
నేడు జాతీయ సముద్రపు నాచు దినోత్సవం
రాష్ట్రంలో కుటీర పరిశ్రమగా నాచు సాగు
పోషక విలువలు.. ఔషధ గుణాల్లో మేటి
ప్రయోగాత్మకంగా విశాఖపట్నంలో మొదటి సాగు
రాష్ట్రంలో సీ వీడ్ సాగుకు 37 అనుకూల ప్రాంతాల గుర్తింపు
పీఎంఎంఎస్వై ద్వారా మహిళలకు సబ్సిడీ రుణాలకు ప్రణాళిక
రాష్ట్రంలో 60 వేల యూనిట్ల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం
కైకలూరు: సముద్రపు నాచు (సీ వీడ్) తీరప్రాంత మహిళలకు కుటీర పరిశ్రమగా మారుతోంది. మంచినీరు, ఎరువులు, పురుగు మందులు, ఆహారం అవసరం లేకుండా సముద్రంలో తక్కువ కాలంలోనే అధిక దిగుబడులు సాధించే నాచు పెంపకానికి డిమాండ్ పెరుగుతోంది. ఆక్వా రంగానికి ప్రత్యామ్నాయంగా నాచు సాగు మారనుంది.
సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ (సీఎంఎఫ్ఆర్ఐ), కోస్టల్ ఆక్వా కల్చర్ అథారిటీ (సీఏఏ) ఆధ్వర్యంలో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన(పీఎంఎంఎస్వై) ద్వారా మహిళలకు సబ్సిడీ రుణాలిచ్చేందుకు ప్రభుత్వం ముందుకొస్తోంది. సీ వీడ్పై అవగాహన కల్పించేందుకు ఏటా జూన్ 4న జాతీయ సముద్రపు నాచు దినోత్సవం జరుపుతారు.
పోషకాల గని.. సముద్రపు నాచు
సముద్రపు నాచు (మెరైన్ ఆల్గే)లో పోషక, ఔషధ విలువలు అధికంగా ఉంటాయి. తెప్పలు, రేస్ వేలు, మోనోలైన్, తాళ్లు వంటి పద్ధతుల్లో సముద్రంలో నాచును సాగు చేస్తున్నారు. తమిళనాడులోని మండపం ప్రాంతం నుంచి కప్పఫైకాస్, గ్రాసిలేరియా అనే జాతుల విత్తనాలను ఏపీకి తెస్తున్నారు. ఒక్కో పంట 45–60 రోజుల సమయం పడుతోంది. సీ వీడ్లో ప్రొటీన్, ఖనిజాలు, విటమిన్లు అధికంగా ఉంటాయి.
వీటిని బిస్కెట్లు, పాస్తా, నూడుల్స్, సూప్ పౌడర్లు, పెరుగు వంటి అహార పదార్థాల్లో వినియోగిస్తారు. ఔషధ, సౌందర్య రంగాల్లోనూ సీ వీడ్కు డిమాండ్ ఉంది. దీంతో ఆగార్, కరోజీనాన్ పదార్థాలు తయారవుతాయి. వీటిని టూత్పేస్ట్, స్కిన్ కేర్ ఉత్పత్తుల ఔషధాల్లో వినియోగిస్తారు. వ్యవసాయంలో బయో ఫెర్టిలైజర్లుగా కూడా దీనిని వాడతారు. సీ వీడ్తో తయారు చేసిన తినుబండారాలు, సాల్ట్, ఆయిల్, స్నాక్స్కు డిమాండ్ ఉంది.

రాష్టంలో 36 కేంద్రాల గుర్తింపు
ఆంధ్రప్రదేశ్లో 1,027 కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతం ఉంది. సీ వీడ్ సాగుకు అనుకూలమైన 36 ప్రాంతాలను రాష్ట్ర వ్యాప్తంగా సెంట్రల్ సాల్ట్ అండ్ మెరైన్ కెమికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సీఎస్ఎంసీఆర్ఐ) గుర్తించింది. విశాఖపట్నం, శ్రీకాకుళం, నెల్లూరు, కృష్ణా, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలు సీ వీడ్ సాగుకు అనుకూలంగా ఉన్నాయి.

నరసాపురం, మొగల్తూరు, సూర్యలంక, విశాఖపట్నం, శ్రీకాకుళంలోని బుడగట్టుపాలెంలో పైలట్ ప్రాజెక్టుగా సీ వీడ్ సాగు చేపట్టనున్నారు. విశాఖపట్నం, బుడగట్టుపాలెంలో ప్రయోగాత్మక సాగు చేపట్టారు. పీఎంఎంఎస్వై ద్వారా వీడ్ సాగుకు కేంద్రం 60 శాతం సబ్సిడీ అందిస్తోంది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో 60 వేల యూనిట్ల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది.
సముద్రపు నాచు విశేషాలివీ!
» భూగోళంపై పండించే కూరగాయల కంటే సముద్రంలో పెరిగే నాచు పరిమాణం 30 శాతం ఎక్కువ
» సముద్రంలో అదనపు రసాయనాలు, భారీ లోహాలను ఇది గ్రహిస్తుంది
» పర్యావరణ వ్యవస్థలో కీలకపాత్ర పోషిస్తుంది
» సముద్రపు నాచును జీరో ఇన్పుట్ ఫుడ్గా పిలుస్తారు
» సముద్రంలో కార్బన్ డైఆక్సైడ్ను గ్రహిస్తుంది
» పశువుల ఆహారం, ఆక్వా కల్చర్లో దీనినిఫీడ్ సప్లిమెంట్లుగా వినియోగిస్తారు
» సముద్రపు జీవులకు ఆహారం, ఆశ్రయం అందించి జీవ వైవిధ్యంలో కీలకపాత్ర పోషిస్తుంది
» సేంద్రియ ఎరువుగా కార్బోహైడ్రేట్లు, సూక్ష్మ పోషకాలు, ఖనిజాలు అధికం
» ఆహార పరిశ్రమ, ఔషధ, సౌందర్య రంగం, వ్యవసాయంలో దీనిని వినియోగిస్తారు
» తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం ఇస్తుంది
» మత్స్యకారులు, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశం
తొలి విడతలో 2.2 టన్నుల దిగుబడి
విశాఖపట్నం ఆర్కే బీచ్ సమీపంలో తొలిసారిగా సీ వీడ్ సాగును 50 యూనిట్ల ద్వారా ధాన్ ఫౌండేషన్ మహిళలు చేపట్టారు. మొదటి విడతలో 2.20 టన్నుల దిగుబడి వచ్చింది. కిలో రూ.23 ధర పలికింది. ఈ ప్రాజెక్టుకు పెట్టుబడి రూ.4.50 లక్షలు అయింది. మొదటిసారి పెట్టుబడితో అమర్చిన సామగ్రి 8 ఏళ్లపాటు ఉపయోగపడతాయి. రెండో సాగు నుంచి పెట్టుబడి వ్యయం బాగా తగ్గుతుంది. ఇది ప్రధానంగా మహిళలకు కుటీర పరిశ్రమగా మారుతుంది. కేంద్రం సబ్సిడీ ఇచ్చి సీ వీడ్ సాగుకు అవకాశం కల్పిస్తోంది. – పి.లక్ష్మణరావు, మత్స్యశాఖ జేడీ, విశాఖ
అవగాహన పెంచాలి
సముద్రపు నాచుపై తీరప్రాంత ప్రజలకు అవగాహన పెంచాలి. రాష్ట్రంలో ప్రోసెసింగ్ యూనిట్లు, సీడ్ హేచరీలను ఏర్పాటు చేయాలి. సముద్రపు నాచు పరిశ్రమను వ్యవసాయంగా గుర్తించి బీమా సౌకర్యం కల్పించాలి. సాగు పద్ధతులపై శిక్షణ, సాంకేతిక మార్గదర్శకాలను అందించాలి. – డాక్టర్ పి.రామమోహన్రావు, విశ్రాంత డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ఫిషరీస్, కాకినాడ