కృష్ణాజిల్లా: పవన్ కల్యాణ్పై సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి మండిపడ్డారు. ప్రశ్నించండి, విమర్శించండి , మర్యాద ఇచ్చి మాట్లాడండని పవన్ అంటున్నారని ఆమె చెప్పారు. తాము రెండేళ్లుగా పవన్ గురించి మర్యాదగానే మాట్లాడుతున్నామని, మర్యాదగానే ప్రశ్నిస్తున్నామని తెలిపారు. మర్యాదగానే కూటమి ప్రభుత్వాన్ని ఎదుర్కొంటున్నామని చెప్పారు.
‘‘ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వంలో ఎలాంటి స్పందన లేదు. సుగాలి ప్రీతి కేసులో ఎలాంటి పురోగతి లేదు. సుగాలి ప్రీతికి న్యాయం చేస్తారని పవన్కు జనం ఓట్లేశారు. పవన్ డిప్యూటీ సీఎం అయినప్పటికీ ఇప్పటి వరకూ మాకు న్యాయం జరగలేదు. రావణ్ మీద పెట్టిన శ్రద్ధ సుగాలి ప్రీతి కేసులో ఎందుకు పెట్టలేదు? ఒక్కరినైనా పిలిపించి సుగాలి ప్రీతి కేసులో విచారణ జరిపించారా? సుగాలి ప్రీతి కేసుపై పదే పదే ప్రశ్నిస్తున్నారని ఆ గొంతును నొక్కేయాలని చూస్తున్నారు.
ఎందుకు నాకు మాటిచ్చి మర్చిపోయారో పవన్ సమాధానం చెప్పాలి. రావణ్ మీద పెట్టిన ఇంటరెస్ట్ సుగాలి ప్రీతి కేసుపై పెట్టుంటే పది శాతమైనా దర్యాప్తు జరిగి ఉండేది. మహిళల కన్నీళ్లే కూటమి ప్రభుత్వ పతనానికి నాంది. అన్ని కేసుల్లో పవర్ మీ చేతుల్లోకి తీసేసుకుంటున్నారు. సుగాలి ప్రీతి కేసులో పవర్ను పక్కన పెట్టేస్తున్నారు.
జనసేన నేతలు, వీర మహిళలు, జన సైనికులతో నాపై మాటల దాడి చేయిస్తున్నారు. వికలాంగురాలినైన నన్ను బాడీ షేమింగ్ చేస్తున్నారు. నా కులాన్ని దూషిస్తున్నారు. రావణ్పై రాజద్రోహం కేసు పెట్టించి రిమాండ్ కు పంపిస్తున్నారు కదా.. ఈ రోజు మీరు ప్రశాంతంగా నిద్రపోండి పవన్. ప్రశ్నించండి అంటున్నారు ప్రశ్నిస్తే దానికి సమాధానం చెప్పలేకపోతున్నారు’’ అని ఆవేదన వ్యక్తం చేశారు.


