Tirumala Srivari Brahmostavam: బ్రహ్మోత్సవం.. చూసి తరిద్దాం! | Sakshi
Sakshi News home page

Tirumala Srivari Brahmostavam: బ్రహ్మోత్సవం.. చూసి తరిద్దాం!

Published Mon, Sep 26 2022 7:41 AM

Tirumala Srivari Brahmostavam Starts From Today - Sakshi

పురాణాల ప్రకారం శ్రీనివాసుడు వేంకటాద్రిపై వెలిసిన తొలినాళ్లలోనే బ్రహ్మదేవున్ని పిలిచి లోకకల్యాణం కోసం తనకు ఉత్సవాలు నిర్వహించాలని ఆజ్ఞాపించారట. ఈ ప్రకారం ఆనంద నిలయం మధ్యలో ఆవిర్భవించిన శ్రీవేంకటేశ్వరుడికి కన్యామాసం(ఆశ్వయుజం) లోని శ్రవణ నక్షత్రం నాటికి పూర్తయ్యేలా బ్రహ్మదేవుడు తొమ్మిది రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహించారట. అందువల్లే ఇవి ‘బ్రహ్మోత్సవాలు’గా ప్రసిద్ధిచెందాయి. సెప్టెంబర్‌ 27 నుంచి అక్టోబర్‌ 5వ తేదీ వరకు 9 రోజుల పాటు జరగనున్న ఈ ఉత్సవాల్లో శ్రీమలయప్పస్వామి వివిధ వాహనాలపై ఊరేగుతూ భక్తులకు దర్శనమివ్వనున్నారు.  

తిరుమల: ప్రపంచ మానవాళి సంక్షేమాన్ని కాంక్షించడంతో పాటు శ్రీవేంకటేశ్వరస్వామివారి దివ్యమైన ఆశీస్సులను భక్తులందరికీ అందించేందుకు శ్రీవారి బ్రహ్మోత్సవాలను టీటీడీ నిర్వహిస్తుంది. ఉదయం వాహనసేవ 8 నుంచి 10 గంటల వరకు, రాత్రి వాహనసేవ 7 నుంచి 9 గంటల వరకు జరుగుతుంది. గరుడవాహనసేవ రాత్రి 7 నుంచి అర్ధరాత్రి ఒంటి గంట వరకు జరుగుతుంది. కరోనా కారణంగా రెండేళ్ల తరువాత భక్తుల నడుమ బ్రహ్మోత్సవాలు జరగనుండడంతో టీటీడీ విస్త్రత ఏర్పాట్లు చేస్తోంది.  
నేడు అంకురార్పణం 
సోమవారం రాత్రి 7 నుంచి 8 గంటల వరకు శాస్త్రోక్తంగా అంకురార్పణం జరగనుంది. ఇందులో భాగంగా శ్రీవారి తరఫున సేనాధిపతి అయిన శ్రీ విష్వక్సేనుడు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపుగా వెళ్లి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షిస్తారు. ఆలయంలో భూమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి పుట్టమన్నులో నవధాన్యాలను నాటుతారు. ఈ ఘట్టం తరువాత రంగనాయకుల మండపంలో ఆస్థానం నిర్వహిస్తారు. అంకురార్పణం అంటే విత్తనం మొలకెత్తడం. శాస్త్రాల ప్రకారం ఉత్సవానికి తొమ్మిది రోజుల ముందు అంకురార్పణం నిర్వహిస్తారు. 

27న ధ్వజారోహణం 
సెప్టెంబర్‌ 27వ తేదీ మంగళవారం సాయంత్రం 5.45 నుంచి 6.15 గంటల మధ్య మీన లగ్నంలో శాస్త్రోక్తంగా ధ్వజారోహణం నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ప్రారంభమవుతాయి. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారి సమక్షంలో వేదగానాల మధ్య మంగళవాద్యాలు మోగుతుండగా అర్చకస్వాములు బంగారు ధ్వజస్తంభంపై గరుడధ్వజాన్ని ఎగురవేస్తారు. ఈ కార్యక్రమం ద్వారా సకల దేవతలను, అష్టదిక్పాలకులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తారు. రాత్రి 9 నుంచి 11 గంటల వరకు పెద్దశేషవాహన సేవ జరుగుతుంది. అదే రోజున తిరుమల శ్రీవారికి ప్రభుత్వం తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. 

వాహన సేవల వైశిష్ట్యం ఇలా.. 
పెద్దశేషవాహనం (27వ తేదీ రాత్రి 9 గంటలకు) 
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో మొదటిరోజు రాత్రి 9 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు ఏడుతలల స్వర్ణ శేషవాహనంపై(పెద్ద శేషవాహనం) తిరుమాడ వీధుల్లో భక్తులను అనుగ్రహిస్తారు. రామావతారంలో లక్ష్మణుడిగా, ద్వాపరయుగంలో బలరాముడుగా శ్రీమన్నారాయణుడికి మిక్కిలి సన్నిహితంగా ఉన్నవాడు శేషుడు. శేషవాహనం ముఖ్యంగా దాస్యభక్తికి నిదర్శనం. 

చిన్నశేషవాహనం (28వ తేదీ ఉదయం 8 గంటలకు) 
రెండో రోజు ఉదయం స్వామివారు ఐదు తలల చిన్నశేష వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. పురాణ ప్రాశస్త్యం ప్రకారం చిన్నశేషుడిని వాసుకిగా భావిస్తారు. శ్రీవైష్ణవ సంప్రదాయానుసారం భగవంతుడు శేషి, ప్రపంచం శేషభూతం. శేషవాహనం ఈ శేషిభావాన్ని సూచిస్తుంది. 

హంస వాహనం (28వ తేదీ రాత్రి 7 గంటలకు) 
బ్రహ్మ వాహనమైన హంస పరమహంసకు ప్రతీక. అది పాలను, నీళ్లను వేరుచేయగలదు. అంటే  మంచిని, చెడును గ్రహించగలిగిన అపురూపమైన శక్తిగలదని అర్థం. శ్రీవారు హంస వాహనాన్ని అధిరోహించి దర్శనమివ్వడం ద్వారా భక్తులలో అహంభావాన్ని తొలగించి దాసోహభావాన్ని(శరణాగతి) కలిగిస్తాడు.  

సింహ వాహనం (29వ తేదీ ఉదయం 8 గంటలకు) 
శ్రీవారి దశావతారాల్లో నాలుగోది నరసింహ అవతారం కావడం సింహం గొప్పదనాన్ని తెలియజేస్తుంది. యోగశాస్త్రంలో సింహం బలానికి (వహనశక్తి), వేగానికి(శీఘ్రగమన శక్తి) ఆదర్శంగా భావిస్తారు. భక్తుడు సింహబలం అంతటి భక్తిబలం కలిగినప్పుడు భగవంతుడు అనుగ్రహిస్తాడు అని వాహనసేవలో అంతరార్థం.  

ముత్యపుపందిరి వాహనం (29న రాత్రి 7 గంటలకు) 
జ్యోతిష్యశాస్త్రం చంద్రునికి ప్రతీకగా ముత్యాలను తెలియజేస్తుంది. శ్రీకష్ణుడు ముక్కుపై, మెడలో ముత్యాల ఆభరణాలు ధరించినట్టు పురాణాల్లో ఉంది. ఆదిశేషుని పడగలను ముత్యాల గొడుగా పూనిన స్వామివారిని దర్శించినా, స్తోత్రం చేసినా సకల శుభాలు కలుగుతాయని పురాణ ప్రశస్తి. భక్తుల జీవితాలకు చల్లదనాన్ని సమకూర్చుతుంది.

కల్పవృక్ష వాహనం (30వ తేదీ ఉదయం 8 గంటలకు) 
క్షీరసాగరమథనంలో ఉద్భవించిన విలువైన వస్తువుల్లో కల్పవృక్షం ఒకటి. కల్పవృక్షం నీడన చేరిన వారికి ఆకలిదప్పులుండవు. కల్పవృక్షం కోరుకున్న ఫలాలన్నింటినీ ప్రసాదిస్తుంది.  

సర్వభూపాల వాహనం  (30వ తేదీ రాత్రి 7 గంటలకు) 
సర్వభూపాల అంటే విశ్వానికే రాజు అని అర్థం. అంటే శ్రీవారు సకల దిక్పాలకులకు రాజాధిరాజని భావం. తూర్పుదిక్కుకు ఇంద్రుడు, ఆగ్నేయానికి అగ్ని, దక్షిణానికి యముడు, నైరుతికి నిరృతి, పశ్చిమానికి వరుణుడు, వాయువ్యానికి వాయువు, ఉత్తరానికి కుబేరుడు, ఈశాన్యానికి పరమేశ్వరుడు అష్టదిక్పాలకులుగా విరాజిల్లుతున్నారు. వీరందరూ స్వామివారిని తమ భుజస్కంధాలపై, హృదయంలో ఉంచుకుని సేవిస్తారు. తద్వారా వారి పాలనలో ప్రజలు ధన్యులవుతారు అనే సందేశాన్ని ఈ వాహనాన్ని అధిరోహించడం ద్వారా స్వామివారు తెలియజేస్తున్నారు.  

మోహినీ అవతారం (అక్టోబర్‌ ఒకటో తేదీ ఉదయం) 
బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజు ఉదయం శ్రీవారు మోహినీరూపంలో శృంగారరసాధి దేవతగా భాసిస్తూ దర్శనమిస్తాడు. పక్కనే స్వామి దంతపు పల్లకిపై వెన్నముద్ద కృష్ణుడై మరో రూపంలో అభయమిస్తాడు. ప్రపంచమంతా తన మాయావిలాసమని, తనకు భక్తులైనవారు ఆ మాయను సులభంగా దాటగలరని మోహినీ రూపంలో ప్రకటిస్తున్నాడు.  

గరుడ వాహనం (1వ తేదీ రాత్రి 7 గంటలకు) 
108 వైష్ణవ దివ్యదేశాల్లోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. దాస్య భక్తితో కొలిచే భక్తులకు తాను దాసుడినవుతానని గరుడవాహనం ద్వారా స్వామివారు తెలియజేస్తున్నాడు. మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని స్వామివారు భక్తకోటికి తెలియజెప్పుతున్నాడు.  

హనుమంత వాహనం (2వ తేదీ ఉదయం 8 గంటలకు) 
శేషాచలాధీశుడు రాముని అవతారంలో తన భక్తుడైన హనుమంతునిపై ఊరేగి భక్తులకు దర్శనమిస్తాడు. హనుమంతుడు భగవత్‌ భక్తులలో అగ్రగణ్యుడు. గురుశిష్యులైన శ్రీరామ హనుమంతులు తత్త్వవివేచన తెలిసిన మహనీయులు కావున ఈ ఇరువురినీ చూసిన వారికి వేదాలతత్త్వం ఒనగూరుతుంది.  

స్వర్ణరథం (2వ తేదీ సాయంత్రం 4 గంటలకు) 
స్వర్ణరథం స్వామికి  ప్రీతిపాత్రమైంది. ద్వాపరయుగంలో శ్రీకష్ణుడు రథగమనాన్ని వీక్షించిన ద్వారక ప్రజలకు ఎంతో ఆనందం కలిగింది. స్వర్ణరథంపై ఊరేగుతున్న శ్రీనివాసుడిని చూసిన భక్తులకూ అలాంటి సంతోషమే కలుగుతుంది.  

గజవాహనం (2వ తేదీ రాత్రి 7 గంటలకు) 
శ్రీవారిని గజేంద్రుడు మోస్తున్నట్లు భక్తులు కూడా నిరంతరం శ్రీనివాసుని హృదయంలో పెట్టుకుని శరణాగతి చెందాలని ఈ వాహనసేవ ద్వారా తెలుస్తోంది.  

సూర్యప్రభ వాహనం (3వ తేదీ ఉదయం 8 గంటలకు) 
సూర్యుడు తేజోనిధి, సకల రోగ నివారకుడు. ప్రకృతికి చైతన్యప్రదాత. వర్షాలు, వాటి వల్ల పెరిగే చెట్లు, చంద్రుడు, అతని వల్ల పెరిగే సముద్రాలు మొదలైనవన్నీ సూర్యతేజం వల్లనే వెలుగొందుతున్నాయి. సూర్యప్రభ వాహనంపైన శ్రీనివాసుని దర్శనం వల్ల ఆరోగ్యం, విద్య, ఐశ్వర్యం, సంతానం వంటి ఫలాలు సిద్ధిస్తాయి.  

చంద్రప్రభ వాహనం (3వ తేదీ రాత్రి 7 గంటలకు) 
చంద్రుడు శివునికి శిరోభూషణమైతే ఇక్కడ శ్రీహరికి వాహనంగా ఉండడం విశేషం. చంద్రోదయం కాగానే కలువలు వికసిస్తాయి. సాగరుడు ఉప్పొంగుతాడు. చంద్రప్రభ వాహనంపై స్వామిని చూడగానే భక్తుల మనసు ఉప్పొంగుతుంది. ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆది దైవికమనే మూడు తాపాలను ఇది నివారిస్తుంది. 

శ్రీవారి రథోత్సవం (4వ తేదీ ఉదయం 7 గంటలకు) 
ఆత్మ రథికుడు, శరీరమే రథం, బుద్ధి సారథి, మనస్సు పగ్గం, ఇంద్రియాలే గుర్రాలు, విషయాలే వీధులు, ఈ రీతిలో శరీరాన్ని రథంతో పోల్చుతారు. దీన్నివల్ల స్థూల శరీరం వేరని, సూక్ష్మ శరీరం వేరని, ఆత్మ అందుకు భిన్నమనే ఆత్మానాత్మ వివేకం కలుగుతుంది. రథోత్సవంలో ముఖ్యంగా కలిగే తత్త్వజ్ఞానమిదే.  

అశ్వవాహనం (4వ తేదీ రాత్రి 7 గంటలకు) 
ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలను వర్ణిస్తున్నాయి. వాటిని అధిరోహించిన పరమాత్మ ఇంద్రియాలను నియమించే నియామకుడు అని కష్ణయజుర్వేదం తెలుపుతోంది. ఈ వాహనంపై కల్కి అవతారంలో తన స్వరూపాన్ని ప్రకటిస్తూ భక్తులను కలిదోషాలకు దూరంగా ఉండాలని తన అవతారంతో ప్రబోధిస్తున్నాడు. 

చక్రస్నానం (5వ తేదీ ఉదయం 6 గంటలకు) 
చక్రస్నానం యజ్ఞాంతంలో ఆచరించే అవభృథస్నానమే. ముందుగా ఉభయదేవేరులతో కలిసి శ్రీవారి సరసన ఉన్న చక్రత్తాళ్వార్లకు అభిషేకం చేస్తారు. ఈ అభిషేక కైంకర్యాన్ని అందుకుని చక్రత్తాళ్వార్‌ ప్రసన్నుడవుతాడు. చక్రస్నానం సమయంలో అధికారులు, భక్తులందరూ పుష్కరిణిలో స్నానం చేసి యజ్ఞఫలాన్ని పొందుతారు.  

ధ్వజావరోహణం (5వ తేదీ రాత్రి 7 గంటలకు) 
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో చివరిదైన తొమ్మిదో రోజు రాత్రి బంగారు తిరుచ్చి ఉత్సవం తరువాత ధ్వజావరోహణం జరుగుతుంది. ఈ ఘట్టంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. 

Advertisement
Advertisement