ఫైనాన్స్‌ దా‘రుణం’.. ఇల్లాలు బలవన్మరణం | Tragic incident in bapatla district vellaturu | Sakshi
Sakshi News home page

ఫైనాన్స్‌ దా‘రుణం’.. ఇల్లాలు బలవన్మరణం

Apr 10 2025 5:58 AM | Updated on Apr 10 2025 5:58 AM

Tragic incident in bapatla district vellaturu

ఇల్లు తనఖా పెట్టి రూ.4 లక్షలు అప్పు తీసుకున్న గిరిజన కుటుంబం.. 

అప్పట్లో రూ.లక్ష మినహాయించుకుని రూ.3 లక్షలే ఇచ్చిన వైనం 

ఇంటిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని తెలిసి నిలదీసిన బాధితులు.. 

ఇంట్లో సామాను బయటకు విసిరి సదరు సంస్థ దౌర్జన్యం 

వంట పాత్రలతో దాడి.. అవమానంతో మహిళ ఆత్మహత్య 

భట్టిప్రోలు (కొల్లూరు): ప్రైవేటు ఫైనాన్స్‌ సంస్థ ఆగడాలు మితిమీరి ఇంటిపైకి వచ్చి దౌర్జన్యానికి పాల్ప­డటంతో అవమాన భారం భరించలేక ఓ వివాహిత బలవన్మరణానికి పాల్పడింది. మంగళవారం చోటుచేసుకున్న ఈ విషాద ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. బాపట్ల జిల్లా భట్టిప్రోలు మండలం వెల్లటూరులో బాణావత్‌ గోవింద్‌నాయక్‌ భార్య పార్వతిబాయ్‌ (44)తో కలసి నివసిస్తున్నాడు. వీరు అమాయకులు. పెద్దగా చదువు రాదు. 

గతేడాది వీరు 5 స్టార్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ సంస్థలో ఇంటి పత్రాలు తనఖా పెట్టి రూ.4 లక్షలు రుణం తీసుకున్నారు. రుణం మంజూరు చేసే సమయంలో రూ.లక్ష చార్జీలంటూ వసూలు చేసి, రూ.3 లక్షలు అందజేశారు. అప్పట్నుంచి లోన్‌ నగదు చెల్లింపులు చేసుకుంటూ వస్తున్నారు. అయితే కొంత కాలం తర్వాత తమ ఇంటిని ఫైనాన్స్‌ సంస్థ వారు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నట్లు తెలియడంతో నెలవారీ కిస్తీలు కట్టడం ఆపేసి.. ఆ విషయం తేల్చాలని పట్టుబట్టారు. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల కిందట సంస్థ ప్రతినిధులు పార్వతీబాయ్‌ ఇంటికి వెళ్లి ఆమెపై దౌర్జన్యం చేయడంతోపాటు, దుర్భాషలాడారు. దీంతో వారు భట్టిప్రోలు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 

ఈ విషయంపై మంగళవారం సాయంత్రం ప్రైవేటు పైనాన్స్‌ సంస్థకు చెందిన వ్యక్తులు పార్వతిబాయ్‌ ఇంటికి వెళ్లి ఆమెపై దౌర్జన్యానికి పాల్ప­డ్డారు. సామగ్రి బయటకు విసిరేశారు. వంట పాత్రలతో ఆమెపై దాడికి తెగబడ్డారు. కేసు వాపసు తీసుకోవాలంటూ తీవ్రంగా హెచ్చరించి వెళ్లారు. దీంతో మనస్తాపానికి గురైన పార్వతీబాయ్‌ ఫ్యాన్‌కు ఉరి వేసుకుంది. చుట్టుపక్కల వారు తలుపులు తీసి.. ఆమెను గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. 

మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, ఈ ఘటనపై వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, వేమూరు నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి వరికూటి అశోక్‌బాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మైక్రో ఫైనాన్స్, ప్రైవేట్‌ ఫైనాన్స్‌ సంస్థల ఆగడాలపై చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. బాధిత కు­టుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement