శ్రీశైలంలో నీటిని వాడుకోకుండా ఏపీని అడ్డుకోండి | Telangana officials protested with Krishna Board Chairman | Sakshi
Sakshi News home page

శ్రీశైలంలో నీటిని వాడుకోకుండా ఏపీని అడ్డుకోండి

Feb 27 2025 5:55 AM | Updated on Feb 27 2025 5:55 AM

Telangana officials protested with Krishna Board Chairman

సాగర్‌ నుంచి ఏపీ తీసుకుంటున్న జలాలను 5,000 క్యూసెక్కులకు తగ్గించాలి

కృష్ణా బోర్డు చైర్మన్‌ను కలిసి నిరసన తెలిపిన తెలంగాణ అధికారులు

అత్యవసర సమావేశం నేటికి వాయిదా వేయడంపై తీవ్ర అసంతృప్తి

సాక్షి, అమరావతి: శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీటిని వాడుకోకుండా ఏపీని నిలువరించాలని కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ)ని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్‌ చేసింది. నాగార్జున­సాగర్‌ నుంచి కుడి ప్రధాన కాలువ ద్వారా ఏపీ తీసుకుంటున్న 7000 వేల క్యూసెక్కులను తక్షణమే 5000 క్యూసెక్కులకు తగ్గించేలా ఆదేశాలు జారీ చేయా­లని కోరింది. రెండు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, సాగర్‌లో మిగిలి ఉన్న నీటి నిల్వలను ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు పంపిణీ చేసే అంశంపై బుధవారం మధ్యాహ్నం 3.30 గంటలకు హైద­రా­బాద్‌ జలసౌధలో కేఆర్‌ఎంబీ రెండో అత్యసవర సమావేశం జరగాల్సి ఉండగా, ఏపీ విజ్ఞప్తితో గురువారం ఉదయం 11 గంటలకు వాయిదా పడింది. 

దీంతో తెలంగాణ నీటిపారు­దల శాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్‌ బొజ్జా, ఇతర అధికారు­లు బోర్డు చైర్మన్‌ అతుల్‌ జైన్‌తో సమావేశమై తీవ్ర నిరసన తెలిపారు. ఇప్పటికే ఏపీ వాటాకి మించి జలాలను వాడుకుందని, ఇంకా అనధికారికంగా నీళ్లను తోడుకోవడానికే సమా­వేశా­నికి గైర్హాజరైందని రాహుల్‌ బొజ్జా అసహనం వ్యక్తంచేశారు. కృష్ణా బోర్డు పట్ల ఏపీకి కనీస గౌరవం లేదని, ఆ రాష్ట్ర అధికారులు తరుచూ బోర్డు సమావేశాలకు గైర్హాజరవుతున్నా­రని మండిపడ్డారు. 

ఒంగోలు సీఈ హైదరాబాద్‌లోని జలసౌధలోనే ఉన్నా ఈ సమావేశానికి రాలేదని అన్నారు. గురువారం నిర్వహించే సమావేశంలో రెండు రాష్ట్రాలు పర­స్పర అంగీకారంతో ఒక నిర్ణయానికి వస్తాయని బోర్డు చైర్మన్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. ఒక వేళ సయోధ్య కుదరకపోతే ఈ అంశాన్ని కేంద్ర జలశక్తి శాఖకి నివేదిస్తామని చెప్పారు.

తెలంగాణకి 63.. ఏపీకి 55 టీఎంసీలు!
ఈ నెల 24న జరిగిన కృష్ణా బోర్డు తొలి అత్యవసర సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు తెలంగాణ తరపున నల్లగొండ చీఫ్‌ ఇంజనీర్‌ వి.అజయ్‌­కుమార్, ఏపీ తరపున ఒంగోలు చీఫ్‌ ఇంజనీర్‌ బి.శ్యామ్‌ ప్రసాద్‌ బుధవారం జలసౌధలో సమావే­శ­మై ప్రస్తుత రబీలో సాగర్‌ నుంచి ఇరు రాష్ట్రాలకు అవసరమైన సాగునీటి ప్రణాళికను సిద్ధం చేశారు. కనీస నిల్వ మట్టానికి ఎగువన శ్రీశైలంలో 36.51 టీఎంసీలు, సాగర్‌లో 30.57 టీఎంసీలు కలిపి మొత్తం 67 టీఎంసీలు లభ్యతగా ఉన్నట్టు నిర్థారించారు. 

శ్రీశైలం నుంచి ఏపీకి 10 టీఎంసీలు, తెలంగాణకి 13 టీఎంసీలు, సాగర్‌ నుంచి ఏపీకి 45 టీఎంసీలు, తెలంగాణకి 50 టీఎంసీలు అవసర­మని నిర్థారించారు. మొత్తం కలిపి ఏపీ 55 టీఎంసీ­లు, తెలంగాణ 63 టీఎంసీలు అవసరమని కోరా­యి. ఈ ప్రణాళిక ఆధారంగా గురువారం జరిగే రెండో అత్యవసర సమావేశంలో రెండు రాష్ట్రాలకు నీటి కేటాయింపులపై బోర్డు నిర్ణయం తీసుకోనుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement