
పెద్దతిప్పసముద్రం: ములకలచెరువులో నకిలీ మద్యం తయారీ కేంద్రంపై శుక్రవారం పోలీసులు జరిపిన దాడుల్లో మండలానికి చెందిన టీడీపీ కీలక నేత కట్టా సురేంద్రనాయుడు సహా మరికొందరు పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ జోగేంద్ర, సీఐ మల్లయ్య బృందం శనివారం అన్నమయ్య జిల్లా టి.సదుం పంచాయతీ చెన్నరాయునిపల్లి సమీపంలో కట్టా సురేంద్రనాయుడు ‘ఆంధ్రవైన్స్’ పేరుతో నిర్వహిస్తున్న మద్యం దుకాణంలో ఉన్న బాటిళ్లకు పంచనామా నిర్వహించి వైన్షాపు లైసెన్స్ను సీజ్ చేసి సీలు వేశారు.
ఎక్సైజ్ పోలీసులు బృందంగా ఏర్పడి మఫ్టీలో కల్తీ మద్యం రవాణా, నిల్వలపై మండలంలో నిఘా వేసినట్టు తెలుస్తోంది. ఇన్నాళ్లు పుట్టగొడుగుల్లా వెలసిన బెల్ట్షాపుల్లో దర్జాగా మద్యం విక్రయాలు చేపట్టేవారు. కల్తీ మద్యం రాకెట్ గుట్టు రట్టు కావడంతో బెల్ట్షాపులు నిర్వహిస్తున్న గ్రామస్థాయి కూటమి కార్యకర్తల్లో ఆందోళన మొదలైంది. పోలీసులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించి కల్తీ మద్యంతో పట్టుబడితే ఎక్కడ కేసుల్లో ఇరుక్కుపోతామోనని భావించి బెల్ట్షాపులను మూసేసి పరిచయస్తులకు మాత్రమే చాటుగా మద్యం విక్రయిస్తున్నట్టు సమాచారం.