
కుప్పం నియోజకవర్గంలో మరో ఆటవిక చర్య
చనిపోయిన వ్యక్తి అంత్యక్రియలు అడ్డుకున్న టీడీపీ వర్గీయులు
సొంత పొలంలో ఖననం చేసుకోవాలని హుకుం
కుప్పం రూరల్: ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో రోజుకో ఆటవిక చర్య వెలుగు చూస్తూనే ఉంది. మొన్న శాంతిపురం మండలంలో ఎయిర్పోర్ట్ భూముల వ్యవహారంలో మహిళలను కొట్టడం, నిన్న కుప్పం మండలం నారాయణపురంలో భర్త అప్పు చెల్లించలేదని భార్యను చెట్టుకు కట్టేసి కొట్టడం, జరుగు పంచాయతీలో మగదిక్కు లేని మహిళను ఆస్తి తగాదాలో కట్టేసి కొట్టడం వంటి ఘటనలు అందరినీ నివ్వెరపోయేలా చేస్తున్నాయి. ఈ పరంపరలో తాజాగా ఆదివారం మరో దారుణ ఘటన చోటు చేసుకుంది.
చికిత్స పొందుతూ బెంగళూరులో మృతి చెందిన వ్యక్తిని గ్రామంలో అంత్యక్రియలకు అనుమతించకుండా అడ్డుకున్న వైనం విస్తుగొలుపుతోంది. వివరాల్లోకి వెళితే... కుప్పం మండలం మార్వాడ గ్రామానికి చెందిన నాగరాజుకు శివానంద, మంజునాథ్, శివశంకర్ (35) అనే ముగ్గురు కుమారులు ఉన్నారు. శివశంకర్ నెల రోజుల క్రితం డెంగీ జ్వరం బారిన పడ్డాడు. స్థానికంగా చూపించినా ఫలితం లేకపోవడంతో మెరుగైన చికిత్స కోసం బెంగళూరులోని సెంట్ జాన్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శివశంకర్ శనివారం రాత్రి మృతి చెందాడు. కుటుంబీకులు మృతదేహంతో గ్రామానికి బయలుదేరారు.
ఈ విషయం తెలుసుకున్న టీడీపీ వర్గీయులు.. మృతదేహాన్ని శ్మశానంలో పూడ్చడానికి అనుమతించమని, సొంత పొలంలో ఖననం చేసుకోవాలని హుకుం జారీ చేశారు. అంత్యక్రియల సమయంలో ఆచారాలు (క్రతువు) నిర్వహించే ఇతర సామాజిక వర్గాల వారిని అడ్డుకున్నారు. ఎంతగా ఒప్పించే ప్రయత్నం చేసినా కనికరించ లేదు. దీంతో బాధిత కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. ఆదివారం ఉదయం పోలీసులు నచ్చజెప్పినా ససేమిరా అన్నారు. చివరకు డీఎస్పీ పార్థసారథి అక్కడికి చేరుకుని కేసు పెట్టాల్సి వస్తుందని మందలించడంతో వెనక్కు తగ్గారు. పోలీసు భద్రత మధ్య వారు శ్మశానంలో అంత్యక్రియలు పూర్తి చేశారు.