
‘కలెక్షన్ బాయ్స్’ అవతారమెత్తిన ఎక్సైజ్ సిబ్బంది
చిత్తూరు జిల్లాలో ఒక్కో మద్యం దుకాణం నుంచి రూ.30 వేలు వసూలు
వసూలైన మొత్తంలో కూటమి నేతలకు వాటాలు
చిత్తూరు అర్బన్: చిత్తూరు జిల్లాలోని 114 మద్యం దుకాణాలు, 8 బార్లలో కూటమి నేతలు నెలవారీ మామూళ్లు (ఎల్లో టాక్స్) వసూలు చేస్తున్నారు. అదికూడా వాళ్ల చేతికి ఏమాత్రం మట్టి అంటుకోకుండా జాగ్రత్తలు పడుతున్నారు. మొత్తం వసూళ్ల ప్రక్రియ కోసం అబ్కారీ శాఖలోని కొందరు సిబ్బందిని కలెక్షన్ బాయ్స్గా నియమించుకున్నారనే విమర్శలున్నాయి.
ఒక్కో మద్యం దుకాణం నుంచి నెలకు రూ.30 వేల చొప్పున, బార్ నుంచి నెలకు రూ.20 వేల చొప్పున మొత్తంగా నెలకు రూ.అరకోటి వరకు ‘ఎల్లో టాక్స్’ వసూలవుతున్నట్టు తెలుస్తోంది. ఇందులో ప్రతి నియోజకవర్గంలో కూటమి పార్టీ ప్రధాన నాయకుడికి 70 శాతం, మద్యం దుకాణం ఉన్న పోలీస్ స్టేషన్కు 10 శాతం, 20 శాతం ఎక్సైజ్ అధికారులకు ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మళ్లీ ఇందులో అబ్కారీ శాఖకు చెందిన ఓ అధికారికి ఒక్కో దుకాణానికి నెలకు రూ.4 వేలు, మరో అధికారికి రూ.2 వేలు పంచాల్సిన బాధ్యత ఆ శాఖ అధికారులదే.