రాత్రి 9గంటల వరకు చివరి గడువుగా పేర్కొన్నారు. 13, 14 తేదీల్లో ఆలస్య రుసుంతో రిజిస్ట్రేషన్కు వీలు కల్పించారు. రిజిస్ట్రేషన్ సమయంలో ఓసీ, బీసీ విద్యార్థులు రూ.3 వేలు, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.2,400 చొప్పున ఫీజు చెల్లించాలి.గడువులోగా రిజిస్ట్రేషన్ చేసుకోనట్లైతే అన్ని వర్గాల విద్యార్థులు రూ.20 వేల అదనపు రుసుంతో దరఖాస్తు చేసుకునే వీలుంది. నిబంధనలపై సందేహాల నివృత్తికి 89787 80501, 79977 10168, దరఖాస్తు సమయంలో సాంకేతిక సమస్యలు తలెత్తినట్లైతే 90007 80707, 80082 50842 నెంబర్లను సంప్రదించాలని విద్యార్థులకు వర్సిటీ సూచించింది. https://drntr.uhsap.in/index/లో పూర్తి నోటిఫికేషన్ అందుబాటులో ఉంచారు. వ్యవసాయ ఇంజినీరింగ్, ఫుడ్ టెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశాలు సాక్షి, అమరావతి/గుంటూరురూరల్/బాపట్ల: ఆచార్య ఎన్జీరంగా వ్యవ సాయ విశ్వవిద్యాలయం 2026–27 విద్యా సంవత్సరానికి బీటెక్ (అగ్రికల్చరల్ ఇంజినీరింగ్), బీటెక్ (ఫుడ్ టెక్నాలజీ) కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువరించింది. అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ మణి ఓ ప్రకటనలో కోరారు. సీట్ల వివరాలు బీటెక్ (అగ్రికల్చరల్ ఇంజినీరింగ్) కోర్సులో ఎంపీసీ స్ట్రీమ్ రైతుల కోటా కింద బాపట్లలోని ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ అగ్రికల్చరల్ ఇంజినీరింగ్లో 27 సీట్లు (2 ఈడబ్ల్యూఎస్తో కలిపి).మడకశిర కాలేజ్ ఆఫ్ అగ్రికల్చరల్ ఇంజినీరింగ్లో 47 సీట్లు బీటెక్ (ఫుడ్ టెక్నాలజీ) కోర్సులో బైపీసీ స్ట్రీమ్ కింద 73 సీట్లు, ఎంపీసీ స్ట్రీమ్ రైతుల కోటా కింద బాపట్ల, పులివెందుల కళాశాలల్లో కలిపి 32 సీట్లు ఉన్నాయి. కోర్సుల్లో ప్రవేశాలకు ఏపీ ఈఏపీసెట్–2026 ర్యాంకుల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇంటర్మీడియట్ (ఎంపీసీ/బైపీసీ) పూర్తి చేసిన విద్యార్థులు అర్హులు. దరఖాస్తులను ఈనెల 10వ తేదీ సాయంత్రం 4గంట లలోపు ‘రిజిస్ట్రార్, ఆచార్య ఎన్.జీ.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, పరిపాలనా కార్యాలయం, గుంటూరు–522034’ చిరునామాకు చేరేలా రిజిస్టర్ పోస్ట్ ద్వారా లేదా నేరుగా అందజేయవచ్చు. మరిన్ని వివరాలకు విశ్వవిద్యాలయ అధికారిక వెబ్సైట్ లేదా 81257 29592, 73311 48417, 78935 20988 నంబర్లలో సంప్రదించవచ్చు. అభ్యంతరాల స్వీకరణ సివిల్ అసిస్టెంట్ సర్జన్ (సీఏఎస్)ల ప్రొవిజనల్ ఫైనల్ సీనియార్టీ జాబితాను aphmfw.ap.gov.inలో అందుబాటులో ఉంచినట్టు ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ కార్యాలయం బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. అభ్యంతరాలు, ఫిర్యాదులున్న వైద్యులు శుక్రవారం సాయంత్రం ఐదు గంటల్లోపు e6sectionappealdphfw@gmail.comకు పంపాలని స్పష్టం చేసింది. -
ట్రిపుల్ ఐటీ భవితకు దివిటీ
ప్రతిభ గల పేద విద్యార్థులకు ఇంటర్మీడియెట్ నుంచి ఇంజనీరింగ్ వరకు ఉచిత విద్యనందించే సదుద్దేశంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ కళాశాలలను ఏర్పాటుచేశారు. ఏలూరు జిల్లా నూజివీడులోని ట్రిపుల్ ఐటీలో చదువు పూర్తిచేసుకుని బయటికి వచ్చిన విద్యార్థులు మెరుగైన ప్యాకేజీతో ఉద్యోగావకాశాలు అందుకుంటున్నారు. పలువురు విదేశాల్లో చదువులు, కొలువులకు సైతం వెళ్తుండగా, మరికొందరు ప్రభుత్వ ఉద్యోగాలపై దృష్టి పెట్టి స్థిరపడినవారూ ఉన్నారు. – నూజివీడు ప్రపంచ స్థాయి ప్రమాణాలు, ఉన్నత సాంకేతిక విద్యను అందిస్తూ నూజివీడు ట్రిపుల్ఐటీ పేద విద్యార్థుల భవిష్యత్కు బంగారు బాటలు వేస్తోంది. ఆరేళ్లపాటు ఒక్కరూపాయి ఖర్చు లేకుండా చదువుకుంటున్న విద్యార్థులు క్యాంపస్ సెలెక్షన్స్లో సత్తాచాతున్నారు. ఏటా 350 నుంచి 500 మందికి పైగా వి ద్యార్థులు మల్టీనేషనల్ కంపెనీల్లో ఉద్యోగాలు సాధిస్తున్నారు. ఏడాదికి రూ.7.60 లక్షల నుంచి రూ.14 లక్షల వరకు ప్యాకేజీలకు ఎంపికవుతున్నారు. సాఫ్ట్వేర్ కొలువులతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడిన వారు, విదేశీ కంపెనీల్లో పనిచేస్తున్న వారు ఉన్నారు. ఇస్రోలో సైంటిస్టులుగా, రైల్వేలో ఉన్నతోద్యోగులుగా, ఇరిగేషన్, పంచాయతీరాజ్ శా ఖల్లో ఇంజినీర్లుగా, బ్యాంకు, సచివాలయ ఉద్యోగులుగా ట్రిపుల్ఐటీ విద్యార్థులు పనిచేస్తున్నారు. సీడీపీసీ ప్రముఖ పాత్ర : విద్యార్థులు ప్లేస్మెంట్లు సాధించడంలో కెరీర్ డెవలప్మెంట్ అండ్ ప్లేస్మెంట్ సెల్ (సీడీపీసీ) ప్రముఖ పాత్ర పోషిస్తోంది. ఇంజినీరింగ్ మూడో సంవత్సరం నుంచే విద్యార్థులకు మాక్ ఇంటర్వ్యూలు నిర్వహించడం, కంపెనీల అవ సరాలకు అనుగుణంగా తీర్చిదిద్దడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విద్యార్థులను అన్నిరకాలు గా తీర్చిదిద్దేలా ప్రత్యేక శిక్షణలు ఇస్తున్నారు. కంపెనీల ప్రతినిధులతో నిరంతరం మాట్లాడుతూ వారిని ప్లేస్మెంట్లకు వచ్చేలా చేస్తున్నారు. ప్రపంచ స్థాయి కంపెనీలు ప్రపంచస్థాయి సాఫ్ట్వేర్ కంపెనీలు క్యాంపస్ సెలెక్షన్స్ నిర్వహిస్తున్నాయి. టీసీఎస్, విప్రో, టెక్మహీంద్ర, క్యాప్జెమినీ, ఎఫ్ట్రానిక్స్, ఫ్రెష్డెస్క్, థాట్వర్క్స్, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్, ఐబీఎం, సినోప్సిస్, ఇంటెల్ తదితర 80 కంపెనీలు ఇక్కడకు వస్తున్నాయి. 3,856 మందికి క్యాంపస్ ప్లేస్మెంట్లు ట్రిపుల్ఐటీలో ఇప్పటివరకూ 8 బ్యాచ్లు కోర్సును పూర్తిచేసుకుని వెళ్లగా వీరిలో 3,856 మందికి క్యాంపస్ ప్లేస్మెంట్లు వచ్చాయి. మరికొందరు గేట్లో ర్యాంకులు సాధించి ఎంటెక్ చదువుతున్నారు. ఈ ఏ డాదిలో ఇప్పటివరకూ 768 మందికి ఉద్యోగాలు రాగా అన్లాగ్ డివైస్ కంపెనీ ఏడాదికి రూ.20 లక్షల జీతంతో నలుగురిని, గప్చుప్ టెక్నాలజీస్ రూ.15 లక్షల వేతనంతో ఇద్దరిని, జస్పే సంస్థ రూ.27 లక్ష ల వేతనంతో ఒక విద్యార్థిని ఎంపిక చేసుకున్నాయి. వైఎస్సార్ వెలుగులు నింపారు ట్రిపుల్ఐటీ స్థాపించి దివంగత వైఎస్సార్ నా జీవితంలో వెలుగులు నింపారు. మాది దిగువ మధ్య తరగతి కుటుంబం. ట్రిపుల్ఐటీలో ఈసీఈ బ్రాంచితో ఇంజినీరింగ్ పూర్తిచేశా. తర్వాత మద్రాస్ ఐఐటీలో ఎంటెక్ చదివా. ఏడాదిన్నర పాటు దక్షిణ మధ్య రైల్వేలో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేశా. ప్రస్తుతం ఇస్రో ప్రధాన కార్యాలయం (బెంగళూరు)లో సైంటిస్టు–సీగా పనిచేస్తున్నా. –గుత్తా వెంకట శేషారావు, ఇస్రో సైంటిస్ట్ -
ట్రిపుల్ ఐటీ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
సాక్షి, కృష్ణాజిల్లా : నూజివీడు ట్రిపుల్ ఐటీలో దారుణం చోటుచేసుకుంది. ఈసీఈ మొదటి సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన అనురాధ కొన్ని రోజుల నుంచి చెవికి సంబంధించిన సమస్యతో బాధపడుతూ ఈ మధ్యే సర్జరీ చేయించుకుంది. అప్పటినుంచి తరచూ అనారోగ్యానికి గురవడంతోపాటు మనస్తాపానికి గురైన విద్యార్థిని డాక్టర్లు ఇచ్చిన మందులను ఎక్కువ మోతాదులో తీసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో విద్యార్థిని అపస్మారక స్థితిలోకి వెళ్లింది. కాగా పరిస్థితిని గమనించిన తోటి విద్యార్థులు వార్డెన్కు సమాచారం ఇవ్వడంతో అంబులెన్సులో నూజివీడు ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థిని ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ట్రిపుల్ ఐటీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మహిళా ఎస్సై దేవకీ దేవి ఈ ఘటనపై విచారణ చేపట్టారు. అనంతరం సత్తెనపల్లిలో ఉంటున్న అనురాధ తల్లిదండ్రులకు పోలీసులు సమాచారం అందించారు. -
ట్రిపుల్ ఐటీ విద్యార్థికి అరుదైన అవకాశం
సాక్షి, కృష్ణా జిల్లా : నూజివీడు ట్రిపుల్ ఐటీ విద్యార్థి నజ్మా సుల్తానాకు అరుదైన అవకాశం లభించింది. యూరోపియన్ యూనియన్ విద్యార్థులకు అందజేసే 20 లక్షల రూపాయల స్కాలర్షిప్ ఆమెను వరించింది. ప్రపంచ దేశాల్లో వివిధ యూనివర్సిటీల నుంచి ఈ స్కాలర్షిప్ కోసం వందలాది మంది విద్యార్థులు పోటీపడ్డారు. అయితే వీరందిరిలో భారతదేశం నుంచి ఇద్దరు విద్యార్థులను మాత్రమే యూరోపియన్ యూనియన్ ఎంపిక చేయడం విశేషం. కాగా నజ్మా స్వస్థలం గుంటూరు. ప్రతిష్టాత్మక స్కాలర్షిప్ అందుకున్న నేపథ్యంలో పలువురు ఆమెను ప్రశంసిస్తున్నారు. -
కృషి మీ ఆయుధమైతే.. విజయం మీకు బానిస
కడప సిటీ/వేంపల్లె: ‘కృషి నీ ఆయుధమైతే విజయం నీకు బానిస’ అన్న జాతిపిత మహాత్మగాంధీ మాటలను ప్రతి ఒక్క ట్రిపుల్ ఐటీ విద్యార్థి గుర్తించుకుని ముందుకు సాగా లని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు సూచించారు. శుక్రవా రం ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో 2012–18 విద్యా సంవత్సరానికి సంబంధించి నాల్గవ స్నాతకోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రులు గంటా శ్రీనివాసరావు, ఆదినారాయణరెడ్డి, చాన్సలర్ రాజిరెడ్డి, వైస్ చాన్సలర్ రామచంద్రరాజు, డైరెక్టర్ అమరేంద్రకుమార్ పండ్ర తదితరులు హాజరై పట్టాలు పొందిన విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ను అందజేశారు. అనంతరం వారు విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. ప్రభుత్వ బడులలో చదివే గ్రామీణ విద్యార్థులకు ట్రిపుల్ ఐటీలు వరం లాంటివన్నారు. రాజీవ్గాంధీ వైజ్ఞానిక, సాంకేతిక విశ్వ విద్యాలయం (ఆర్జీయూకేటీ) పరిధిలో రాష్ట్రం లో ఇడుపులపాయ, నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలు నడుస్తున్నాయన్నారు. ప్రతి ట్రిపుల్ ఐటీలో ప్రతి ఏడాది 6 వేలమంది విద్యార్థులకు ఇక్కడ చదివేందుకు అవకాశం వస్తోందన్నారు. ప్రధానంగా ప్రభుత్వ బడులలో చదివే విద్యార్థులకు 4 శాతం వెయిటేజీ మార్కులు కలుపుతున్నామన్నారు. అయినప్పటికి చివరి సీటు సాధించిన విద్యార్థికి కూడా 10 జీపీఏ పాయింట్లు సాధించిన వారే ఇక్కడ విద్యనభ్యసించడం జరుగుతోందన్నారు. ఆరేళ్ల సమీకృత కోర్సుకు సంబంధించి విద్యార్థులకు ల్యాప్టాప్, భోజన వసతి, వసతి, యూనిఫాం తదితర సదుపాయాలు కూడా ఏర్పాటు చేశామన్నారు. మరో రెండు ట్రిపుల్ ఐటీలు ప్రధానంగా ట్రిపుల్ ఐటీలలో బాలికలకు 65శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు తెలిపారు. 1985లో తాను ఆంధ్రా యూనివర్సిటీలో పట్టా తీసుకున్నానని, ఆ నాటి జ్ఞాపకాలు ఇప్పుడు గుర్తుకు వస్తున్నాయన్నారు. పట్టాలు తీసుకోవడంతోనే సరిపోదని, ఇంకా లాంగ్ జర్నీ ఎంతో ఉందన్నారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ ట్రిపుల్ ఐటీల వ్యవస్థను తీసుకొచ్చారన్నారు. మరో రెండు కొత్త ట్రిపుల్ ఐటీల ఏర్పాటుకు ముఖ్యమంత్రి చొరవ చూపుతున్నారని వెల్లడించారు. 2008లో ప్రొఫెసర్ రాజిరెడ్డి ఈ ట్రిపుల్ ఐటీలకు రూపకల్పన చేశారన్నారు. విద్యాభివృద్ధికి ప్రభుత్వం బడ్జెట్లో 17శాతం ఖర్చు చేస్తోందన్నారు. ఎడ్యుకేషన్ ఆఫ్ నాలెడ్జి హబ్గా వీటిని మార్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. వాన చుక్క పడే స్థానాన్ని బట్టి దానికి విలువ ఉంటుందని, ఆల్చిప్పలో పడితే ముత్యమవుతుందని, అటువంటి ఆల్చిప్పగా ట్రిపుల్ ఐటీని ఆయన అభివర్ణించారు. విలువలతో కూడిన విద్యనభ్యసించాలన్నారు. తల్లిదండ్రుల కలలు సాకారం చేయాలన్నారు. ఎక్కడో పుట్టి.. ఎక్కడో పెరిగి.. మార్కెటింగ్ శాఖ మంత్రి ఆదినారాయణరెడ్డి మా ట్లాడుతూ మిమ్ములను చూస్తే స్టూడెంట్–1 సినిమా గుర్తుకు వస్తోందన్నారు. ఎక్కడో పుట్టి.. ఎక్కడో పె రిగి.. ఇక్కడే చదివాం అన్నట్లుగా ఉందని, బంగారు భవిష్యత్కు బాటలు వేసుకోవాలని సూచించారు. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనారాయణ, సుందర్ పిచ్చయ్లను ఆదర్శంగా తీసుకుని చదవాలన్నారు. భావి శాస్త్రవేత్తలు ఎదగాలి చాన్సలర్ రాజిరెడ్డి మాట్లాడుతూ పేద గ్రామీణ ప్రాంత విద్యార్థుల కోసం 6 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్ డ్యూయల్ డిగ్రీని ట్రిపుల్ ఐటీలో ఏర్పాటు చేశామన్నారు. వినూత్న ప్రయోగాలతో ముందుకు సాగాలన్నారు. ప్రస్తుతం ట్రాన్స్సిస్టర్ రేడియో, డిస్కవరీ, రోబోస్టిక్స్ తదితర వినూత్న ప్రయోగాలపై శ్రద్ధ చూపి దేశాభివృద్ధికి పాటుపడటంతోపాటు భావి భారత శాస్త్రవేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు. ప్రతి విద్యార్థికి ఇక్కడ చదువుకునేందుకు అన్ని అవకాశాలు ఉన్నాయని, సద్వి నియోగం చేసుకోవడమే మీ వంతు అన్నారు. ఇప్పటికే ట్రిపుల్ ఐటీల ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లామన్నారు. రాబోయే రోజులలో మరింత ఖ్యాతిని గడించేలా క్రమశిక్షణతో చదివి లక్ష్యాన్ని ముందుంచుకుని ముందుకు సాగాలన్నారు. అనంతరం వివిధ రంగాలలో ప్రతిభ చూపిన విద్యార్థిని విద్యార్థులకు, ఫ్యాకల్టీకి నగదు బహుమతులతోపాటు ప్రశంసా పత్రాలను అందజేశారు. -
సాయమందిస్తే.. సత్తా చాటుతాం !
నూజివీడు : ఆ నలుగురు నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు. రెక్కలు ముక్కలు చేసుకుని తల్లిదండ్రులు వారిని చదివించుకుంటున్నారు. మారుమూల గ్రామాల్లో పుట్టి ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ప్రతిభ చూపి నూజివీడు ట్రిపుల్ ఐటీలో సీట్లు సాధించారు. ఇంజినీరింగ్ విద్యలోనూ అసాధారణ ప్రతిభ చూపెట్టి విదేశాల్లోని యూనివర్సిటీలను సైతం మెప్పించారు. వీరి ప్రతిభను మెచ్చి అమెరికాలోని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ డీ స్కూల్ ఫెలోషిప్కు ఎంపిక చేసింది. యూనివర్సిటీ ఆహ్వానం మేరకు ఈ నెలలో అమెరికా వెళ్లేందుకు విద్యార్థుల వద్ద చేతిలో చిల్లిగవ్వలేదు. తల్లిదండ్రులు సైతం డబ్బు ఖర్చుపెట్టి అమెరికా పంపించే పరిస్థితుల్లో లేరు. అమెరికా వెళ్లి రావాలంటే విమాన టికెట్లు, వెళ్లిన తరువాత ఖర్చులు కలిపి ఒక్కొక్కరికీ దాదాపు రూ.2లక్షలు అవసరమవుతాయి. ఈ నేపథ్యంలో ఎవరైనా దాతలు ఉంటే సాయమందించాలని విద్యార్థులు కోరుతున్నారు. దాతలు దయతలచి సాయమందిస్తే అమెరికా వెళ్లి తమ సత్తా చాటుతామని వారు పేర్కొంటున్నారు. ఎంపికైన విద్యార్థులు వీరే.. నూజివీడు ట్రిపుల్ ఐటీ నుంచి 125 మంది ఆన్లైన్ పరీక్షకు హాజరైతే గడ్డం సాయికుమార్ (సీఎస్ఈ ప్రథమ సంవత్సరం), లాల్సింగ్ నాయక్ (మెకానికల్ ద్వితీయ సంవత్సరం), పుప్పాల ప్రతాప్ (సీఎస్ఈ ద్వితీయ సంవత్సరం), వంకలపాటి సాయిదుర్గాప్రసాద్ (ఈసీఈ ద్వితీయ సంవత్సరం) ఎంపికయ్యారు. వీరికి ఆరువారాల పాటు ఆన్లైన్లో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ అధికారులు శిక్షణ ఇచ్చిన తరువాత ఫెలోషిప్ను ప్రకటించారు. మార్చి 15 నుంచి 19వ తేదీ వరకు అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో నిర్వహించే సిలికాన్ వ్యాలీ మీట్ అప్–2018 స్ప్రింగ్ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ఈ నలుగురు విద్యార్థులకు యూనివర్సిటీ వారు ఆహ్వానం పంపించారు. యూనివర్సిటీలో నిర్వహించే మీట్లో విద్యార్థులు వివిధ అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తారు. ఆర్థిక స్థోమత లేదు తల్లిదండ్రులు తిరుపతిరావు, లక్ష్మీలు ఇద్దరూ షాపుల్లో పనిచేస్తారు. తమ్ముడు ఇంటర్మీడియెట్ చదువుతున్నాడు. అమెరికా వెళ్లాలంటే రూ.2లక్షలు ఖర్చుచేసే స్థోమత లేదు. దీంతో ఎవరైనా దాతలు ఉంటే సాయం చేయాలని కోరుతున్నా.– వంకలపాటి సాయిదుర్గాప్రసాద్,కృష్ణలంక, విజయవాడ కూలికి వెళ్లి చదివిస్తున్నారు రైతు కూలీ కుటుంబం నుంచి వచ్చా. నాన్న మల్లయ్య, అమ్మ పార్వతి ఇద్దరూ వ్యవసాయ పనులకు వెళ్లి కుటుంబాన్ని పోషించుకుంటూ నన్ను చదవిస్తున్నారు. అమెరికా వెళ్లేందుకు అవసరమైన డబ్బులు తీసుకురావడం సాధ్యం కాదు.– గడ్డం సాయికుమార్, చీమలమర్రి, నకరికల్లు మండలం, గుంటూరు జిల్లా అమ్మ కష్టపడి చదివిస్తోంది మా నాన్న నా చిన్నప్పుడే చనిపోవడంతో అమ్మ లక్ష్మి కూలి చేసుకుంటూ నన్ను చదివిస్తోంది. తమ్ముడు ఉన్నప్పటికీ ఇంటి వద్దే గొర్రెలు మేపుతాడు. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా తమ్ముడిని చదివించడం లేదు. ఎవరైనా ఆర్థిక సాయం చేస్తే సిలికాన్ వ్యాలీకి వెళ్లగలం.– మూడు లాలూనాయక్, చౌడవరం తండా, వేంసూరు మండలం, ఖమ్మం జిల్లా ఆదుకుంటేనే వెళ్లగలం తల్లిదండ్రులు శ్రీనివాసరావు, మాధవి ఇద్దరూ వ్యవసాయ పనులకు వెళ్లి జీవనం సాగిస్తున్నారు. అక్కను ఎంబీఏ చదివిస్తున్నారు. అంత డబ్బు పెట్టడమంటే సాధ్యమయ్యే పనికాదు. ఎవరైనా ఆదుకుంటేనే తాము వెళ్లగలం.– పుప్పాల ప్రతాప్, ప్రజ్ఞం,నిజాపట్నం మండలం, గుంటూరు జిల్లా -
ట్రిపుల్ ఐటీ మిగులు సీట్లకు కౌన్సెలింగ్
నూజివీడు: నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్ ఐటీలలో మిగిలిన సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ మొదలైంది. మంగళవారం ఉదయం 8 గంటలకు కౌన్సెలింగ్ ప్రారంభం అయింది. వెయిటింగ్ జాబితాలోని అభ్యర్థులకు నూజివీడు ట్రిపుల్ఐటీలో కౌన్సెలింగ్ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ కౌన్సెలింగ్లో రెండు ట్రిపుల్ ఐటీలకు కలిపి 555 సీట్లు భర్తీ చేయనున్నారు. వీటిలో జనరల్ కౌన్సెలింగ్, ప్రత్యేక కేటగిరి, సూపర్ న్యూమరరీ సీట్లు ఉన్నాయి.


