ఆనందం.. అంతలోనే విషాదం 

Three Youths Deceased In Road Accident - Sakshi

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకుల దుర్మరణం 

ద్విచక్రవాహనంపై వెళ్లుండగా బొలెరో ఢీకొని ఘటన  

ముద్దనూరు: ఉగాది పండుగ ఆనందంలో ఉన్న కొత్తపల్లె ఒక్కసారిగా కన్నీటి సంద్రంగా మారింది. రోడ్డు ప్రమాదంలో ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు దుర్మరణం చెందడంతో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటన తాడిపత్రి–కడప ప్రధాన రహదారి ముద్దనూరు సమీపంలో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. సీఐ హరినాథ్‌ తెలిపిన వివరాల మేరకు... కొత్తపల్లెకు చెందిన చంద్రశేఖర్‌రెడ్డి(25), రవితేజ(19), శివశంకర్‌(25) పని నిమిత్తం ద్విచక్రవాహనంపై ముద్దనూరు బయలుదేరారు. ఈక్రమంలో తిమ్మాపురం క్రాస్‌ను దాటి డాబా సమీపంలోకి రాగానే ముద్దనూరు వైపు నుంచి ఎదురుగా వస్తున్న బొలెరో వాహనం ద్విచక్రవాహనాన్ని ఢీకొంది.

ప్రమాదంలో చంద్రశేఖర్‌రెడ్డి, రవితేజ, శివశంకర్‌ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ప్రమాద విషయం తెలియగానే ఘటనా స్థలానికి బాధిత కుటుంబీకులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. చెల్లాచెదురుగా పడిఉన్న యువకుల మృత దేహాలను చూసి బంధువుల రోదనలు మిన్నంటాయి. ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా ప్రమాదంలో బొలెరోలో ప్రయాణిస్తున్న ఇరువురికి స్వల్పగాయాలయ్యాయి. పోస్టుమార్టం నిమిత్తం మృత దేహాలను జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ హరినాథ్‌ తెలిపారు.
చదవండి:
ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దారుణ హత్య    
పిల్లకు పాలు.. తల్లికి కూల్‌ డ్రింక్‌

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top